'ఉగ్రవాదులకు అండగా ఉంటాం'... బరితెగించిన పాక్ ఆర్మీ చీఫ్!
ఈ నేపథ్యంలో దిల్ రాజు తాజాగా మీడియాతో మాట్లాడుతూ, “గేమ్ ఛేంజర్ నాకు కెరీర్లో వచ్చిన అతిపెద్ద నష్టం” అని స్పష్టంగా చెప్పారు.
By: Tupaki Desk | 1 July 2025 11:10 AM ISTపహల్గాం ఉగ్రదాడికి కి ముందు, ఆ తర్వాత పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు, చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఇందులో.. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేసే స్థితిలో ఉంటే.. భారత్ మాత్రం ఉద్రిక్తతలు సృష్టిస్తోందనే నిస్సిగ్గు వ్యాఖ్యలూ చేశారు. తాజాగా ఉగ్రవాదులకు అండగా ఉంటామంటూ బరితెగింపు వ్యాఖ్యలు చేశారు.
అవును... ఇటీవల కాలంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. విజ్ఞత మరిచి భారత్ పై అతడు చేస్తున్న విమర్శలు, కక్కుతున్న విషయం తీవ్ర విమర్శల పాలవుతోంది. ఈ క్రమంలో మరోసారి భారత్ పై విషం కక్కారు మునీరి. ఇందులో భాగంగా... కశ్మీరీ ఉగ్రవాదులను స్వాతంత్య్ర యోధులుగా అభివర్ణించారు. వారిది చట్టబద్ధమైన పోరాటమని పేర్కొన్నారు.
అంతటితో ఆగని మునీర్... కశ్మీర్ ఉగ్రవాదుల పోరాటాన్ని అంతర్జాతీయ చట్టాలూ గుర్తించాయని చెప్పడం గమనార్హం. ఇదే సమయంలో... భారత్ ఉగ్రవాదంగా ముద్ర వేస్తున్నది వాస్తవానికి అంతర్జాతీయ చట్టాలు గుర్తించిన చట్టబద్ధమైన, న్యాయసమ్మతమైన పోరాటం అని చెప్పుకొచ్చారు. తాజాగా పాకిస్థాన్ లోని నావల్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా... కశ్మీర్ కు రాజకీయ, దౌత్యపరమైన మద్దతును తమ దేశం కొనసాగిస్తూనే ఉంటుందని స్పష్టం చేసిన మునీర్.. స్వయం నిర్ణయాధికారం కోసం అక్కడి ప్రజలు చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామని అన్నారు. ఇదే సమయంలో... ఐక్యరాజ్యసమితి తీర్మానాలు, కశ్మీరీ ప్రజల ఆకాంక్షల మేరకు న్యాయపరమైన పరిష్కారం కనుక్కోవాలని పాక్ బలంగా నమ్ముతోందని తెలిపారు.
అక్కడితో ఆగని ఆయన... భారత్ ఎంతగా కవ్విస్తున్నా పాకిస్థాన్ మాత్రం సంయమనం పాటిస్తోందని.. కాశ్మీర్ ప్రాంతంలోని శాంతి, సుస్థిరతలను దృష్టిలో ఉంచుకొని చాలా వివేకంతో వ్యవహరిస్తోందని చెప్పుకొచ్చారు. పాక్ పై మరోసారి దాడి చేసే దుస్సాహసానికి భారత్ పాల్పడితే.. దీటైన సమాధానం ఇస్తామని మునీర్ హెచ్చరించారు.
కాగా... పహల్గాం ఉగ్రదాడికి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఒక కారణమనే సంగతి తెలిసిందే. ఆ ఉగ్రదాడికి ముందు కశ్మీర్.. పాకిస్థాన్ కు జీవనాడి అంటూ మునీర్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాతే పహల్గాంలోని బైసరన్ లోయలో ఉగ్రమూక అమాయకులైన పర్యాటకుల ప్రాణలను తీసింది. ఈ ఘటన ఇరు దేశాల మధ్య ఘర్షణకు దారి తీసింది.
