Begin typing your search above and press return to search.

26, 9, 100, 40... అంకెల్లో సైన్యం చెప్పిన 'ఆపరేషన్ సిందూర్'!

ఈ క్రమంలో పాకిస్థాన్ లోని 4 ఉగ్ర శిబిరాలను, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 5 ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసినట్లు తెలిపింది.

By:  Tupaki Desk   |   11 May 2025 6:14 PM
26, 9, 100, 40... అంకెల్లో సైన్యం చెప్పిన ఆపరేషన్  సిందూర్!
X

పహల్గాంలోని ఉగ్రవాదుల దాడికి ప్రతికారంగా, ఉగ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యంతో ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది భారత సైన్యం. అయితే.. శనివారం సాయంత్రం కాల్పుల విరమణ జరిగింది. ఈ సమయంలో ఆపరేషన్ సిందూర్ గురించి భారత సైన్యం ఆదివారం సాయంత్రం బ్రీఫింగ్ ఇచ్చింది. ఈ సందర్భంగా అంకెల్లో ఆపరేషన్ సిందూర్ గురించి స్పష్టంగా వివరించింది!

పహల్గాంలో 26 మంది మరణించారు!:

ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన సంగతి తెలిసిందే. దీని అనంతరం ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతోనే ఆపరేషన్ సిందూర్ చేపట్టామని భారత సైన్యం వెల్లడించింది. ఈ ఆపరేషన్ లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపింది. భారత సైన్యం చేస్తున్న దాడుల భయంతో ఉగ్రశిబిరాలు ఖాళీ అవుతున్నాయని పేర్కొంది.

9 ఉగ్రవాద శిబిరాలు నేలమట్టం:

ఈ క్రమంలో పాకిస్థాన్ లోని 4 ఉగ్ర శిబిరాలను, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 5 ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసినట్లు తెలిపింది. కేవలం 25 నిమిషాల్లో ఈ పని పూర్తైనట్లు వెల్లడించింది. తాజాగా.. పహల్గం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి త్రివిధ దళాల అధికారులు మీడియా సమావేశం పెట్టి కీలక వివరాలు వెల్లడించారు.

100 మంది ఉగ్రవాదులు హతం!:

అవును... ఆపరేషన్ సిందూర్ పై భారత సైన్యం తాజా బ్రీఫింగ్ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) రాజీవ్ ఘాయ్ మాట్లాడుతూ... పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదులకు గట్టిగా బదులివ్వాలని నిర్ణయించామని.. వారికి సరైన రీతిలో సమాధానం చెప్పాలన్నదే ఆపరేషన్ సిందూర్ లక్ష్యమని తెలిపారు.

ఈ క్రమంలో.. సరిహద్దు అవతల ఉన్న ఉగ్ర శిబిరాలను కచ్చితమైన ఆధారాలతో గుర్తించామని అన్నారు. అనంతరం.. స్పష్టమైన అధరాలతో 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులు గుర్తించామని.. ఈ దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు చనిపోయారని.. వారిలో 1999 ఐసీ-814 విమానం హైజాక్ ఘటన, 2019 పుల్వామా దాడుల్లో పాల్గొన్న ముష్కరులు హతమయ్యారని తెలిపారు.

వారిలో ముదాసిర్ అహ్మద్, అబ్దుల్ మాలిక్ రౌఫ్, యూసఫ్ అజహర్ తదితలురు ఉన్నారని అన్నారు. ఈ దాడులతో పాక్ వణికిపోయిందని తెలిపారు. ఆ తర్వాత భారత్ లో సాధారణ పౌరులే లక్ష్యంగా పాకిస్థాన్ దాడులకు తెగబడిందని.. ఫలితంగా తగిన మూల్యం చెల్లించుకుందని తెలిపారు.

40 మంది పాక్ సైన్యం ఖతం!:

ఇదే సమయంలో 8, 9 తేదీ రాత్రి భారత్ పై గగనతల దాడికి పాక్ ప్రయత్నించిందని.. అయితే భారత్ వైపు వచ్చిన ప్రతీ డ్రోన్ ను నిర్వీర్యం చేశామని త్రివిధ దళాల డీఎంవో స్థాయి అధికారులు తెలిపారు. ఇదే సమయంలో.. లాహోర్, గుజ్రన్ వాలా రాడార్ కేంద్రాలను ధ్వంసం చేశామని అన్నారు.

అయితే.. డ్రోన్లు దాడుల సమయంలో పాకిస్థాన్ పౌరవిమానాలను ఆకాశంలోకి అనుమతించిందని.. దీంతో.. పరిస్థితి గమినిస్తూ, కచ్చితమైన లక్ష్యాలతో పాక్ సైనిక స్థావరాలపై దాడులు చేశామని తెలిపారు. మొత్తంగా 3 రోజులపాటు కొనసాగిన ఈ దాడుల్లో 35 నుంచి 40 మంది పాకిస్థాన్ సైనికులు చనిపోయినట్లు అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు.

ఈ క్రమంలో పాకిస్థాన్ ఎన్ని దుశ్చర్యలకు పాల్పడినా దీటుగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని.. పాకిస్థాన్ కాల్పుల విరమణ తర్వాత మళ్లీ దాడులు కొనసగిస్తే తీవ్ర ప్రతిచర్యలు ఉంటాయని.. ఉల్లంఘనలపై దీటుగా స్పందించేందుకు క్షేత్రస్థాయి అధికారులకు పూర్తి అధికారాలు ఇవ్వబడ్డాయని వెల్లడించారు.