Begin typing your search above and press return to search.

పవిత్ర మాసంలోనూ ప్రతీకార జ్వాల.. 8 మంది మహిళలు, పిల్లలు బలి

ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకొనే పవిత్ర రంజాన్ మాసంలోనూ ఆ రెండు దేశాల మధ్య ప్రతీకార జ్వాలలు చల్లారడం లేదు

By:  Tupaki Desk   |   18 March 2024 12:30 PM GMT
పవిత్ర మాసంలోనూ ప్రతీకార జ్వాల.. 8 మంది మహిళలు, పిల్లలు బలి
X

ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకొనే పవిత్ర రంజాన్ మాసంలోనూ ఆ రెండు దేశాల మధ్య ప్రతీకార జ్వాలలు చల్లారడం లేదు. ఓ మిలిటెంట్ గ్రూప్ దాడికి.. సమాధానంగా మరో దేశం చేస్తున్న దాడులకు సాధారణ ప్రజలు బలవుతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. తాజాగా 8 మంది అమాయక మహిళలు, చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

ప్రజలంతా నిద్రలో ఉండగా..

పాకిస్థాన్ సరిహిద్దులోని అఫ్ఘానిస్థాన్ ప్రాంతం ఖోస్త్, పక్టికా. ఈ ప్రావిన్సుల్లోని పౌరుల నివాసాలపై సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పాకిస్థాన్ వైమానిక దాడులకు దిగింది. ప్రజలంతా మంచి నిద్రలో ఉండగా ఈ దాడికి పాల్పడింది. 8 మంది చనిపోగా.. అందరూ మహిళలు, చిన్న పిల్లలే.

ప్రతీకారంగా..

అఫ్ఘానిస్థాన్ సరిహద్దు వెంట పాకిస్థాన్ భూభాగంలోనే పాకిస్తాన్‌ సైన్యంపై కొందరు ఆదివారం దాడులకు పాల్పడ్డారు. పలువురు పాక్ సైనికులు చనిపోయారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని పాక్ అధ్యక్షఉడు ఆసిఫ్‌ అలీ జర్దారీ ప్రకటించారు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే ఆఫ్ఘాన్ లోని ప్రావిన్స్ లపై వైమానిక దాడులు మొదలయ్యాయి.

ఆ ఉగ్ర మూక పనికి..

మూడేళ్ల కిందట అఫ్ఘానిస్థాన్ లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. అప్పటినుంచే పాకిస్థాన్ తో సంబంధాలు దెబ్బతిన్నాయి. చైనాతో అంటకాగాలని పాక్ ఒత్తిడి తెస్తుండగా అఫ్ఘాన్ లోని తాలిబాన్లు దానిని వ్యతిరేకిస్తున్నారు. కొన్నాళ్లుగా

ఇరు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో తెహ్రీక్‌ ఈ తాలిబన్‌ పాకిస్థాన్ (టీటీపీ) అనే ఉగ్రవాద సంస్థ తరచూ ఉద్రిక్తతలు రేపుతోంది. ఈ మిలిటెంట్‌ గ్రూప్ నకు గట్టి పట్టుంది. వీరే.. పాక్ సైనికులపై దాడి జరిపి లెఫ్టినెంట్‌ కల్నల్‌తో సహా పలువురు జవాన్లను హతమార్చారు. హతుల అంత్యక్రియల సమయంలోనే ప్రతీకారం తీర్చుకుంటామని పాక్ అధ్యక్షుడు జర్దారీ ప్రకటించారు.