ఉగ్రవాదిని కాపాడిన తుపాకీ... లేదంటే హార్స్ రైడర్ చేతిలో...!
ఈ క్రమంలో పలువురు గాయపడ్డారు. వీరి సంఖ్య పదుల సంఖ్యలో ఉండొచ్చని చెబుతున్నారు.
By: Tupaki Desk | 23 April 2025 11:41 AMమంగళవారం జమ్ముకశ్మీర్ లోని పహల్గాం ప్రాంతంలో భయంకరమైన ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకూ సుమారు 26 మంది మృతి చెందారు. మరోవైపు ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న సమయంలో తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పర్యాటకులు నలువైపులా పరుగులు తీశారు.
ఈ క్రమంలో పలువురు గాయపడ్డారు. వీరి సంఖ్య పదుల సంఖ్యలో ఉండొచ్చని చెబుతున్నారు. వీరంతా ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ భయానక దాడి సమయంలో ఉగ్రవాదులపై స్థానిక హార్స్ రైడర్ సయీద్ అదిల్ హుస్సేన్ షా విరోచిత పోరాటం చేశాడు. ఆ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
అవును... పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపిస్తోన్న నేపథ్యంలో.. ఆ భయానక పరిస్థితిలో స్థానిక హార్స్ రైడర్ సయీద్ ఆదిల్ హుస్సేన్ షా విరోచిత పోరాటం చేశాడు. తుపాకీ చేతపట్టి ఉన్న ఉగ్రవాదులపై దాడికి ప్రయత్నం చేశాడు.. వారి నుంచి తుపాకీ లాక్కొనే ప్రయత్నం చేశాడు. వారు కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయాడు.
వాస్తవానికి పగల్గాంకు సుమారు ఐదున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్ అనే పర్యాటక ప్రదేశానికి చేరుకోవడానికి నడక, గుర్రపుస్వారీ తప్ప మరో రవాణా సదుపాయం లేదు. ఈ సమయంలో పర్యాటకులను కార్ పార్కింగ్ ప్రాంతం నుంచి బైసరన్ పచ్చిక బయళ్ల వద్దకు అదిల్ హుస్సేన్ షా గుర్రం మీద తీసుకెళ్లారు. ఆ సమయంలోనే ఈ ఘటన జరిగింది.
ఇలా ఉగ్రమూకపై ఎదురుతిరిగిన దాడిలో అదిల్ హుస్సేన్ షా మృతి చెందడంతో అతడి కుటుంబ రోడ్డున పడింది. దీంతో.. అతడి మీద ఆధారపడిన తల్లితండ్రులు, భార్యపిల్లలు న్యాయం కావాలని అడుగుతున్నారు. ఈ సమయంలో తన కొడుకును కోల్పోయినందుకు అతని తల్లి ఓదార్చలేని విధంగా విలపిస్తోంది. ఆ వీడియో వీక్షకుల హృదయలను ద్రవిస్తోంది.
ఈ సందర్భంగా స్పందించిన హుస్సేన్ తండ్రి సయ్యద్ హైదర్ షా... పని నిమిత్త తమ కుమారుడు వెళ్లగా మధ్యాహ్నం మూడు గంటల సమయంలో దాడి గురించి తెలిసిందని.. దాంతో వెంటనే కాల్ చేయగా అందుబాటులోకి రాలేదని.. సాయంత్రం 4:40 గంటల సమయంలో ఫోన్ చేయగా.. రింగైనప్పటికీ ఎవరూ లిఫ్ట్ చేయలేదని.. పోలీసులకు ఫోన్ చేయగా విషయం తెలిసిందని వాపోయారు.