భిన్నత్వంలో ఏకత్వం... 'ఆపరేషన్ సింధూర్' తో మరోసారి నిరూపితం!
అవును... పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ ను చేపట్టిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 May 2025 5:18 AMభారత్ చాలా గొప్పదేశం! ఎన్నో మతాలు, వందల భాషలు, జాతులు.. అయినప్పటికీ ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య భారతంలో అవన్నీ ఒకేతాటిపైకి వస్తుంటాయి. అదే భిన్నత్వంలో ఏకత్వం.. ఇది భారత్ సొంతం చేసుకున్న సిద్ధాంతం! ఈ విషయంలో తాజాగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో మరోసారి నిరూపితమైందనే చర్చ తెరపైకి వచ్చింది.
అవును... పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ ను చేపట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం అర్ధరాత్రి పాక్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపించింది. సుమారు 80 మంది వరకూ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. మతం పేరు అడిగిమరీ మారణహోమానికి పాల్పడినవారికి గట్టి బుద్ది చెప్పింది.
ఈ సమయంలో భారత్ లో హిందువులు, ముస్లింలు అంతా ఒకటేనని.. కొంతమంది రాజకీయ నాయకులు, పార్టీలు ప్రజలను మతాలుగా, కులాలుగా విభజించి పబ్బం గడుపుకుంటారే తప్ప.. తామంతా ఒకటేనని చాటిచెప్పే సంగతులు తాజాగా జరిగాయి.. ఈ సమయంలో ముస్లిం మతానికిక్ చెందిన భారతీయుల పనులు, వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూర్చాయి.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ గురించి ప్రపంచానికి వివరించింది మైనార్టీ వర్గానికి చెందిన కల్నల్ సోఫియా ఖురేషి. 1990ల్లో సైన్యంలో చేరిన ఈమె... ఐక్యరాజ్య సమితి పీస్ మిషన్ లో భాగంగా 2006లో కాంగోలో విధులు నిర్వర్తించారు. ఆమెలోని నాయకత్వ లక్షణాలు, కీలక సమయాల్లో ప్రదర్శించే ఓర్పు వల్లే ఈ ఎంపిక జరిగింది!
ఇక ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్ ఓ ప్రచారానికి తెరలేపింది. ఇందులో భాగంగా.. పాక్, పీవోకే లోని స్థావరాలపై భారత్ జరిపిన దాడిని పాక్ సైన్యం గట్టిగా తిప్పికొట్టిందని.. భారత్ కు చెందిన 5 ఫైటర్ జెట్ విమానాలను కూల్చేసిందని చెప్పుకొచ్చింది. ఈ విషయాలను నేరుగా పాక్ ప్రధాని, పాక్ రక్షణ మంత్రి కూడా నిస్సిగ్గుగా ప్రచారం చేసుకున్నారు!
ఈ సమయంలో ఫ్యాక్ట్ చెకర్ మహ్మద్ జుబైర్.. సమాచార యుద్ధం చీఫ్ గా ఉద్భవించాడు. వాస్తవాన్ని కల్పితం నుంచి వేరు చేసి, పాత ఫుటెజీలను తిరిగి ఉపయోగించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రపంచానికి చూపించారు. నకిలీ వార్తను చూసినప్పుడల్లా మతం, దేశంతో సంబంధం లేకుండా దాన్ని తాను ఖండిస్తానని తెలిపారు.
అదేవిధంగా... పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ కు దేశంలోనే అతిపెద్ద ముస్లిం పార్టీ అయిన మజ్లిస్ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మద్దతు పలికారు. మరోసారి అమాయక పర్యాటకులపై దాడికి పాల్పడకుండా పాకిస్థాన్ కు గట్టి గుణపాఠం నేర్పించామని ఒవైసీ ఎక్స్ వేదికగా అన్నారు.
ఇదే సమయంలో... పాక్ లోని ఉగ్రమూకలకు మౌలిక సదుపాయాలు అందకుండా చర్యలు తీసుకోవాలని.. ఉగ్రవాద మూకల శిబిరాలను సమూలంగా నాశనం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా... ఉగ్రమూకల శిబిరాలపై భారత రక్షణ దళాలు నిర్వహించిన దాడులను స్వాగతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.