Begin typing your search above and press return to search.

మోడీకి ఓవైసీ సంచలన డిమాండ్

ఉగ్రవాదం పూర్తిగా అంతం కావాల్సిందేనని పాకిస్థాన్‌పై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   1 May 2025 5:06 PM
మోడీకి ఓవైసీ సంచలన డిమాండ్
X

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఘాతుక ఉగ్రదాడి నేపథ్యంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాకిస్థాన్‌పై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తరచుగా వల్లించే "ఇంట్లోకి దూరి చంపేస్తాం (గుస్కే మారెంగే)" అనే నినాదాన్ని పక్కనపెట్టి, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోకి ప్రవేశించి అక్కడే శాశ్వతంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఆయన సంచలన సూచన చేశారు.

పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను భారత్ దెబ్బతీస్తుందనే భయంతో పాకిస్థాన్ ఖాళీ చేస్తుందనే వార్తలపై ఒవైసీ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. "వారు ఖాళీ చేసి ఉంటే, మనం వెళ్లి అక్కడే ఉండాలి. ఈసారి కేంద్రం ఏదైనా చర్య తీసుకుంటే, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవాలి" అని ఆయన అన్నారు. పీఓకే భారతదేశంలో అంతర్భాగమని భారత పార్లమెంటు ఇప్పటికే తీర్మానం చేసిందని ఒవైసీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఉగ్రవాదం పూర్తిగా అంతం కావాల్సిందేనని పాకిస్థాన్‌పై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రదాడులు అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో హైదరాబాద్‌లో జరిగిన లుంబినీ పార్క్, దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లను, ముంబైలో జరిగిన 26/11 దాడులను ఆయన ప్రస్తావించారు. ఈ దాడుల్లో తన సన్నిహితులు, సామాన్యులు ఎలా ప్రాణాలు కోల్పోయారో వివరించారు. పుల్వామా, ఉరి, పఠాన్‌కోట్ వంటి దాడులను ప్రస్తావిస్తూ, ఉగ్రవాద దాడులు నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నాయని, ఈసారి ప్రభుత్వం వీటిని సమూలంగా అంతం చేయడానికి పీఓకేను స్వాధీనం చేసుకోవడమే సరైన మార్గమని స్పష్టం చేశారు.

పాకిస్థాన్ అణ్వాయుధ బెదిరింపులపై కూడా ఒవైసీ ఘాటుగా స్పందించారు. పాకిస్థాన్ ఎప్పుడూ అణ్వాయుధ శక్తి గురించి మాట్లాడుతుందని, అయితే వారు ఒక దేశంలోకి ప్రవేశించి అమాయక ప్రజలను చంపితే ఆ దేశం నిశ్శబ్దంగా కూర్చోదని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. "ప్రభుత్వం ఏదైనా సరే, మన భూమిపై మన ప్రజలను చంపి, మతం ఆధారంగా వారిని లక్ష్యంగా చేసుకుని చంపుతుంటే మీరు ఏం మాట్లాడుతున్నారు? పాక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లా మాట్లాడుతోంది" అని ఒవైసీ ధ్వజమెత్తారు.

భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ రాజకీయ నాయకుడు బిలావల్ భుట్టో వ్యాఖ్యలను ఒవైసీ తీవ్రంగా ఖండించారు. బిలావల్ భుట్టో తల్లి, పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోను ఉగ్రవాదులే చంపారని ఆయన గుర్తు చేశారు. పాకిస్థాన్ భారతదేశం కంటే ఒక గంట వెనుకబడి ఉండటమే కాకుండా, అర్థ శతాబ్దం వెనుకబడి ఉందని ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీఓకేను స్వాధీనం చేసుకుంటేనే ఉగ్రవాదంపై పైచేయి సాధించవచ్చని ఆయన పునరుద్ఘాటించారు.

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని, కేవలం మాటలకే పరిమితం కాకుండా పీఓకేను భారతదేశంలో విలీనం చేసుకునే దిశగా అడుగులు వేయాలని ఒవైసీ తన డిమాండ్ ద్వారా స్పష్టం చేశారు.