Begin typing your search above and press return to search.

రాజౌరిలో ప్రభుత్వ అధికారి ఇంటిపై దాడి.. కశ్మీర్ సీఎం వేదన పోస్టు

ఈ తెల్లవారుజామున పాక్ జరిపిన దాడుల్లో జమ్ముకశ్మీర్ ప్రభుత్వ ఉన్నతాధికారి రాజ్ కుమార్ థప్పా ప్రాణాలు కోల్పోయారు.

By:  Tupaki Desk   |   10 May 2025 9:51 AM IST
రాజౌరిలో ప్రభుత్వ అధికారి ఇంటిపై దాడి.. కశ్మీర్ సీఎం వేదన పోస్టు
X

పహల్గాం ఉగ్రఘటన.. అందుకు బదులుగా ఆపరేషన్ సిందూర్ అనంతరం చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు అంతకంతకూ ముదురుతున్నాయి. భారత సైన్యం ఆచితూచి అన్నట్లుగా దాడులకు పాల్పడుతుంటే.. అందుకు భిన్నంగా పాకిస్తాన్ మాత్రం దుర్మార్గ రీతిలో ప్రజల నివాసాల మీద దాడులకు తెగబడుతోంది. గురువారం రాత్రి సైతం.. సరిహద్దు రాష్ట్రాల్లోని పదుల సంఖ్యలో టార్గెట్లు పెట్టుకొని డ్రోన్ల దాడులకు పాల్పడటం.. భారత సైన్యం వాటిని నిర్వీర్యం చేయటం తెలిసిందే. అయినప్పటికీ.. పలు ఇళ్లు ధ్వంసమైన పరిస్థితి.

ఉద్రిక్తతల వేళ.. సరిహద్దుల్లో ఇష్టారాజ్యంగా కాల్పులు జరుపుతున్న పాకిస్తాన్.. డ్రోన్లతోనూ దాడులకు తెగబడుతోంది. ఈ తెల్లవారుజామున పాక్ జరిపిన దాడుల్లో జమ్ముకశ్మీర్ ప్రభుత్వ ఉన్నతాధికారి రాజ్ కుమార్ థప్పా ప్రాణాలు కోల్పోయారు. రాజరీ లోని ఆయన ఇంటిపై పాక్ బలగాలు దాడులు చేపట్టాయి. జిల్లా డెవలప్ మెంట్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజ్ కుమార్ మరణంపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు.

నిబద్ధత కలిగిన ఒక అధికారిని తాము కోల్పోయినట్లుగా సీఎం ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఒక రోజు ముందే తాను అధ్యక్షత వహించిన ఆన్ లైన్ సమావేశంలో రాజ్ కుమార్ పాల్గొన్నారని.. అందులోనే రాజౌరిలోని ఆయన ఇంటిపై జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోవటం బాధాకరమని పేర్కొన్నారు. పాక్ దాడుల కారణంగా మరణించిన రాజ్ కుమార్ ఉదంతం తెలిసినప్పటికి తాను షాక్ లో ఉన్నట్లుగా పేర్కొన్నారు. తనకు ఈ ఉదంతంపై స్పందించటానికి మాటలు రావట్లేదన్న ఆయన.. ‘ఇది మాకెంతో నష్టం’ అని పేర్కొన్నారు.

శనివారం తెల్లవారుజామున శ్రీనగర్.. పఠాన్ కోట్ ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. డ్రోన్లతో పాక్ చేసిన దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పి కొట్టింది. సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు సంబంధించిన అలెర్టు చేస్తూ సైరన్లు మోగించి ప్రజల్ని అప్రమత్తం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పఠాన్ కోట్ లో ఉదయం 5 గంటల ప్రాంతంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.