Begin typing your search above and press return to search.

పహల్గాం దాడి జరిగిన చోటే మంత్రుల సమావేశం..సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక ప్రకటన!

"మేం మా ప్రజల ధైర్యాన్ని చూసి గర్విస్తున్నాం. పర్యాటకాన్ని తిరిగి ప్రోత్సహించడానికి మేము పహల్గాం వచ్చాం. మా ప్రయత్నాలు కొనసాగుతాయి" అని ఒమర్ అబ్దుల్లా మీడియాతో అన్నారు.

By:  Tupaki Desk   |   27 May 2025 10:30 PM
పహల్గాం దాడి జరిగిన చోటే మంత్రుల సమావేశం..సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక ప్రకటన!
X

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్ర దాడితో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. అయితే, ఈసారి ప్రభుత్వం భయపడి వెనక్కి తగ్గకుండా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన మంత్రుల బృందంతో కలిసి, శ్రీనగర్ లేదా జమ్ములోని తమ సాధారణ ఆఫీసుల్లో కాకుండా నేరుగా పహల్గాం వెళ్లి క్యాబినెట్ మీటింగ్ నిర్వహించారు. ఇది కేవలం ఒక మీటింగ్ కాదు ఉగ్రవాదుల పిరికిపంద చర్యలకు తాము భయపడబోమని, ప్రజలకు అండగా ఉంటామని చెప్పే ఒక గట్టి జవాబు అని చెప్పొచ్చు.

ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ అనే ప్రాంతంలో జరిగిన దాడిలో అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత పర్యాటకుల రాక పూర్తిగా తగ్గిపోయింది. దీంతో పర్యాటకంపైనే ఆధారపడి జీవనం సాగించే స్థానిక ప్రజలు భయపడిపోయారు. వారి భయాలను పోగొట్టడానికి, వారికి ధైర్యం చెప్పడానికే సీఎం ఒమర్ అబ్దుల్లా ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నారు.

"మేం మా ప్రజల ధైర్యాన్ని చూసి గర్విస్తున్నాం. పర్యాటకాన్ని తిరిగి ప్రోత్సహించడానికి మేము పహల్గాం వచ్చాం. మా ప్రయత్నాలు కొనసాగుతాయి" అని ఒమర్ అబ్దుల్లా మీడియాతో అన్నారు. పహల్గాం క్లబ్‌లో జరిగిన ఈ సమావేశం దృశ్యాలను ఆయన తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. "ఉగ్రవాదుల పిరికిపంద చర్యలకు మేము ఏమాత్రం భయపడబోమని చెప్పడానికే ఇక్కడికి వచ్చాం. జమ్మూకశ్మీర్ దృఢంగా నిలబడుతుంది" అని ఆయన పోస్ట్‌లో రాశారు.

ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇలా రాజధాని నగరాల బయట క్యాబినెట్ సమావేశాలు నిర్వహించడం కొత్తేమీ కాదు. 2009 నుంచి 2014 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ ఆయన గురెజ్, మచిల్, తాంగ్‌ధర్ (ఉత్తర కశ్మీర్), రాజౌరీ, పూంచ్ (జమ్మూ ప్రాంతం) వంటి మారుమూల ప్రాంతాల్లోనూ ఇలాంటి మీటింగ్స్ పెట్టారు. ఇది ఆయన పాలనా శైలిలో ఒక ముఖ్యమైన భాగం.

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించే నీతి ఆయోగ్ సమావేశాన్ని కూడా పహల్గాంలోనే నిర్వహించాలని ఒమర్ అబ్దుల్లా కోరారు. ఇలాంటి చర్యలు స్థానిక ప్రజలలో ఉగ్రవాదం పట్ల ఉన్న భయాలను తగ్గిస్తాయని, ప్రభుత్వం తమకు అండగా ఉందని వారికి నమ్మకం కలిగిస్తాయని ఆయన నమ్ముతున్నారు. దాడి జరిగిన ప్రాంతంలోనే మంత్రులు సమావేశం కావడం ద్వారా, ప్రజలకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని, పర్యాటకాన్ని తిరిగి గాడిలో పెడుతుందని స్పష్టమైన సందేశం పంపారు.