తెరపైకి మరో యూట్యూబర్... పాక్ కు గూఢచర్యం కేసులో బిగ్ ట్విస్ట్!
ఇప్పుడు ఈ కేసు వ్యవహారం ఒడిశాకు చేరింది. కేంద్ర నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), పూరీ పోలీసులు చేపట్టిన సంయుక్త ఆపరేషన్ లో మరో యూట్యూబర్ ప్రియాంక పేరు తెరపైకి వచ్చింది!
By: Tupaki Desk | 18 May 2025 6:30 PMపాకిస్థాన్ కు చెందిన నిఘా సంస్థలకు భారత్ కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలపై హర్యానాలోని హిసార్ లో ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా ఆ కేసులు ఇప్పుడు ఒడిశాతో సంబంధం వెలుగులోకి వచ్చింది! ఈ సందర్భంగా మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
అవును... పాకిస్థాన్ నిఘా సంస్థలకు భారత్ కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణలతో యూట్యూబర్ జ్యోతితో పాటు మరో ఆరుగురు అరెస్టైన సంగతి తెలిసిందే! ఇప్పుడు ఈ కేసు వ్యవహారం ఒడిశాకు చేరింది. కేంద్ర నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), పూరీ పోలీసులు చేపట్టిన సంయుక్త ఆపరేషన్ లో మరో యూట్యూబర్ ప్రియాంక పేరు తెరపైకి వచ్చింది!
ఈ సందర్భంగా స్పందించిన పూరీ ఎస్పీ వినీత్ అగర్వాల్... జ్యోతి గత ఏడాది పూరి సందర్శించినట్లు తాము గుర్తించామని.. ప్రస్తుతం వాస్తవాలు ఏమిటనే విషయం వెరిఫై చేస్తున్నామని.. పూర్తి వివరాలు తెలిసి, వాటిని ధృవీకరించిన అనంతరం మరింత వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. మరోవైపు ఈ అంశంపై పూర్తీ యూట్యూబర్ ప్రియాంక ఇన్ స్టా వేదికగా స్పందించారు.
ఈ సందర్భంగా... జ్యోతి మల్హోత్రా తనకు స్నేహితురాలు మాత్రమే అని.. ఆమెను తాను యూట్యూబ్ ద్వారా కలిశానని తెలిపారు. అయితే.. ఆమెపై ఆరోపణలు ఉన్న విషయం తనకు తెలియదని.. ఆమె పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తుందని తెలిస్తే అసలు ఆమెతో కాంటాక్ట్ లోనే ఉండేదానిని కాదని.. ఈ సమయంలో తనను ప్రశ్నించాలనుకుంటే దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని ఆమె పేర్కొన్నారు.
మరోపక్క ఇదే విషయంపై ప్రియాంక తండ్రి స్పందించారు. పోలీసులు తన కుమార్తెను విచారించి కొంత సమాచారం సేకరించారని అన్నారు. ఇద్దరూ యూట్యూబర్లు అవ్వడం వల్లే తన కుమార్తెకు జ్యోతితో పరిచయం ఏర్పడిందని.. వారి మధ్య స్నేహం పెరగడంతో జ్యోతి పూరీని సందర్శించిందని.. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం అయితే సరైన దర్యాప్తు జరగాలని అన్నారు.
ఇదే సమయంలో.. తన కుమార్తె మూడు నాలుగు నెలల క్రితం తీర్థయాత్రలో భాగంగా పాకిస్థాన్ లోని కర్తార్ పూర్ కు వెళ్లిందని.. అయితే ఆమె ఆ సమయంలో జ్యోతితో వెళ్లలేదని.. మరో ఫ్రెండ్ తో కలిసి వెళ్లిందని.. ఆమె దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనలేదని అన్నారు.