వాట్సాప్ విద్వేషానికి చెక్ .. ఉగ్ర ట్రాప్ లో పడొద్దు!
తాజాగా మాత్రం అందుకు భిన్నంగా పక్కా ప్లానింగ్ తో భారత్ లోని హిందూ.. ముస్లింల మధ్య విద్వేషాల్ని పెంచేలా ప్లాన్ చేసినవిగా చెప్పాలి.
By: Tupaki Desk | 26 April 2025 4:37 AMపహల్గాం ఉగ్రదాడి దేశంలోని భారతీయుల్ని తీవ్రంగా కలిచివేసింది. మిగిలిన ఉగ్రదాడికి దీనికి పెద్ద వ్యత్యాసం ఉంది. ఇంతకు ముందు చోటు చేసుకున్న ఉగ్రదాడులు దేశంలో కల్లోలాన్ని క్రియేట్ చేయటమే. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా పక్కా ప్లానింగ్ తో భారత్ లోని హిందూ.. ముస్లింల మధ్య విద్వేషాల్ని పెంచేలా ప్లాన్ చేసినవిగా చెప్పాలి. ఇందుకు తగ్గట్లే.. పహల్గాంలోని యాత్రికుల్ని టార్గెట్ చేసి.. మతం ఏమిటి? అని అడిగి.. అనుమానం వస్తే ప్యాంట్లు విప్పించి చెక్ చేయటం.. కల్మా చదవాలని చెప్పి.. అలా చేయని వారిని చంపేయటం తెలిసిందే.
ఈ ఉగ్రదాడికి సంబంధించిన వార్తల్ని చదివిన కొందరు తప్పుడు ప్రచారాలకు తెర తీస్తున్నారు. వాట్సాప్.. సోషల్ మీడియా వేధికలుగా చేసుకొని హిందువులు అంతా ఒక్కటి అన్న పేరుతో విభజన చేపడుతున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమంటే.. మతపరంగా హిందువులు.. ముస్లింలు వేర్వేరు అన్నది ఒప్పుకోవాల్సిందే. కానీ.. దేశంలోని ముస్లింలు మొదట వారు భారతీయులు. ఆ తర్వాతే వారు ఏ మతమన్నది.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ముస్లింలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రదాడిని ఖండించారు. తమ సోదరులైన హిందువులకు ఎదురైన విషాదాన్ని తప్పు పడుతూ.. తాము వారి వెంటే ఉంటామన్న విషయాన్ని చేతల్లో చేసి చూపించారు. ఎవరు అవునన్నా.. కాదన్నా ఈ దేశంలో హిందువులు.. ముస్లింలు.. క్రైస్తవులు.. సిక్కులు.. ఇలా అన్ని మతాలకు స్థానం ఉంది. ఎందుకంటే ఇది భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వం ఎంతన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పే సత్తా ఉన్న ఏకైక దేశం.
తాజాగా జరిగిన ఉగ్రదాడిని చాలామంది హిందువుల్ని టార్గెట్ చేసినట్లుగా భావిస్తున్నారు. వాస్తవానికి ఉగ్రవాదుల అసలు లక్ష్యం భారత్ ను బలహీనపరచటం. మతాల వారీగా భారతీయుల్లో విభజనను తీసుకురావటం. ఒకరి మీద ఒకరికి నమ్మకాన్ని సడలిపోయేలా చేయటం. అలా చేయటం ద్వారా భారత్ ను దెబ్బ తీయాలన్నది దాయాది పాకిస్థాన్ వ్యూహంగా చెప్పాలి. దీనికి బలం చేకూరే ఒక ఉదాహరణను ప్రస్తావించాలి. పహల్గాంలో ఉగ్రదాడి జరిగే సమయంలో హిందువును టార్గెట్ చేసి చంపే వేళలో.. అడ్డుకున్న ముస్లింను చంపేశాడు సదరు ఉగ్రవాది. అంటే వాడి లక్ష్యం హిందువు.. ముస్లిం అన్నది కాదు. తాను అనుకున్న దానిని అడ్డుకునే ఎవరైనా అతడికి ఒక్కటే.
ఈ విషయాన్ని హిందువులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పహల్గాంలో చోటు చేసుకున్న ఉగ్రదాడి నేపథ్యంలో కొందరు వాట్సాప్ వేదికగా చేసుకొని విద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారు. ఇలాంటివారికి చెక్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. ఈ దేశంలో అన్ని మతాల వారు కలిసి మెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే అది సంపూర్ణ భారతం అవుతుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ముస్లింలు తమ చేతలతో చూపించారు.
పహల్గాం ఉగ్రదాడిని ఖండించటమే కాదు.. వారి చర్యను తప్పు పట్టి.. పాకిస్థాన్ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా భారతప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలోని ప్రజల మతాలు వేరు అయి ఉండొచ్చు. కానీ.. ఈ దేశం అందరిది. ఒక చేతికి ఉండే వేళ్లు వేరుగా ఉండొచ్చు. అంతమాత్రం చేత ఒక వేలు మరో వేలును ద్వేషించుకుంటుందా? ఈ విషయాన్ని అర్థం చేసుకొని.. విద్వేషాల్ని పెంచే పోస్టులకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో పోలీసులు.. నిఘా వర్గాలు సైతం మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
Photo Credit: Siddhant Thakur