Begin typing your search above and press return to search.

పద్మశ్రీ మొగిలయ్యకు పెన్షన్ అందుతోంది !

దాంతో కవులు కళాకారులకు ఇదేనా చివరికి జరిగేది అన్న చర్చ మొదలైంది.

By:  Tupaki Desk   |   3 May 2024 7:27 PM GMT
పద్మశ్రీ మొగిలయ్యకు పెన్షన్ అందుతోంది !
X

డబ్బులు లేక కూలి పనులకు వెళ్తున్నట్లుగా పద్మశ్రీ అవార్డు గ్రహీత కళాకారుడు మొగిలయ్య చెప్పడం ఆయన కూలి పనులు చేస్తున్న వీడియోలు బయటకు రావడంతో అదంతా తెగ వైరల్ అయింది. మొగిలయ్య అంటే తెలంగాణాలో అద్భుతమైన కళాకారుడు. గిరిజన సంగీత పరికరాలతో వాయిద్యం అందించడంలో దిట్ట. అటువంటి ఆయన తన కుటుంబ పోషణతో పాటు తనకు కుమారుడికి ఉన్న అనారోగ్య సమస్యల వల్ల మందుల కోసం ఇలా కూలి పనులు చేయాల్సి వస్తోందని చెప్పి ఆశ్చర్యపరచారు.

దాంతో కవులు కళాకారులకు ఇదేనా చివరికి జరిగేది అన్న చర్చ మొదలైంది. పద్మశ్రీ అవార్డు అందుకోవడం అంటే సామాన్య విషయం కాదు. దేశంలో అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న మొగిలయ్య గొప్ప కళాకారుడు అయి ఉండి చివరికి ఇలా తన జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నారా అని అంతా ఆవేదనకు గురి అయ్యారు.

అయితే దీని మీద తెలంగాణా ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం చూస్తే క్రమం తప్పకుండా మొగిలయ్యకు పెన్షన్ ప్రతీ నెలా చెల్లిస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి సీపీఆర్వో అయోధ్యరెడ్డి తెలిపారు. అంతే కాదు మార్చి 31న కూడా ఆయన ఖాతాలోకి 20 వేల రూపాయల పెన్షన్ జమ చేసినట్లుగా వెల్లడించారు.

ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కవులు కళాకారులను ఎపుడూ గౌరవిస్తుందని కూడా పేర్కొన్నారు. అయితే ఏప్రిల్ నెల లో పెన్షన్ కొంచెం ఆలస్యం అవుతుందని మొగిలయ్యకు ముందే ఫోన్ చేసి చెప్పినట్లుగా కూడా అధికారులు చెప్పడం విశేషం.

మొత్తం మీద ఇరవై వేల రూపాయలు పెన్షన్ ప్రతీ నెలా మొగిలయ్యకు ప్రభుత్వం నుంచి రావడం మంచి విషయంగానే చూడాలి. మరి ఆయన కూలి పనులకు వెళ్తున్నారు. ఎందుకు అంటే ఆర్ధిక ఇబ్బందులు అని చెబుతున్నారు. పెన్షన్ ఆలస్యం అయింది దాంతోనే ఆయన ఇబ్బంది పడి ఇలా కూలి పనులకు వెళ్తున్నారా లేక ఆయనకు ఈ సొమ్ము కూడా సరిపోవడం లేదా అన్న చర్చ సాగుతోంది. ఏది ఏమైనా తెలంగాణా ప్రభుత్వం కళాకారులను గౌరవించడం అన్నది స్వాగతించ తగినదే.