34 మంది కుటుంబం.. హరియాణాలో ఐస్ క్రీమ్ లు అమ్ముతున్న పాక్ మాజీ ఎంపీ
ఏప్రిల్ 24 నుంచి 28 వరకు 537 మంది పాకిస్థానీలు అట్టారీ-వాఘా సరిహద్దు ద్వారా దేశం వీడి వెళ్లారు.
By: Tupaki Desk | 30 April 2025 2:30 PMపర్యటకులపై గత వారం జరిగిన పెహల్గామ్ ఉగ్రదాడి అనంతరం దేశంలో పరిస్థితులు మారిపోయాయి. భారత్ లో ఉన్న పాకిస్థానీలను వెంటనే వెళ్లిపోవాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వారికి జారీ చేస్తున్న 14 రకాల వీసాలను కూడా రద్దు చేసింది. మరోవైపు పెహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ ఏదో భారీ ప్రయత్నమే చేస్తోంది. దాడి ఇప్పుడో అప్పుడో అన్నట్లుగా ఉంది భారత్.
ఏప్రిల్ 24 నుంచి 28 వరకు 537 మంది పాకిస్థానీలు అట్టారీ-వాఘా సరిహద్దు ద్వారా దేశం వీడి వెళ్లారు.
ఇక ప్రేమ కోసం రెండేళ్ల కిందట పాకిస్థాన్ నుంచి భారత్ కు వచ్చి మన దేశ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న సీమా హైదర్ వంటి వారి గురించి కూడా ఇటీవల చర్చ నడిచిన సంగతి తెలిసిందే. ఆమెను దేశం విడిచి వెళ్లమంటారా? అనేది తేలలేదు.
పాక్ జాతీయులు అందరూ ఇప్పటికే వెళ్లిపోయి ఉంటారనడంలో సందేహం లేదు. ఇక ఏరివేత ప్రక్రియపై అన్ని రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్షించారు. కాగా, పాక్ మాజీ ఎంపీ ఒకరు మాత్రం భారత్ లో ఉంటున్న సంగతి తెలుసా?
భారత్ లో ఉండడమే కాదు.. హరియాణాలో ఆ పాక్ మాజీ ఎంపీ ఐస్ క్రీమ్ లు అమ్ముతున్నారు. ఆయన పేరు దబయా రామ్. ఈయనది 35 మంది సభ్యులు ఉన్న చాలా పెద్ద కుటుంబం. ఆరుగురు కుటుంబ సభ్యులు భారత పౌరసత్వం కలిగి ఉన్నారు. 28 మంది వేచి చూస్తున్నారు. హరియాణాలోని ఫతేహాబాద్ జిల్లా రతియా తహసీల్ రత్తన్గఢ్ లో వీరు నివాసం ఉంటున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో దబయా రామ్ కుటుంబాన్ని స్థానిక పోలీసులు విచారణకు పిలిచారు. ఆ తర్వాత వారిని ఇంటికి పంపించారు.
దేశ విభజనకు రెండు సంవత్సరాల ముందు పాకిస్తాన్ పంజాబ్ లో పుట్టారు దబయా రామ్. ఎంత ఒత్తిడి వచ్చినా మతం మారకుండా పాక్ లోనే కొనసాగారు. 1988లో రామ్ లోహియా-బఖర్ జిల్లాల నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
దబయా రామ్ సమీప బంధువును మత అతివాదులు ఎత్తుకెళ్లి వివాహం చేసుకోవడంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పాకిస్థాన్ సుప్రీం కోర్టుకు వెళ్లినా న్యాయం దక్కలేదు. దీంతో నిరాశ, భవిష్యత్ పై బెంగతో 2000 సంవత్సరంలో నెల రోజుల వీసాపై భారత్ లోని హరియాణాలో ఉన్న రోహ్ తక్ కు వచ్చారు. 2018 వరకు ఏటా, ఐదేళ్లకు వీసాలను పొడిగించుకుంటూ వచ్చారు. తర్వాత రతన్ గఢ్ లో స్థిరపడ్డారు.
నాటినుంచి సైకిల్ రిక్షా మీద ఐస్ క్రీమ్ లు, కుల్ఫీలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు దబయా రామ్. ఈయనకు ఏడుగురు పిల్లలు కాగా.. అందరూ భారత్ లోనే వివాహాలు చేసుకున్నారు.
దబయా రామ్ కు భారత పౌరసత్వం దక్కింది. పాకిస్థాన్ లో అతడి పేరు దేశ్ రాజ్. భారత్ కు వచ్చాక ఓటరు కార్డు జారీ సందర్భంగా మాత్రం దబయా రామ్ గా మార్చారు. పాక్ ఎంపీల జాబితాలో ఆయన పేరు అల్లా దబాయాగా ఉండడం గమనార్హం.
తమ పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు లేదా స్థిరమైన ఉద్యోగాలు పొందాలనేది దబయా రామ్ కోరిక. ఇద్దరు మహిళలు సహా ఆరుగురు కుటుంబ సభ్యులకు భారత పౌరసత్వం ఉంది. 28 మంది దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి.