పాక్ కి తీర్చేస్తారులే... వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్స్ వైరల్!
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ లోని ఉగ్రశిబిరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 9 May 2025 3:58 AMపహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ లోని ఉగ్రశిబిరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ లో పాక్ సైనిక స్థావరాలను భారత్ టచ్ చేయలేదు.. పౌరులకు నష్టం కలిగించలేదు! అయితే... ఆ ఆపరేషన్ కు ప్రతీకారంగా పాక్ గురువారం ఉదయం నుంచి భారత్ సైనిక స్థావరాలు, పౌర ప్రాంతాలు లక్ష్యంగా దాడులు మొదలుపెట్టింది.
ఇందులో భాగంగా.. భారత్ లోని 15 ప్రాంతాల్లో సైనిక స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు.. జమ్మూలో పౌర విమానాశ్రయం లక్ష్యంగా ఫైటర్ జెట్లతో దాడులు చేపట్టింది. అయితే... వాటన్నింటినీ భారత్ సక్సెస్ ఫుల్ గా అడ్డుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ విరేంద్ర సెహ్వాగ్ స్పందించారు. ఈ సందర్భంగా పాక్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... ఉగ్రవాదులపై భారత్ దాడులు చేస్తే.. భారత్ పై దాడులు చేయాలని ఫిక్సైన పాక్.. ఉత్తర భారతంలోని అనేక ప్రదేశాల్లో దాడులకు ప్రయత్నించింది. ఇలా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచుతున్నందుకు పాకిస్థాన్ ను వీరేంద్ర సెహ్వాగ్ తీవ్రంగా విమర్శించారు. మౌనంగా ఉండాల్సిన సమయంలో యుద్ధాన్ని ఎంచుకుందని.. సరదా తీరిపోద్దన్నట్లుగా కామెంట్ చేశారు.
ఇందులో భాగంగా... "పాకిస్థాన్ కు మౌనంగా ఉండటానికి అవకాశం ఉన్నప్పుడు యుద్ధాన్ని ఎంచుకుంది.. వారు తమ ఉగ్రవాద ఆస్తులను కాపాడుకోవడాన్ని తీవ్రం చేశారు.. వాటి గురించి చాలా మాట్లాడుకుంటున్నారు.. మన దళాలు పాకిస్థాన్ ఎప్పటికీ మరిచిపోలేని విధంగా, అత్యంత సముచితమైన రీతిలో సమాధానం ఇస్తారు" అని ఎక్స్ వేదికగా స్పందించారు.
ఇదే సమయంలో భారత మాజీ క్రికెటర్లు ఆకాశ్ చోప్రా, ప్రజ్ఞాన్ ఓజా.. సాయుధ దళాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో.. పాకిస్థాన్ పై కఠిన చర్యలు తీసుకుంటామని వెంకటేష్ ప్రసాద్ హెచ్చరించారు. ఇదే క్రమంలో.. శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్.. ఇండియన్ ఆర్మీకి అభినందనలు తెలుపుతూ జై హింద్ అని స్పందించారు.
ఇదిలా ఉండగా... భారత్ లోని వివిధ ప్రాంతాల్లో పాకిస్థాన్ దాడులు చేస్తోన్న నేపథ్యంలో ధర్మశాలలోని హిమాచాల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ - 2025) 58వ మ్యాచ్ ను రద్దు చేశారు. అందరి భద్రతను దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది!