Begin typing your search above and press return to search.

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై లోకేష్ సైన్యం దాడి!

అసలు టీడీపీ మీటింగుల్లో ఎన్టీఆర్ ఫోటోలు ఎందుకు ప్రదర్శిస్తున్నారంటూ లోకేష్ సైన్యం చెలరేగిపోయిందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   8 Jan 2024 3:59 AM GMT
జూనియర్  ఎన్టీఆర్  అభిమానులపై లోకేష్  సైన్యం దాడి!
X

ప్రస్తుతం టీడీపీ ఆధ్వర్యంలో "రా.. కదలి రా.." సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభలకు వస్తున్న ఆదరణ సంగతి కాసేపు పక్కనపెడితే ఈ సభల పుణ్యమానికి తెరపికి వస్తున్న పాత సమస్యలు టీడీపీ నేతలకు కొత్త టెన్షన్స్ పుట్టిస్తున్నాయనే కామెంట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా మరోసారి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై లోకేష్ సైన్యం విరుచుకుపడిన దారుణ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

అవును... పశ్చిమ­గోదావరి జిల్లా ఆచంట, ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో "రా... కదలి రా.." పేరిట ఆదివారం నిర్వహించిన సభకు టీడీపీ కార్యకర్తలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయన ఫ్లెక్సీలు, ఫోటోలు చేతపట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. దీంతో లోకేష్ సైన్యం జీర్ణించుకోలేకపోయింది! జూనియర్ ఫోటోలు చూడగానే ఆయన అభిమానులపై లోకేష్ సైన్యం విరుచుకుపడింది.

అసలు టీడీపీ మీటింగుల్లో ఎన్టీఆర్ ఫోటోలు ఎందుకు ప్రదర్శిస్తున్నారంటూ లోకేష్ సైన్యం చెలరేగిపోయిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై దుర్భాషలాడారని సమాచారం! దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని అత్యంత సీరియస్ గా తీసుకున్నారని.. ప్రతీసారీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై టీడీపీలో వివక్ష కొనసాగుతూనే ఉంటుందని.. ఇలానే చూస్తూ ఊరుకోవడం సరైంది కాదని.. ఈ విషయంపై ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ఈ సంఘటనతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ లోకేష్ సైన్యం అనే చర్చ మరోసారి బలంగా తెరపైకి వచ్చిందని తెలుస్తుంది. ఈ సందర్భంగా వారు చేసిందల్లా కేవలం... "జై ఎన్టీఆర్, జై జూనియర్‌ ఎన్టీఆర్‌" అంటూ నినాదాలు చేయడం మాత్రమే. ఇదే సమయంలో జనసేన అభిమానులు సైతం వారి పార్టీ జెండాలతో అక్కడకు రావడం, జై పవన్ అని నినాదాలు చేయడంతో వారి జెండాలను కూడా లోకేష్ సైన్యం లాక్కుని బయటకు విసిరేశారని అంటున్నారు.

కాగా... ఇప్పటికే పలుమార్లు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు టీడీపీ సభల్లో అవమానాలు జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల ఉమ్మడి కృష్ణాజిల్లాలో జరిగిన సభల్లోనూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఉద్దేశించి "వారిని పక్కలు లాగేయండి.." అని సీరియస్ గా చెప్పడం, ఇక టీడీపీ ఫ్యాన్స్ వారిని లాగి పాడేయడం జరిగిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి సంఘటన మరోసారి జరగడంతో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.

దీంతో... ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడి మనవడికి నేడు పార్టీలో ఇలాంటి అవమానాలు జరగడం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఈ సంఘటనపై రాష్ట్రవ్యాప్తంగా యంగ్ టైగర్ ఫ్యాన్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందనేది వేచి చూడాలి!