కూటమిలో 'ఓఎస్డీ'ల హవా.. బాబుకు తలనొప్పి!
మంత్రులు తమకు అందుబాటులో ఉంటారని భావించిన వారిని.. తమకు నచ్చిన వారికి ఓఎస్డీలుగా నియమించుకునే వెసులుబాటు ఉంది.
By: Tupaki Desk | 15 April 2025 1:30 PMనిప్పులేందే పొగరాదు. అదేవిధంగా.. కూటమిలోనూ.. వివాదాలకు ఇప్పుడు ఆపరేషన్ ఆన్ స్పెషల్ డ్యూ టీ కింద నియమితులైన అధికారుల హవా పెరిగిపోయింది. ప్రధాన పత్రికల్లో వార్తలు వచ్చే వరకు వారు చేజేతులా చేసుకున్నారు. మంత్రులకు ప్రభుత్వం కొందరు అధికారులను కేటాయిస్తుంది. సెక్రటరీ, పీఏ ఇలా.. కొందరు ఉంటారు. అయితే.. వీరితోపాటు.. గత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే `ఓఎస్డీ` పేరుతో కొత్త వ్యవస్థను తీసుకువచ్చారు.
దీని ప్రకారం.. మంత్రులు తమకు అందుబాటులో ఉంటారని భావించిన వారిని.. తమకు నచ్చిన వారికి ఓఎస్డీలుగా నియమించుకునే వెసులుబాటు ఉంది. గతంలో వైఎస్కు ఆయన అనుంగులే ఓఎస్డీలు గా పనిచేశారు. అనేక వివాదాల్లోనూ చిక్కుకున్నారు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక, జగన్ హయాంలో ఓఎస్డీ వ్యవస్థను పక్కన పెట్టారు. నేరుగా అధికారులనే ఇచ్చారు. ఇక, మరోసారి కూటమి పాలనలో.. ఓఎస్డీ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు.
వీరిలోనూ.. ఒక్క టీడీపీ మంత్రులు మాత్రమే.. ఓఎస్డీలను నియమించుకున్నారు. మొత్తంగా మంత్రి వర్గంలో 25 మంది ఉంటే.. వీరిలో 15 మంది ఓఎస్డీలను నియమించుకున్నారు. మిగిలిన వారు.. ప్రభు త్వం ఇచ్చిన అధికారులతోనే పనిచేస్తున్నారు. ఇదిలావుంటే.. పట్టుమని పదిమాసాలు కూడా కాకుండానే ఓఎస్డీల హవా పెరిగిపోయింది. లంచాలు, భూముల ఆక్రమణలతోపాటు.. సెటిల్మెంట్లలోనూ వీరి పాత్ర ఉందన్నవాదన టీడీపీ నుంచే వినిపిస్తోంది.
కొన్ని రోజుల కిందట.. హోం మంత్రి అనిత ఓఎస్డీ.. దూకుడు భరించలేక.. ఆమె ఆయనను వదిలించు కున్నారు. అతనిపై తీవ్ర ఆరోపణలే వచ్చాయి. అయితే..కేసులు గట్రాపెట్టకుండా.. ఉద్యోగం నుంచి తప్పించారు. ఇక, ఇటీవల మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీ పైనా అనేక ఆరోపణలు వచ్చాయి. మద్యం దుకాణాల నుంచి బలవంతపు వసూళ్లు, దందాలు వెలుగులోకి రావడంతో నేరుగా సీఎం చంద్రబాబుకే ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఆయనను సీఎంవోనే తొలగించింది. సో.. ఇప్పుడు మరో ఇద్దరు మంత్రుల ఓఎస్డీలపైనా విమర్శలు, వివాదాలు పెరిగాయి. దీంతో ఇప్పుడు ఓఎస్డీ వ్యవస్థను ఉంచాలా? వద్దా? అని చర్చిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.