ఉగ్రవాదులతో పాక్ బంధం నిజమే.. మళ్లీ బయటపడిందిలా..
పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చీఫ్, ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీతో పాటు, పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా ఈ విషయాన్ని పరోక్షంగా ధృవీకరించారు.
By: Tupaki Desk | 2 May 2025 10:15 AMజమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన కిరాతక ఉగ్రదాడి నేపథ్యంలో భారత్తో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య, పాకిస్థాన్ తమ ఉగ్రవాద సంస్థలతో గతంలో ఉన్న సంబంధాలను అంగీకరించింది. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చీఫ్, ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీతో పాటు, పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా ఈ విషయాన్ని పరోక్షంగా ధృవీకరించారు.
పహల్గాం దాడి తర్వాత పాకిస్థాన్ వ్యవహరిస్తున్న తీరుపై వస్తున్న విమర్శల నేపథ్యంలో బిలావల్ భుట్టో మీడియాతో మాట్లాడుతూ, ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ మద్దతు, ఆర్థిక సాయం అందించిందన్నది రహస్యం కాదని అంగీకరించారు. "రక్షణ మంత్రి చెప్పిన ప్రకారం.. పాకిస్థాన్కు గతం ఉందనేది రహస్యం కాదని నేను భావిస్తున్నా. ఫలితంగా మనం బాధపడ్డాం. పాకిస్తాన్ నష్టపోయింది. ఆ పరిణామాల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. ఈ సమస్య పరిష్కారానికి అంతర్గత సంస్కరణలు చేపట్టాం. పాకిస్థాన్ తీవ్రవాద చరిత్ర తిరస్కరించలేనిది. అయితే అది ముగిసిన అధ్యాయం. అది మన చరిత్రలో ఒక దురదృష్ట భాగం" అని ఆయన పేర్కొన్నారు.
తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ, ఉగ్రవాదులకు శిక్షణ, మద్దతు వంటివి పాకిస్థాన్ చాలాకాలంగా చేస్తోందని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, "అమెరికా, బ్రిటన్తో సహా పశ్చిమ దేశాల కోసమే మూడు దశాబ్దాల పాటు మేం ఈ చెత్త పనులన్నీ చేస్తున్నాం. అయితే అది పొరబాటు అని అర్థమైంది. దానివల్ల పాక్ చాలా ఇబ్బందులు పడింది. సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో మేం చేరకపోయి ఉంటే.. పాక్కు తిరుగులేని ట్రాక్ రికార్డు ఉండేది" అని అన్నారు. లష్కరే తోయిబా గురించి ప్రస్తావిస్తూ, అది పాత పేరు అని, ఇప్పుడు తమ దేశంలో దాని ఉనికి లేదని ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు.
ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో పర్యాటకులపై జరిగిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడి వెనుక లష్కరే తోయిబా అనుబంధ సంస్థగా భావిస్తున్న "ది రెసిస్టెన్స్ ఫ్రంట్" హస్తం ఉన్నట్లు భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ దాడి తర్వాత భారత్ గట్టి నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడం వంటి చర్యలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా, బిలావల్ భుట్టో గతంలో సింధూ నది జలాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధూ నదిలో నీరు పారకపోతే రక్తం పారుతుందని హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. సింధూ నది తమదేనని, ఆ నాగరికతకు నిజమైన సంరక్షకులు తామేనంటూ భారత్పై అక్కసు వెళ్లగక్కారని సమాచారం.
పాక్ నేతల ఈ వ్యాఖ్యలు, ముఖ్యంగా ఉగ్రవాద సంస్థలతో గత సంబంధాలను అంగీకరించడం, పహల్గాం దాడి నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారత్ ఈ దాడులకు పాకిస్థానే కారణమని బలంగా ఆరోపిస్తున్న తరుణంలో ఈ అంగీకారాలు మరింత చర్చనీయాంశంగా మారాయి.