Begin typing your search above and press return to search.

విజయ యాత్ర లేకపోతే శవయాత్ర... కౌశిక్ రెడ్డి ఎమోషనల్ బ్లాక్ మెయిల్!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో బీఆరెస్స్, కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   28 Nov 2023 4:30 PM GMT
విజయ యాత్ర లేకపోతే శవయాత్ర... కౌశిక్ రెడ్డి ఎమోషనల్ బ్లాక్ మెయిల్!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో బీఆరెస్స్, కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. బీఆరెస్స్ కు తామే ప్రత్యామ్నాయం అని కాంగ్రెస్ నేతలు బలంగా చెబుతుండగా.. రెండు కుటుంబ పార్టీలనూ నమ్మొద్దని బీజేపీ చెబుతుంది. ఇక తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తలంగాణ.. వారి మాటలు నమ్మి ఆగం కావొద్దంటూ బీఆరెస్స్ నేతలు చెప్పుకొస్తున్నారు.

ఇలా ఎవరి స్టైల్లో వారు, ఎవరి స్థాయిలో వాళ్లు ప్రచారాలతో ఊదరగొట్టేశారు. ఈ నేపథ్యంలో తన స్టైల్ అంతకు మించి అని చెప్పాలనుకున్నారో.. లేక, చివరి ప్రయత్నంగా ఆ డైలాగులు వదిలారో తెలియదు కానీ... హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆరెస్స్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తుది విడత ప్రచారంలో భాగంగా మైకందుకున్న కౌశిక్ రెడ్డి.. హుజురాబాద్ నియోజకవర్గంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓడిపోతే తమ కుటుంబ శవయాత్రే అంటూ ఓటర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

అవును... ఎల్లుండి (నవంబర్ 30)న జరిగే ఎన్నికల్లో హుజారాబాద్ నుంచి పోటీ చేస్తున్న తనకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్ధించారు కౌశిక్ రెడ్డి. అంతటితో ఆగని ఆయన... తనకు ఓటేసి గెలిపిస్తే ఏం జరుగుతుంది.. గెలిపించకపోతే ఏం జరుగుతుందనే విషయాలను కూడా చెప్పారు. ఇందులో భాగంగా ఓడిపోతే డిశెంబర్ 4న తన శవయాత్రే అని అన్నారు.

"ఏమి చేస్తారో మీ ఇష్టం. మీరు ఓటేయకుంటే మా ముగ్గురి శవాలే మీరు చూడుండని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మీరు ఓటేసి లీడిస్తే జైత్రయాత్రకొస్తా.. లేకుంటే నాలుగో తారీఖున నా శవయాత్రకు మీరు రండి. మీ కడుపులో తల పెడతానంటున్నా.. ఒక్కసారి అవకాశమివ్వండి. మీ దయ మీ దండం" అని కౌశిక్ రెడ్డి ప్రసంగించారు!

ఇలా కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఓటర్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు! దీంతో... ఎన్నికల్లో గెలిపించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓటర్లను బెదిరించడం ఏంటనే చర్చ జరుగుతోంది!

కాగా.. అత్యంత కీలకమైన హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆరెస్స్ తరుపున కౌశిక్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నారు. గత ఉప ఎన్నికల్లో కూడా ఈటల ను ఓడించాలని బీఆరెస్స్ శాయశక్తులా పనిచేసిందని చెబుతారు. ఈ సారైనా హుజూరాబాద్ లో సత్తాచాటాలని ప్రయత్నిస్తుంది!