Begin typing your search above and press return to search.

ఆపరేషన్ సిందూర్ తో చావుదెబ్బ.. అయినా అతడికి ప్రమోషన్

తాజాగా ఆసిమ్ మునీర్ కు ఫీల్డ్ మార్షల్ గా పాక్ ప్రభుత్వం ప్రమోషన్ ఇవ్వటం విశేషం.

By:  Tupaki Desk   |   23 May 2025 3:55 AM
ఆపరేషన్ సిందూర్ తో చావుదెబ్బ.. అయినా అతడికి ప్రమోషన్
X

పహల్గాం ఉగ్రదాడి.. దానికి బదులుగా మొదలైన ఆపరేషన్ సిందూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్ పై జరిగిన ఉగ్రదాడి వెనుక ఎవరు అవునన్నా కాదన్నా పాక్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ ఉందన్నది బహిరంగ రహస్యం. దానికి అన్నీతామైనట్లుగా వ్యవహరించే పాక్ ఆర్మీ అండ ఉండనే ఉంది. భారత్ మీద జరిగిన ఉగ్రదాడికి.. దాని తర్వాత చోటు చేసుకున్న పరిణామాలకు ప్రత్యక్షంగా.. పరోక్షంగా పాక్ ఆర్మీ కీలక భూమిక పోషించింది. ఆ ఆర్మీని నడిపించే వారి దురాశ పాక్ ప్రజల బతుకుల్ని మరింత భారంగా చేశాయని చెప్పాలి.

దేశాన్ని ఉగ్రవాదులకు డెన్ గా మార్చటం.. భారత్ మీద అదే పనిగా విషం కక్కటం. భారత్ ను దెబ్బ తీయటమే ప్రధాన ఎజెండా పెట్టుకున్న పాక్ పాలకులు.. ఆర్మీ కారణంగా ఆ దేశ ప్రజలు పడే బాధలు.. కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాక్ కు తగిలిన దెబ్బ అంతా ఇంతా కాదు. వైమానిక రంగంలో ఆ దేశం చావుదెబ్బ తిన్న పరిస్థితి. అంటే.. ఈ మొత్తం దెబ్బలకు కర్త కర్మ క్రియగా ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ గా చెప్పాలి.

మతాన్ని మత్తుమందుగా వాడుతూ..భారత్ మీద ద్వేషభావాన్ని కలిగించేలా చేయటం.. భారత్ ను ఆస్థిరపర్చాలన్న కుట్రలకు కేరాఫ్ అడ్రస్ గా మునీర్ నిలుస్తారన్న మాట బలంగా వినిపిస్తూ ఉంటుంది. అలాంటివాడి కారణంగా పాకిస్తాన్ కు జరుగుతున్న నష్టంపై ఆ దేశ పాలకులు పెద్దగా పట్టించుకున్నట్లుగా కనిపించటం లేదు.

తాజాగా ఆసిమ్ మునీర్ కు ఫీల్డ్ మార్షల్ గా పాక్ ప్రభుత్వం ప్రమోషన్ ఇవ్వటం విశేషం. సాధారణంగా.. ఒక అవమానకర రీతిలో ఉద్రిక్తతలు ముగిసిన తర్వాత.. వేటు పడుతుంది. లేదంటే.. వారిస్థానాన్ని అప్రాధాన్యత రంగానికి మార్చటం జరుగుతుంది. కాదు కూడదంటే.. అలా ఉంచేస్తారు. పాకిస్తాన్ లో మాత్రం అందుకు భిన్నంగా పాక్ లో అత్యున్నత మిలిటరీ ర్యాంకుగా చెప్పాలి. పాకిస్తాన్ లో ఇప్పటివరకు ఈ ర్యాంక్ పొందిన రెండో వ్యక్తి మునీరే కావటం విశేషం.

అంటే.. పాక్ కు చావుదెబ్బ తగిలేందుకు కారణమైన కీలక వ్యక్తికి అత్యున్నత ర్యాంక్ ను ఇవ్వటం చూస్తే.. ఆయన పవర్ ప్రభుత్వంలో ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది. 1959లో జనరల్ ఆయూబ్ ఖాన్ కు ఫీల్డ్ మార్షల్ హోదా కట్టబెట్టారు. ఆ తర్వాత పేరు మునీర్ దే. ఇక.. ఇతగాడి ప్రస్థానాన్ని చూస్తే.. 2002 నవంబరులో ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన అతను పాక్ ప్రభుత్వం మీదా పట్టును సాధించాడు. ఇటీవల పాక్ సుప్రీంకోర్టు మునీర్ కు మరిన్ని అధికారాలు కల్పిస్తూ.. మిలిటరీ కోర్టుల్లో సాధారణ పౌరుల్ని సైతం విచారించేందుకు అనుమతి ఇచ్చింది. తాజాగా ఫీల్డ్ మార్షల్ పదోన్నతితో పాక్ లో అతగాడి పరపతి మరింత పెరిగినట్లుగా చెప్పాలి. ఏమైనా ఇలాంటి సిత్రమైన అంశాలు పాక్ లాంటి కొన్ని దేశాల్లోనే కనిపిస్తాయని చెప్పక తప్పదు.