Begin typing your search above and press return to search.

ఏడాది విపక్ష నేతగా జగన్ కి ఎన్ని మార్కులు ?

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం మరి కొద్ది రోజులలో ఏడాది పాలన పూర్తి చేసుకోబోతోంది. 2024 జూన్ 12న కూటమి ప్రభుత్వం ప్రమాణం చేసింది.

By:  Tupaki Desk   |   1 Jun 2025 12:41 PM
ఏడాది విపక్ష నేతగా జగన్ కి ఎన్ని మార్కులు ?
X

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం మరి కొద్ది రోజులలో ఏడాది పాలన పూర్తి చేసుకోబోతోంది. 2024 జూన్ 12న కూటమి ప్రభుత్వం ప్రమాణం చేసింది. దాంతో అయిదేళ్ల ప్రజల తీర్పులో ఒక ఏడాది గడచింది. ఈ ఏడాదిలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆరోపిస్తూ వైసీపీ ఎన్నికల ఫలితాలు వచ్చిన జూన్ 4న తేదీన వెన్నుపోటు దినాన్ని నిర్వహ్స్తోంది.

అంటే ఏడాది కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ ఈ నిరసనలు అన్న మాట. విపక్ష పార్టీగా వైసీపీకి ఆ హక్కు ఉంది. అదే సమయంలో ఏ ప్రభుత్వంలో అయినా లోపాలు ఉంటాయి. అలాగే కొన్ని చేయగలరు, కొన్ని చేయలేకపోతారు. దాంతో విపక్షం మాత్రం విమర్శలకు ఎదురుచూస్తుంటుంది కాబట్టి కచ్చితంగా దానిని వాడుకుంటుంది.

మరి విపక్ష నేతగా జగన్ కి కూడా తొలి ఏడాది ఎలా గడచింది. ఆయన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది. ఆయన ఈ ఏడాదితో ప్రజల పక్షాన నిలబడి చేసిన పోరాటాలు ఎన్ని ఉన్నాయన్నది కూడా చర్చకు వస్తోంది. ఏపీ ప్రజలు 2024 ఎన్నికల్లో విభిన్నమైన తీర్పు ఇచ్చారు. 164 సీట్లు కూటమికి ఇచ్చిన వారు కేవలం 11 సీట్లు మాత్రమే వైసీపీకి ఇచ్చారు. అలా విపక్ష హోదా లేని నేతగా జగన్ ని ఉంచారు. ఇది జగన్ మొత్తం పొలిటికల్ కెరీర్ లో వింత అనుభవం. ఆయనకు విపక్ష పాత్ర కొత్త కాదు కానీ హోదా లేని పాత్ర మాత్రం ఇదే కావడంతో ఆయన చాలా కొత్తగానే ఫీల్ అవుతూ వచ్చారు.

ఆయన వెనక పది మంది మాత్రమే ఎమ్మెల్యేల బలాన్ని ఇచ్చి బలమైన కూటమి ప్రభుత్వం మీద పోరాడమని జనాలు ఒక సందేశం ఇచ్చారు. అయితే జగన్ మాత్రం ఈ ఏడాదిలో అసెంబ్లీకి పోలేదు, తనకు విపక్ష హోదా కావాలని ఆయన కోరుతూ వచ్చారు. దాని మీద కోర్టుకు వెళ్ళారు.

ఇక ఈ ఏడాదితో తన పార్టీ వారి చేత కొన్ని నిరసన కార్యక్రమాలు చేయించారు. తాను మాత్రం ఎక్కడా పాల్గొనలేదు. అతి తక్కువ సందర్భాలలో మాత్రమే ఆయన జనంలోకి వచ్చారు. అది కూడా పరామర్శలకే పరిమితం అయ్యారు.

కూటమి ప్రభుత్వానికి జగన్ ఏకంగా ఏడాది పాటు హానీమూన్ పీరియడ్ గా ఇచ్చేశారు. అలా విపక్ష నేతగా జగన్ అనుకున్న స్థాయిలో పనిచేయలేదా అన్న చర్చ అయితే ఉంది. ఆయన జనంలోకి రాకుండా ఉండడమే కాదు బెంగళూరు టూ తాడేపల్లి షటిల్ సర్వీస్ చేస్తూ గడిపారు.

ఈ లెక్క తీసుకుంటే కనుక ఆయన ఏడాదిలో దాదాపుగా సగం రోజుల పాటు బెంగళూరులోనే ఉన్నారని భావించాలని అంటున్నారు. మరో వైపు చూస్తే జగన్ మీడియా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అవి కూడా ఎక్కువగా అయితే లేవు. తనకు నచ్చినపుడు మాత్రమే మీడియాను పిలిచి ప్రభుత్వం మీద కామెంట్స్ చేస్తూ వచ్చారు.

ఆ విధంగా జగన్ మీడియా ముఖంగానే విపక్ష పాత్ర పోషించారు. తొలి ఏడాది సూపర్ సిక్స్ హామీలు అమలు కాలేదని వైసీపీ ఆరోపిస్తోంది. అందుకే వెన్నుపోటు దినం అని చెబుతోంది. కానీ ప్రభుత్వం మీద పెట్టాల్సిన ఒత్తిడి ఒక విపక్ష పార్టీగా వైసీపీ ఎంతవరకూ పెట్టింది అన్నది కూడా చర్చకు వస్తోంది.

ప్రజా స్వామ్యంలో ఎవరి బాధ్యతలు వారికి ఉంటాయి. అధికార పార్టీ పాలన చేయాలి. అందులో తప్పులు ఉంటే ప్రజా ప్రక్షాన నిలబడి విపక్షం వాటిని ఎత్తి చూపాలి. నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది. కానీ వైసీపీ అధినేత మాత్రం ఆ పాత్ర పోషణలో ఎందుకో అంత చురుకుగా ఈ ఏడాది కాలంలో వ్యవహరించలేదు అని అంటున్నారు. అందుకే వైసీపీ గ్రాఫ్ కూడా అనుకున్నంతగా పెరగలేదు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే వైసీపీలో సైతం నిరాశాజనకంగా ఏడాది పాటు సాగింది. అంతా బయటకు వెళ్ళిపోయే వారు తప్ప ఉండే వారు ఎవరు అన్న చర్చ కూడా సాగింది. పునాది లాంటి విజయసాయిరెడ్డి పార్టీని వీడడం మాత్రం పెద్ద షాక్ గానే చెబుతున్నారు. ఏది ఏమైనా కూటమి పాలనను విమర్శిస్తున్న వైసీపీ అదే సమయంలో విపక్షంలో ఉన్న తన పాత్రను తన రాజకీయ ప్రదర్శనను కూడా ఆత్మ విమర్స చేసుకుంటే బాగుంటుంది అన్న సూచనలు వస్తున్నాయి.