'ఏ బంకర్ లో జీ?'... పాక్ ఆర్మీ చీఫ్ పై నెట్టింట సెటైర్లు!
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునే పనిలో భాగంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టింది భారత్.
By: Tupaki Desk | 7 May 2025 11:47 PM ISTపహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునే పనిలో భాగంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టింది భారత్. ఇందులో భాగంగా... మంగళవారం అర్ధరాత్రి 1:05కు పాక్, పీవోకే లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడులు నిర్వహించింది. ఈ ఘటనలో 9 ఉగ్ర శిభిరాలపై దాడులు చేయగా.. ఈ ఘటనలో సుమారు 80 వరకూ ఉగ్రవాదులు మృతి చెందగా మరో 60 మంది గాయపడ్డారు!
ఇక ఈ దాడులు పీఓకే తో పాటు పాకిస్థాన్ లోని పంజాబ్ లో కూడా భారత్ చేపట్టడం గమనార్హం. కేవలం 25 నిమిషాల్లో సుమారు 950 కి.మీ. పరిధిలోని ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం క్షిపణుల వర్షం కురిపించింది. ఆ సంగతి అలా ఉంటే.. ఇంత పెద్ద దాడి అనంతరం స్పందించాల్సిన పాక్ ఆర్మీ చీఫ్ కనిపించకుండాపోవడం చర్చనీయాంశంగా మారింది!
అవును... పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటు ఏకంగా పాక్ - పంజాబ్ లోనూ భారత ఆర్మీ దాడులు చేయడం వంటి సంచలన ఘటన జరిగి ఇంత సమయం అవుతున్నప్పటికీ.. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ స్పందించకపోవడంతో సోషల్ మీడియాలో అతడిపై చర్చ మొదలైంది. ఇందులో భాగంగా... "పాక్ ఆర్మీ చీఫ్ ఏ బంకర్ లో దాక్కున్నారు?" అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఇదే సమయంలో... పాక్ ఆర్మీ చీఫ్ అసలు దేశంలో ఉన్నాడా..? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పైగా.. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాక్ ఆర్మీ చీఫ్ కుటుంబాన్ని విదేశాలకు పంపించేశారనే చర్చ బలంగా నడిచిన నేపథ్యంలో.. ఆపరేషన్ సిందూర్ అనంతరం ఈయన కూడా దేశం విడిచి పారిపోయాడా.. లేక, ఏదైనా బంకర్ లో దాక్కున్నాడా అని ప్రశ్నిస్తున్నారు.
వాస్తవానికి ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్ ప్రధాని దీన్ని యుద్ధ చర్య అని అభివర్ణించారు. తమ దేశానికి ఇప్పుడు భారత్ కు సమాధానం ఇచ్చే హక్కు ఉందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో పాక్ ఉన్నత స్థాయి భద్రతా సమావేశాన్ని నిర్వహించింది. ఇలాంటి కీలక సమయంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ "తప్పిపోయారు" అనే చర్చ తెరపైకి రావడం గమనార్హం.
ఈ సందర్భంగా పలు పోస్టులు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా... 1965, 1971, కార్గిల్ యుద్ధాల్లో పాకిస్థాన్ సైన్యం ఓడిపోయింది.. అయితే ఈ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్ మాత్రం ఎందుకు ఇన్ని పతకాలు ధరిస్తున్నాడు? పాక్ లో యుద్ధంలో ఓడిపోతే పతకాలు ఇస్తారా? దాంతో పాటు ఏ దేశాలతో ఓడిపోయారో ఆ దేశ జెండా కూడా ఇవ్వాలి అంటూ పోస్టులు పెడుతున్నారు.