పహల్గాం నరమేధం టాప్ 5 అప్డేట్స్!
ఒకటి తర్వాత ఒకటి చొప్పున చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ రోజు టాప్ 5 అప్డేట్స్ లోకి వెళితే..
By: Tupaki Desk | 25 April 2025 5:32 AMదేశ వ్యాప్తంగా అందరిని కదిలించిన పహల్గాం ఉగ్రకిరాతక ఘటనకు సంబంధించి.. పరిణామాలు చాలా వేగంగా సాగుతున్నాయి. ఒకటి తర్వాత ఒకటి చొప్పున చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ రోజు టాప్ 5 అప్డేట్స్ లోకి వెళితే.. గురువారం బిహార్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేయటం తెలిసిందే. పహల్గాం నరమేధానికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని.. ఈ కిరాతకంలో పాల్గొన్న ఆ ఉగ్రవాదులు భూమ్మీద ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటామని..వారు కలలో కూడా ఊహించలేని శిక్షలు విధిస్తామని స్పష్టం చేయటం తెలిసిందే. వారికి అంతమొందించేందుకు ఎంతవరకైనా సిద్ధమని ఆయన పేర్కొన్నారు.
1. వాడి ఇంటిని పేల్చేశారు
ప్రధాని నరేంద్ర మోడీ మాటలకు తగ్గట్లే..పహల్గాం ఉగ్రదాడిలో హస్తం ఉందని భావిస్తున్న ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల్లో ఒకరి ఇంటిని ఐఈడీతో పేల్చేసినట్లుగా ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకరిగా అనుమానిస్తున్న దక్షిణ కశ్మీర్ లోని త్రాల్ కు చెందిన ఆసిఫ్ ఫౌజీ అలియాస్ ఆసిఫ్ షేక్ అనే వ్యక్తి ఇంటిని ఐఈడీతో ధ్వంసం చేశారు.
2. పిలిచి మరీ వద్దని చెప్పిన నీరజ్ చోప్రా
బెంగళూరులో నిర్వహించే ఒక ఈవెంట్ కు పాక్ జావెలిన్ స్టార్ నదీమ్ కు నీరజ్ చోప్రా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమం గురువారం జరిగింది. ఎప్పుడైతే పహ్లాగాం ఉగ్రఘటన చోటు చేసుకుందో.. ఆ కార్యక్రమానికి పాక్ జావెలిన్ ఆటగాడ్ని రావొద్దని చెప్పినట్లుగా నీరజ్ చోప్రా వెల్లడించారు. ఎన్ సీ క్లాసిక్ జావెలిన్ ఈవెంట్ కు పాక్ క్రీడాకారుడ్ని వద్దని చెప్పినట్లుగా నీరజ్ చోప్రా వెల్లడించారు. ఏ సందర్భంలో అయినా తనకు దేశమే ప్రథమ ప్రాధాన్యమని నీరజ్ స్పష్టం చేశారు.
3. పాక్ మీడియా ప్రతినిధికి షాక్
పాక్ విలేకరికి దిమ్మ తిరిగే షాకిచ్చారు అమెరికా అధికార ప్రతినిధి బ్రూస్. పహ్లగాం ఉగ్రఘటన నేపథ్యంలో భారత్ - పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తాజా ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ.. అమెరికా వైఖరి ఏమిటని పాక్ మీడియా ప్రతినిధి ఆమెను ప్రశ్నించారు. దీనికి అసహనం వ్యక్తం చేసిన అమెరికా విదేశాంగ ప్రతినిధి బ్రూస్.. ఇప్పటికే తమ వైఖరిని తెలియజేశామని.. తాము భారత్ వైపే ఉంటామని స్పష్టం చేశారు. దీంతో.. పాక్ మీడియా ప్రతినిధి ముఖాన నెత్తురు చుక్క లేని పరిస్థితి.
‘నేను దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయను. మనం మరో సబ్జెక్టు మాట్లాడుకుందాం. ఇప్పటికే అధ్యక్షుడు ట్రంప్.. మంత్రి మార్రకో రూబియో మాట్లాడారు. అందుకే ఆ విషయంపై నేను మాట్లాడను. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చూకూరాలని ప్రార్థిస్తాను. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తాను. ఈ హీనమైన దాడికి పాల్పడిన వారికి శిక్షపడాలని కోరుకుంటా’ అని స్పష్టం చేశారు.
4. ఒళ్లు బలుపు మాటల అసోం ఎమ్మెల్యే అరెస్టు
సొంత దేశ ప్రజల్ని పిట్టల్ని కాల్చినట్లుగా కాల్చేసిన ఉగ్రవాదుల తీరును ప్రపంచ దేశాలు తప్పు పడుతూ.. భారత్ కు సంఘీభావాన్ని తెలియజేస్తున్న వేళ.. అందుకు భిన్నంగా ఒళ్లు బలుపు ప్రదర్శించిన అసోం ప్రతిపక్ష ఎమ్మెల్యే (ఏఐయూడీఎఫ్ పార్టీకి చెందిన) అమినుల్ ఇస్లామ్ ను పోలీసులు అరెస్టు చేశారు. పహల్గాం ఉగ్రఘటనకు సంబంధించి పాకిస్థాన్ కు మద్దతు పలికిన ఈ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేశారు.
తమ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని.. అది పూర్తిగా ఆ నేత వ్యక్తిగత వ్యాఖ్యలుగా పేర్కొన్నారు. ఉగ్రదాడిపై పాకిస్థాన్ కు ఏ విధంగా మద్దతు పలికినా వారిపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత స్పష్టం చేశారు. సదరు ఎమ్మెల్యే మీద దేశద్రోహం కేసును నమోదు చేశామని ప్రకటించారు.
5. పహల్గాం ఉగ్రదాడిలో హమస్ హస్తం
పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఈ దాడి వెనుక హమస్ కుట్ర ఉందన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఇదే సందేహాన్ని భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ప్రస్తావించారు. హమాస్ నాయకులు ఇటీవల పాక్ అక్రమిత కశ్మీర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జైష్ ఎ మహమ్మద్ తో సమావేశమైనట్లుగా తమకు సమాచారం అందన్నారు. పహల్గాం దాడికి వీరికి మధ్య సంబంధం ఉందన్న అనుమానం కలుగుతోంది.
ఇజ్రాయెల్ పై అక్టోబరు 7, 2023 హమస్ నరమేధానికి.. పహల్గాం పర్యాటకులపై ఉగ్రదాడికి సారూప్యత ఉందన్నారు. ఈ రెండు ఉదంతాల్లో అమాయక పౌరులే టార్గెట్ గా పేర్కొన్నారు. ఉగ్రవాదులు అన్ని స్థాయిల్లో పరస్పరం సహకారం అందించుకుంటున్నారని.. వారు ఒకరికొకరు అనుకరిస్తూ ఒకేలా మారుతున్నారన్నారు. ఈ ప్రమాదాలను ఎదుర్కోవటానికి నిఘా సంస్థలు కలిసి పని చేస్తున్నాయన్న నమ్మకం తనకు ఉందన్నారు. భారత ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలు.. హెచ్చరికలు తనకు ఎంతో ధైర్యాన్ని కలిగించాయన్న ఆయన.. దోషులను వేటాడుతామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇవ్వటం అభినందనీయమన్నారు.