Begin typing your search above and press return to search.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఏం జరిగింది? మోదీతో ఒమర్ అబ్దుల్లా భేటీ

పహల్గాం మారణకాండ తర్వాత జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం ప్రధాని నరేంద్ర మోడీని కలవడం దేశ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

By:  Tupaki Desk   |   4 May 2025 7:56 AM
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఏం జరిగింది? మోదీతో ఒమర్ అబ్దుల్లా భేటీ
X

పహల్గాం మారణకాండ తర్వాత జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం ప్రధాని నరేంద్ర మోడీని కలవడం దేశ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రధాని నివాసంలో దాదాపు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో పహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత పరిణామాలపై ఇరువురు నేతలు క్షుణ్ణంగా చర్చించారు. ఉగ్రవాదుల దుశ్చర్యలు, వాటిని ఎదుర్కోవడానికి తీసుకుంటున్న భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతోందనే వార్తలు వస్తున్న తరుణంలో ప్రధాని మోడీతో ఒమర్ అబ్దుల్లా భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. జమ్మూ కాశ్మీర్‌లోని తాజా పరిస్థితులను, క్షేత్రస్థాయి వాస్తవాలను సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రధాని మోడీకి వివరించారు.

పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా జమ్మూ కాశ్మీర్‌లో వెల్లువెత్తిన ప్రజా నిరసనల గురించి ప్రధాని మోడీకి ఒమర్ అబ్దుల్లా తెలియజేశారు. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోనీవాలా సయ్యద్ అదిల్ హుస్సేన్ షా ధైర్యసాహసాలను ప్రధానికి వివరించారు. పర్యాటకులను రక్షించడానికి ఆయన చేసిన ప్రయత్నాలను కొనియాడారు.

పహల్గాం దాడిలో పర్యాటకులను కాపాడలేకపోయినందుకు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఒమర్ అబ్దుల్లా ఇదివరకే విచారం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సమయంలో రాష్ట్ర హోదా గురించి కేంద్రాన్ని అడగడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులను నివారించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తర్వాత భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. సరిహద్దు ప్రాంతాలతో పాటు జమ్మూ కాశ్మీర్ అంతటా ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు నిర్వహించారు.

ఉగ్రవాదులకు సహకరించిన వారిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఉగ్రవాదులు పక్కా ప్రణాళికతోనే ఈ దాడికి పాల్పడినట్లు విచారణలో తేలింది. ఏప్రిల్ 15న పహల్గాం చేరుకున్న ఉగ్రవాదులు బైసరన్ లోయలో దాడికి వ్యూహరచన చేశారు. ఉగ్రవాదులకు స్థానికులు సహకరించారని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) గుర్తించింది. పహల్గాం దాడికి పాకిస్థానే సూత్రధారి అని తేలడంతో భారత్ ఆ దేశానికి ఎగుమతులు, దిగుమతులు రద్దు చేసింది.