Begin typing your search above and press return to search.

అమరావతిలో పవన్ స్పీచ్ పీక్స్... చాక్లెట్ ఇచ్చి అభినందించిన మోడీ!

అవును... అమరావతి పునఃనిర్మాణ సభలో ప్రసంగించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్... ఈ కార్యక్రమానికి విచ్చేసిన మోడీకి చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు చెప్పారు.

By:  Tupaki Desk   |   2 May 2025 11:41 AM
అమరావతిలో పవన్  స్పీచ్  పీక్స్... చాక్లెట్  ఇచ్చి అభినందించిన  మోడీ!
X

అమరావతి పునఃనిర్మాణ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా అమరావతి రైతుల త్యాగాలు, పోరాట పటిమను గుర్తు చేసుకున్న ఆయన.. గత ప్రభుత్వంపై సెటైర్లు పేల్చారు. మోడీని భవానీ మాత మరింత శక్తిమంతున్ని చేయాలని ఆకాంక్షించారు. ప్రసంగం అనంతరం పవన్ ని అభినందించిన మోడీ.. చాక్లెట్ ఇవ్వడం గమనార్హం.

అవును... అమరావతి పునఃనిర్మాణ సభలో ప్రసంగించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్... ఈ కార్యక్రమానికి విచ్చేసిన మోడీకి చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. దేశమే తన కుటుంబంగా మోడీ భావిస్తుంటారని కొనియాడారు. దేశానికే తలమానికంగా నిలిచే అమరావతికి సహకరిస్తున్న మోడీకి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం.. రైతుల త్యాగాలు పవన్ గుర్తుచేసుకున్నారు.

ఇందులో భాగంగా... గత ఐదేళ్లుగా అమరావతికి భూములిచ్చిన రైతులు నలిగిపోయారని.. లాఠీ దెబ్బలు తిన్నారని అన్నారు. అమరావతి రైతుల త్యాగాలను మరిచిపోలేమని.. వారి త్యాగాలకు జవాబుదారీగా ఉంటామని.. రాజధాని నిర్మించి వారి రుణం తీర్చుకుంటామని పవన్ అన్నారు. రైతులు రాజధానికి ఇచ్చింది భూములు మాత్రమే కాదని.. రాష్ట్రానికి భవిష్యత్ ఇచ్చారని అన్నారు.

దివిసీమ తుపానులా గత ప్రభుత్వం అమరావతిని తుడిచేసింది, రైతులను వేధించిందని, అయినప్పటికీ ధర్మయుద్ధంలో అమరావతి రైతులే విజయం సాధించారని.. ఇది ఐదు కోట్ల ఆంధ్రుల హబ్ అని పవన్ అన్నారు. అమరావతి ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుందని.. భవిష్యత్తులో మన విద్యార్థులు హైదరాబాద్, బెంగళూరు వెళ్లాల్సిన అవసరం ఉండదని తెలిపారు.

కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలు ఉండటం వల్లే అమరావతి శరవేగంగా అభివృద్ధి జరుగుతుందని.. చంద్రబాబు పాలనా దక్షతతో అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దుతామని.. అమరావతి రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికంగా నిలుస్తుందని పవన్ కల్యాణ్ ఆకాక్షించారు.

ఈ విధంగా అమరావతి పునఃనిర్మాణ సభా వేదికపై ప్రసంగం పూర్తైన తర్వాత.. పవన్ ను మోడీ అభినందించారు. ఈ సందర్భంగా వేదికపై పవన్ కు ప్రధాని మోడీ చాక్లెట్ అందజేశారు. ఈ సన్నివేశం ఈ కార్యక్రమంలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది!