Begin typing your search above and press return to search.

'పహల్గాం'కు సరిగ్గా నెల.. ప్రస్తుతం ఎన్ఐఏ ఏమి చేస్తుందంటే..?

ఏప్రిల్ 22.. సరిగ్గా నెల రోజుల క్రితం జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలోని బైసరన్ లోయలో ప్రశాంత వాతావారణంలో ఆహ్లాదంగా గడుతుపుతున్న పర్యాటకులపై.. ఏకే 47 చేతబట్టిన ఉగ్రమూకలు విరుచుకుపడ్డాయి.

By:  Tupaki Desk   |   22 May 2025 5:33 AM
పహల్గాంకు సరిగ్గా నెల.. ప్రస్తుతం ఎన్ఐఏ ఏమి చేస్తుందంటే..?
X

ఏప్రిల్ 22.. సరిగ్గా నెల రోజుల క్రితం జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలోని బైసరన్ లోయలో ప్రశాంత వాతావారణంలో ఆహ్లాదంగా గడుతుపుతున్న పర్యాటకులపై.. ఏకే 47 చేతబట్టిన ఉగ్రమూకలు విరుచుకుపడ్డాయి. మతం పేరు అడిగి మరీ మగవారిపైకి తుపాకులు ఎక్కుపెట్టాయి.. విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 26 మంది మరణించారు. అది జరిగిన నెల రోజులు అయ్యింది!

అసలు ఏమాత్రం ఊహించని ఈ ఘటనతో యావత్ భారతదేశంతో పాటు ప్రపంచమూ ఉలిక్కిపడింది. ఈ ఘటనను ప్రపంచదేశాలు ఖండించాయి. మరోపక్క ఈ ఘటన అనంతరం ప్రతీ భారతీయుడు ప్రతీకారంతో రగిలిపోయారు! దీంతో... ఆ ఘటన జరిగిన సుమారు రెండు వారాల తర్వాత భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఉగ్రమూకలను, వారికి ఆశ్రయం ఇచ్చి ఆదరిస్తున్న పాక్ ను వణికించేసింది.

ఈ ఆపరేషన్ లో 9 ఉగ్రస్థావరాలు నేలమట్టం అవ్వగా.. దాదాపు 100 మంది ఉగ్రవాదులు నాశనమయ్యారు. దీంతో... భారత్ పై పాక్ ప్రతీకారచర్యలకు ఉపక్రమించింది. దీంతో... పాక్ కు భారత్ గట్టిగా బుద్దిచెప్పింది. పాకిస్థాన్ నడిబొడ్డున డ్రోన్లు, మిస్సైళ్లతో దాడి చేసింది. పాక్ అణ్వాయుధ స్థావరం జస్ట్ మిస్ అనే కామెంట్లు వినిపించాయి. దీంతో.. కాల్పుల విరమణ అంటూ కాళ్ల బేరానికి వచ్చింది!

ఆ సంగతి అలా ఉంటే... ఈ దాడి జరిగిన అనంతరం జమ్మూకశ్మీర్ పోలీసుల నుంచి ఫిర్యాదు అందుకున్న ఎన్ఐఏ... ప్రస్తుతం సాక్ష్యులను విచారిస్తోంది. ఈ పహల్గాం దాడిలో కనీసం ఐదుగురు ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్ లు, ఫోటోలు విడుదలవ్వగా.. వారి గురించిన సమాచారం అందించినవారికి రూ.20 లక్షల రివార్డును ప్రకటించారు.

ఈ సమయంలో... కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ.. బాధితుల కుటుంబ సభ్యులు, పర్యాటకులు తీసిన ఫోటోలు, వీడియోలను సేకరించి, పరిశీలిస్తుంది. ఈ సమయంలో త్రీడీ మ్యాపింగ్ ను తయారు చేసిందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటివరకూ సుమారు 150 మందిని విచారించినట్లు తెలుస్తొంది. వారిలో కొంతమందిని విచారించి, విడుదల చేయగా.. మరికొంతమంది ఎన్ఐఏ అదుపులోనే ఉన్నారని కథనాలొస్తున్నాయి.

ఈ క్రమంలో ఇప్పటివరకూ ఫోటోగ్రాఫర్లు, సాహసక్రీడల్లో పనిచేసినవారు, ఫోన్ ఆపరేటర్లు, దుకాణాదారులతో పాటు చాలా మందిని విచారించారు! మరోపక్క ఈ దాడికి పాల్పడిన ఉగ్రమూకల పాదముద్రలను గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యలో వీలైనంత తొందర్లో పహల్గాం దాడికి పాల్పడిన ముష్కరులను గుర్తించి మట్టుబెడతారని అంటున్నారు! ఇక.. ఇటీవల బీఎస్ఎఫ్ జరిపిన దాడిలో ఆరుగురు ఉగ్రమూకలు మృతిచెందిన సంగతి తెలిసిందే!