ఏమిటీ 'సీడ్’' వ్యూహం? లాహోర్ రాడార్ పై దాడి అందుకేనా?
ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ విరుచుకుపడిందే తప్పించి.. సైనిక స్థావరాలపైనా.. నివాస ప్రాంతాల మీదా ఎలాంటి దాడులకు పాల్పడలేదు.
By: Tupaki Desk | 9 May 2025 9:33 AM ISTఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ విరుచుకుపడిందే తప్పించి.. సైనిక స్థావరాలపైనా.. నివాస ప్రాంతాల మీదా ఎలాంటి దాడులకు పాల్పడలేదు. అయితే.. అందుకు భిన్నంగా గురువారం మాత్రం పాకిస్తాన్ లోని విమాన విధ్వంసక వ్యవస్థకు సంబంధించిన రాడార్ మీదా దాడి చేసి దాన్ని దెబ్బ తీసింది? ఎందుకిలా? ఇలాంటి ఎత్తుగడ వెనుకున్న లక్ష్యమేంటి? అన్న వివరాల్లోకి వెళితే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.
నిజానికి ఈ వ్యూహాన్ని సీడ్ స్ట్రాటజీగా వ్యవహరిస్తారు. యుద్ధంలో తొలుత టార్గెట్ చేసేది గగనతల రక్షణ వ్యవస్థలనే. శత్రు వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసే ఈ వ్యూహాన్ని సీడ్ స్ట్రాటజీగా పేర్కొంటారు. మరింత వివరంగా చెప్పాలంటే.. సప్రెషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్సుగా దీన్ని పేర్కొంటారని చెబుతున్నారు. ఈ వ్యూహాన్ని అమలు చేయటం ద్వారా మన యుద్ధ విమనాల్ని శత్రువులు దెబ్బ తీసే అవకాశం తక్కువగా ఉంటాయని చెబుతున్నారు.
అంతేకాదు.. భారత వైమానిక దళం పాక్ గగనతలంలోకి ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రవేశించేందుకు వీలు కలుగుతుంది. శత్రు గగనతలంపై పట్టు లభిస్తుంది. వాయుసేన సాయంతో సైన్యం సైతం ముందుకు దూసుకెళ్లేందుకు వీలవుతుంది. దీన్ని క్లోజ్ ఎయిర్ సపోర్టుగా వ్యవహరిస్తుంటారు. ఈ సీడ్ వ్యూహాన్ని తొలుత జర్మనీపై బ్రిటన్ ప్రయోగించి విజయం సాధించింది. లాహోర్ లో రాడార్ వ్యవస్థను ధ్వంసం చేయటం ద్వారా పాక్ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాల్ని ఛేదించే క్షిపణులను మొహరించిన ప్రాంతాలపై దాడులు చేసే అవకాశం భారత్ కు లభిస్తుంది.