ఇప్పుడు పహాల్గాం ఎలా ఉంది?
అయితే.. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఇప్పటికి తప్పించుకు తిరుగుతున్నారని.. వారిని పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అధికారులుచెబుతున్నారు.
By: Tupaki Desk | 23 May 2025 4:05 AMసరిగ్గా నెల క్రితం సౌత్ కశ్మీర్ లోని పహల్గాం పట్టణంలోన చోటు చేసుకున్న దారుణ ఉగ్రదాడి తెలిసిందే. కుటుంబ సభ్యుల ముందు.. మగవారిని మతం పేరు అడిగి మరీ దారుణంగా చంపేసిన వైనం.. తమను వదిలేయాలని ప్రాధేయపడిన మహిళల్ని.. మోడీకి వెళ్లి చెప్పుకో అంటూ దాష్టీకాన్ని ప్రదర్శించి 26 మంది అమాయకుల్ని పొట్టన పెట్టుకున్న దారుణ ఉగ్రదాడికి నెల పూర్తైంది. ఈ మారణకాండ తర్వాత పహల్గాం ఎలా ఉంది? ఈ దాడికి ముందు వరకు పర్యాటకులకు కళకళలాడిన ఆ పట్టణం ఇప్పుడు ఎలా ఉందన్న గ్రౌండ్ రిపోర్టులోకి వెళితే..
పహల్గాం ఉగ్రదాడి తర్వాత.. ఆ ప్రాంతానికి వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. దీంతో.. పరిసర గ్రామాలకు చెందిన స్థానికులు జీవనోపాదిని కోల్పోయారు. మరోవైపు భయాందోళనలకు గురైన పర్యాటకులు ఆ ప్రాంతానికి వెళ్లేందుకు ఆసక్తిని చూపటం లేదు. ఉగ్రదాడి వేళలో.. పర్యాటకుల్ని రక్షించేందుకు గుర్రాలకు సహాయకుడిగా వ్యవహరించే వ్యక్తిని సైతం ఉగ్రవాదులు కాల్చి చంపటం తెలిసిందే.
దాడికి పాల్పడిన ఉగ్రవాదుల సంఖ్య నాలుగు నుంచి ఆరుకు మధ్యగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే.. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఇప్పటికి తప్పించుకు తిరుగుతున్నారని.. వారిని పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అధికారులుచెబుతున్నారు. వీరిని గుర్తించేందుకు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నారు. త్వరలోనే వీరిని పట్టుకోవటం ఖాయమని అధికారులు చెబుతున్నా.. దీనిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఏప్రిల్ 22న ఉగ్రదాడి అనంతరం కశ్మీర్ వ్యాప్తంగా వేలాది మంది అనుమానితుల్ని భద్రతాదళాలు ప్రశ్నించాయి. దాదాపు వంద మందిపై ప్రజా భద్రతాచట్టం కింద కేసులు నమోదు చేసి వివిధ జైళ్లకు తరలించారు. ఇలా అరెస్టు అయిన వారిలో గతంలో ఉగ్ర సంబంధాలు కలిగి ఉన్న యువకులు కూడా ఉన్నారు. దాడికి ముందు వరకు పర్యాటకులతో కళకళలాడిన ప్రాంతం ఇప్పుడు బోసి పోయిన పరిస్థితి.
ఇతర రాష్ట్రాల పర్యాటకులు మాత్రమే కాదు.. స్థానిక సందర్శకులు కూడా రావటం లేదని చెబతున్నారు. నెల రోజులుగా పైసా సంపాదన లేకుండాపోయిందని స్థానిక దుకాణదారులు వాపోతున్నారు. తమకు ప్రభుత్వం ఏదైనా సాయం చేయాలని వారు కోరుకుంటున్నారు. జరిగిన ఉగ్రఘటన చాలా దురద్రష్టకరమని.. కశ్మీర్ అంటే అతిథ్యం ఇచ్చేవాళ్లని.. తమ అతిథులు తమకు ఎంతో గౌరవమని పేర్కొంటున్నారు. అయితే.. పర్యాటకులు మాత్రం పహల్గాం ప్లాన్ చేసుకోవటానికి మాత్రం సంశయిస్తున్నారు. ఉగ్రదాడికి ముందటి పరిస్థితి మరెప్పటికి వస్తుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా చెప్పాలి.