Begin typing your search above and press return to search.

పాక్ బ్యాచ్ కి మాస్ వార్నింగ్.. మన సైనికులకు సెల్యూట్... మోడీ ఫైర్!

ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడిని గుర్తుచేసుకున్న మోడీ... పహల్గాంలో ఉగ్రవాదులు మతం పేరు అడిగి మరీ కుటుంబ సభ్యుల ముందు కాల్చి చంపారు.

By:  Tupaki Desk   |   12 May 2025 5:59 PM
పాక్  బ్యాచ్  కి మాస్  వార్నింగ్.. మన సైనికులకు సెల్యూట్...  మోడీ ఫైర్!
X

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా, ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా, ఊగ్రశిబిరాల ధ్వంసమే టార్గెట్ గా, పక్కా ప్రణాళికతో చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా స్పందించారు. ఇందులో భాగంగా జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులు, పాకిస్థాన్ పై నిప్పులు చెరిగిన మోడీ... భారత్ సైనికులకు సెల్యూట్ చేశారు.

అవును... ఆపరేషన్ సిందూర్ అనంతరం తొలిసారిగా జాతినుద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ చర్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తుద ముట్టిస్తామని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే సహించేది లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడిని గుర్తుచేసుకున్న మోడీ... పహల్గాంలో ఉగ్రవాదులు మతం పేరు అడిగి మరీ కుటుంబ సభ్యుల ముందు కాల్చి చంపారు.. ఈ ఉగ్రదాడితో దేశమంత నివ్వెర పోయింది.. ఉగ్రవాద దాడులపై ప్రతీ హృదయం జ్వలించింది అని అనారు. ఈ సమయంలోనే మన దేశం అసమాన వీరత్వాన్ని ప్రదర్శించిందని తెలిపారు.

ఇందులో భాగంగా... నిఘా వర్గాల సామర్థ్యాన్ని, శాస్త్రసాంకేతిక సామర్థ్యాన్ని దేశం చూసిందని.. సైన్యం సాహసం, పరాక్రమాన్ని దేశం చూసిందని.. భారత త్రివిధ దళాలు చూపించిన ధైర్య సాహసాలు దేశానికే తలమానికమని.. ఈ క్రమంలో గడిచిన నాలుగు రోజులుగా భారత సైన్యం సామర్థ్యంతో పాటు సంయమనాన్ని మనం చూస్తున్నామని మోడీ తెలిపారు.

పహల్గాం ఉగ్రదాడి అనంతరం దేశం ఒక్కసారిగా రగిలిపోయిందని చెప్పిన మోడీ.. ఆ సమయంలో పౌరులు, పార్టీలు అన్నీ ఏకతాటిపైకి వచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డాయని అన్నారు. పహల్గాంలో.. భారతీయ మహిళల నుదిటిపై సిందూరం తుడిచేసే వారికి ఎలాంటి బుద్ది చెప్పాలో అదే.. 'ఆపరేషన్ సిందూర్' అని.. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని దారుణ దెబ్బ తీశామని అన్నారు.

ఇందులో భాగంగా... బహవల్పుర్, మురుద్కే లాంటి తీవ్రవాద స్థావరాలపై దాడి చేసి భీతావహ పరిస్థితిని భారత్ సృష్టించిందని.. ఉగ్రవాద శిబిరాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో, కచ్చితమైన టార్గెట్స్ తో దాడులు చేశామని పేర్కొన్నారు. ఈ క్రమంలో... పాకిస్థాన్ గర్వంగా చెప్పుకొనే మిస్సైళ్లను ధ్వంసం చేశామని.. పాక్ విమానాలు గాల్లోకి ఎగరలేని పరిస్థితిని భారత్ తీసుకొచ్చిందని మోడీ తెలిపారు.

భారత్ అన్నివిధాలా కొట్టిన దెబ్బకు పాక్ నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిందని.. అచేతనావస్థకు చేరుకుందని.. ఈ నేపథ్యంలోనే గత్యంతరం లేక భారత్ లోని జనావాసాలు, స్కూళ్లు, హాస్పటల్స్ పై దాడికి దిగిందని తెలిపారు. అయితే... పాక్ ప్రయోగించిన అన్ని డ్రోన్లు, మిస్సైళ్లను భారత గగనతల రక్షణ వ్యవస్థ నిర్వీర్యం చేసిందని.. పాక్ రక్షణ వ్యవస్థలను మన క్షిపణులు చిన్నాభిన్నం చేశాయని స్పష్టం చేశారు.

దీంతో... భారత్ చర్యలకు బెంబేలెత్తిపోయిన పాకిస్థాన్ కాల్పుల విరమణకు ప్రపంచం మొత్తాన్ని వేడుకుందని.. పాక్ డీజీఎంవో చర్చలకు పరుగెత్తుకూంటూ వచ్చారని తెలిపారు.

ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఎలాంటి దుస్సాహసానికి తెగబడినా.. భారత దళాలు చావు దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని.. సర్జికల్ స్ట్రైక్, బాలాకోట్ దాడులు, ఆపరేషన్ సిందూర్.. ఉగ్రవాదంపై భారత వైఖరిని స్పష్టంగా చెప్పాయని.. ఉగ్రవాదంపై భారత షరతులు ఈ మేరకే ఉంటాయని ప్రధాని మోడీ తెలిపారు.

ఈ సందర్భంగా పాక్ తో జరగబోయే చర్చల ప్రస్థావన తెచ్చిన మోడీ... భారత్ నిర్ణయాలకు అనుగుణంగానే చర్చలు సాగుతాయని.. పాక్ అణు బ్లాక్ మెయిలింగ్ ఇక సహించేది లేదని.. అణ్వాయుధాలను అడ్డంపెట్టుకుని ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని.. పాకిస్థాన్ కు మోడీ గట్టి హెచ్చరికలు పంపారు.