Begin typing your search above and press return to search.

తెలంగాణాలో పవన్ ప్రచారం... ఎప్పుడంటే....?

ఎందుకంటే తెలంగాణా ప్రచారం ఇపుడు పీక్స్ కి చేరుకుంది. సరిగ్గా పదమూడు రోజులు మాత్రమే ప్రచారానికి గడువు ఉంది.

By:  Tupaki Desk   |   16 Nov 2023 2:45 AM GMT
తెలంగాణాలో పవన్ ప్రచారం... ఎప్పుడంటే....?
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణాలో ఎన్నికల ప్రచారం చేస్తారా చేస్తే ఎపుడు ఇవీ ప్రశ్నలు. రాజకీయ వర్గాలలో వస్తున్న సందేహాలు. ఎందుకంటే తెలంగాణా ప్రచారం ఇపుడు పీక్స్ కి చేరుకుంది. సరిగ్గా పదమూడు రోజులు మాత్రమే ప్రచారానికి గడువు ఉంది.

పవన్ తన పార్టీ తరఫున ఎనిమిది మంది అభ్యర్ధులను పోటీకి పెట్టారు. బీజేపీతో పొత్తు ఉంది. ఒకే ఒక్క మీటింగ్ అది కూడా ప్రధాని నరేంద్ర మోడీతో కలసి ఆయన పాల్గొన్నారు. ఆ తరువాత మాత్రం ఆయన ప్రచారంలోకి దిగలేదు.

నిజానికి ఈ పాటికి పవన్ చాలా సభలను కవర్ చేస్తారు అని అంతా అనుకున్నారు. కానీ పవన్ నుంచి అయితే అలాంటి ప్రకటన రావడంలేదు. ఇపుడు ఈ ప్రశ్న నేరుగా వెళ్ళి వెళ్ళి బీజేపీ తెలంగాణా బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి వద్దకే వెళ్ళింది.

ఆయన మీడియాతో మాట్లాడినపుడు వచ్చిన మొదటి ప్రశ్న ఇదే. పవన్ కళ్యాణ్ ఎపుడు ప్రచారంలోకి వస్తున్నారు అని. దానికి కిషన్ రెడ్డి ఇచ్చిన రిప్లై కూడా ఆసక్తిగా ఉంది. పవన్ కళ్యాణ్ ఎన్డీయేలో భాగస్వామి. ఆయన బీజేపీ జనసేన తరఫున ప్రచారాన్ని త్వరలో చేస్తారు అని.

త్వరలో అంటే ఎపుడు అన్నది మాత్రం ఎవరికీ తెలియదు అనే అంటున్నారు. ఒక వైపు పోలింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎంత చేసినా ఈ కొద్ది రోజులలోనే చేయాల్సి ఉంది. కానీ పవన్ ప్రచారం ఎపుడు అంటే జవాబు అయితే లేదు. పవన్ పార్టీ అభ్యర్ధులు కూడా తమ నేత ప్రచారం చేస్తే తమకు విజయావకాశాలు బాగా పెరుగుతాయని భావిస్తున్నారు.

అయితే పవన్ ప్రచారం ఎపుడు అన్నది జనసేన అభ్యర్ధులు చెప్పడంలేదు. బీజేపీ అధ్యక్షుడి హోదాలో కిషన్ రెడ్డి మాత్రం త్వరలో అంటున్నారు. తమ పార్టీ జనసేన కలసి మొత్తం 39 మంది బీసీ అభ్యర్ధులకు టికెట్ ఇచ్చిందని, తమది బీసీల పార్టీ అని కూడా కిషన్ రెడ్డి చెప్పారు.

ఇవన్నీ పక్కన పెడితే పవన్ ప్రచారం చేస్తారా అన్నది మళ్లీ ప్రశ్నగానే ఉంది. ఒక వైపు తెలుగుదేశం జెండాలు కాంగ్రెస్ జెండాలతో కలసి కనిపిస్తున్నాయి. అదే తెలుగుదేశంతో జనసేన ఏపీలో పొత్తు పెట్టుకుంది. పవన్ కనుక గట్టిగా ప్రచారం చేస్తే అది కాంగ్రెస్ కి దెబ్బ అవుతుంది అని అంటున్నారు.

ఎందుకంటే ఓట్లు చీలి అంతిమంగా బీయారెస్ కి ఎంతో కొంత మేలు చేస్తుంది అని అంటున్నారు. అదే విధంగా బీజేపీ గ్రాఫ్ చూస్తే రోజు రోజుకీ పడిపోతోంది. బీజేపీ గెలుస్తుందా అంటే అదీ లేదు. ఇక జనసేన అభ్యర్ధులు ఒక్కరైనా గెలుస్తారా అంటే ఆ గ్యారంటీని ఇచ్చే సీటూ కనిపించడంలేదు.

కాంగ్రెస్ బీయారెస్ ల మధ్యనే హోరా హోరీ పోరు సాగుతోంది. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ సీరియస్ గా బరిలోకి దిగి ప్రచారం చేసినా అది ఏపీలో రాజకీయాన్ని కూడా ప్రభావితం చేస్తుందని, టీడీపీ జనసేన పొత్తుల కధలో కూడా కొత్త ట్విస్టులకు కారణం అయ్యేలా ఉందని అంటున్నారు.

అందుకే పవన్ సైలెంట్ అయ్యారా అన్నది కూడా చర్చకు వస్తోంది. మరి కిషన్ రెడ్డి మాత్రం త్వరలో పవన్ ప్రచారం అంటున్నారు. నిజంగా పవన్ ప్రచారం చేస్తే మాత్రం ఈసారి తెలంగాణా ఎన్నికల్లో అదే హైలెట్ అవుతుంది అని అంటున్నారు. మొత్తానికి పవన్ ప్రచారం కోసం అంతా వెయిటింగ్ అని మాత్రం వినిపిస్తున్న మాట.