బైసరన్ లోయ తెరిచారని మాకు తెలీదు.. అఖిలపక్ష భేటీలో కేంద్రం!
పహల్గామ్లో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడి తర్వాత ప్రతిపక్షాలు కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి.
By: Tupaki Desk | 25 April 2025 8:23 AMపహల్గామ్లో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడి తర్వాత ప్రతిపక్షాలు కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. భద్రతా బలగాల వైఫల్యం కూడా ఈ దారుణానికి కారణం కావచ్చని అంటున్నాయి. ఇదే విషయాన్న అఖిలపక్ష సమావేశంలో కూడా లేవనెత్తాయి. దీనికి కేంద్రం స్పందిస్తూ కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పినట్లు సమాచారం. ఆ దాడి జరిగిన బైసరన్ లోయకు టూరిస్టులను అనుమతిస్తున్న విషయం అక్కడి అధికారులు భద్రతా సిబ్బందికి చెప్పలేదని ప్రభుత్వం వెల్లడించినట్లు తెలుస్తోంది. కొన్ని ఇంగ్లీష్ మీడియా కథనాలు ఈ విషయాన్ని పేర్కొన్నాయి.
పహల్గామ్ ఉగ్రదాడి గురించి ఢిల్లీలో గురువారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ ఘటన వెనుక భద్రతా లోపం ఉందని.. దాడి జరిగిన వెంటనే ప్రభుత్వం సరిగా స్పందించలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. దాడి జరిగినప్పుడు భద్రతా బలగాలు, సీఆర్పీఎఫ్ ఎక్కడ ఉన్నాయని చాలా మంది నేతలు ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం తరఫున ఒక కేంద్ర మంత్రి సమాధానం ఇస్తూ.. సాధారణంగా జూన్ నుంచి మొదలయ్యే అమర్నాథ్ యాత్ర వరకు ఆ లోయ దగ్గరకు టూరిస్టులు వెళ్లకుండా ఆంక్షలు ఉంటాయి. కానీ ఈసారి భద్రతా ఏజెన్సీలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే స్థానిక అధికారులు బైసరన్కు టూరిస్టులను అనుమతించారు. అంతేకాకుండా ఎత్తులో ఉండే ఆ ప్రాంతానికి చేరుకోవాలంటే 45 నిమిషాలు నడుచుకుంటూ వెళ్లాలి. అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో దానిపై ఎలాంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కూడా లేదు అని వివరించినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం చెప్పిన దానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. వేల మంది టూరిస్టులు అక్కడికి వెళ్తుంటే ప్రభుత్వానికి తెలియకపోవడమేంటని ఆయన ప్రశ్నించారట. పహల్గామ్కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ బైసరన్ లోయను 'మినీ స్విట్జర్లాండ్' అని పిలుస్తారు. వేసవిలో చాలా మంది టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి అందమైన పచ్చిక బయళ్లు, దట్టమైన చెట్లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. సాహసం ఇష్టపడే టూరిస్టులు ట్రెక్కింగ్ ద్వారా, మిగతా వాళ్లు గుర్రాలపై చేరుకుంటారు.