చత్తీసుగఢ్-తెలంగాణ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు
పహల్గామ్ ఉగ్రదాడుల నేపథ్యంలో దేశ సరిహద్దులు యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. ఇటు తెలంగాణ-చత్తీసుగడ్ సరిహద్దు అడవుల్లోనూ అలజడి కనిపిస్తోంది.
By: Tupaki Desk | 6 May 2025 10:04 AMపహల్గామ్ ఉగ్రదాడుల నేపథ్యంలో దేశ సరిహద్దులు యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. ఇటు తెలంగాణ-చత్తీసుగడ్ సరిహద్దు అడవుల్లోనూ అలజడి కనిపిస్తోంది. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులపై యుద్ధం ప్రకటించిన ప్రభుత్వం.. గత పది పదిహేను రోజులుగా తెలంగాణ సరిహద్దుల్లోని కర్రి గుట్టల్లో అనువణువు సోదిస్తోంది. ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టు అగ్రనేతలు తలదాచుకున్నారనే అనుమానంతో పోలీసు బలగాలు కర్రి గుట్టల్లో పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. డ్రోన్లు, హెలికాఫ్టర్ల చక్కర్లు కొడుతుండటంతో తెలంగాణ సరిహద్దుల్లోనూ యుద్ధం జరుగుతున్న వాతావరణం కనిపిస్తోందని అంటున్నారు.
ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేతను ముమ్మరంగా చేపట్టిన కేంద్ర ప్రభుత్వం మధ్య భారతంలోని మావోయిస్టుల కోటగా భావించే దండకారుణ్యంపై పట్టు సాధించింది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టు ఉద్యమం అణచివేయాలనే లక్ష్యంతో కేంద్రం పనిచేస్తోంది. గత ఏడాది మొదలైన ఈ ఆపరేషనులో వందల మంది మావోయిస్టులను ఎన్ కౌంటరు చేసింది. ఇక ప్రస్తుతం మధ్యభారతంలో ఉద్యమకారులు నామమాత్రంగా మిగిలారు. ఉన్నవారు సైతం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి తెలంగాణ సరిహద్దుల్లోని కర్రి గుట్టల్లో తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో కొద్దిరోజుల నుంచి ఈ ప్రాంతంపై యుద్ధం ప్రకటించారు.
గత నెలలో కర్రి గుట్టలకు చేరుకున్న భద్రతాబలగాలు ఒక ఎన్ కౌంటరులో సుమారు ఐదుగురు మావోయిస్టులను మట్టుబెట్టాయి. ఇక్కడ ఎత్తైన కొండలు ఉండటం, రెండు రాష్ట్రాల సరిహద్దు కావడంతో భద్రతా బలగాల నుంచి సులువుగా తప్పించుకునేందుకు మావోయిస్టులు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం ఆధునిక టెక్నాలజీతో కర్రి గుట్టలను జల్లెడ పడుతున్నారు. పోలీసులు స్పీడు పెంచడంతో మావోయిస్టులు సైతం బెదిరింపులకు దిగుతున్నారని ప్రచారం జరుగుతోంది. కర్రి గుట్టల్లో పెద్ద ఎత్తున బాంబులు అమర్చామని మావోయిస్టులు ప్రచారం చేస్తున్నారు. దీంతో జాగ్రత్త పడిన పోలీసులు ప్రతి అడుగు ఆచితూచి వేస్తున్నారు. దాదాపు 24 మందుపాతరలను గుర్తించి వెలికి తీశారు.
ఇక కర్రి గుట్టల్లో రోజూ వందల సంఖ్యలో పోలీసులు వచ్చి వెళుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అప్పుడప్పుడు కొండల్లో కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నట్లు స్థానికులు మీడియాకు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆదివాసీలు గ్రామం దాటి బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ప్రస్తుతం కర్రి గుట్టల్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని స్థానికులు భయపడుతున్నారు. మరోవైపు ఆ ప్రాంతంలో రాకపోకలను పోలీసులు పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నారు. స్థానిక ఆదివాసీలు మినహా మిగిలిన వారు ఎవ్వరినీ అటువైపు రానీయడం లేదు. దీంతో తెలంగాణ సరిహద్దుల్లో యుద్ధం భయం కనిపిస్తోందని అంటున్నారు.