Begin typing your search above and press return to search.

రాష్ట్ర పండుగ‌గా అన్న‌గారి జ‌యంతి.. జీవో జారీ!

తెలుగు దేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి దివంగ‌త నంద‌మూరి తార‌క రామారావు జ‌యంతిని రాష్ట్ర పండుగ‌గా నిర్వ‌హించాల‌ని కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది

By:  Tupaki Desk   |   28 May 2025 5:43 AM
May 28 Declared State Festival to Commemorate NTR’s Contributions
X

తెలుగు దేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి దివంగ‌త నంద‌మూరి తార‌క రామారావు జ‌యంతిని రాష్ట్ర పండుగ‌గా నిర్వ‌హించాల‌ని కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. విజ‌యా నంద్ మంగ‌ళ‌వారం రాత్రి ఉత్త‌ర్వులు జారీ చేశారు. తెలుగు వారి అన్న‌గారిగా సుప‌రిచితులైన తార‌క రామారావు.. మే 28న జ‌న్మించిన విష‌యం తెలిసిందే. దీనిని పుర‌స్క‌రించుకునే టీడీపీ మ‌హానాడును అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిస్తోంది ఇలాంటి స‌మ‌యంలో అనూహ్యంగా ఈ నిర్న‌యం తీసుకోవ‌డంతో పార్టీ అభిమానులు.. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ కూడా హ‌ర్షం వ్య‌క్తం చేస్తోంది.

నందమూరి తారక రామారావు 1928 మే 28న ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని నిమ్మ‌కూరులో జ‌న్మించారు. బీఏ వ‌ర‌కు విజ‌య‌వాడ‌లో చ‌దివిన ఆయ‌న సినీ రంగంపై మ‌క్కువ‌తో అప్ప‌టి మ‌ద్రాస్‌కు వెళ్లి.. తెలుగు సినిమాల్లో ట్రై చేశారు. ఇలా.. ఆయ‌న ప్ర‌స్తానం అప్ర‌తిహతంగా సాగింది. విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌముడిగా ఆయ‌న ఖ్యాతి చెందారు. 1980ల‌లో కాంగ్రెస్ పాల‌న‌.. అప్ప‌టి నాయ‌కుల‌కు ఢిల్లీలో జ‌రుగుతున్న అవ‌మానాల‌ను దృష్టిలో పెట్టుకుని 1982లో తెలుగు దేశం పార్టీని ఆయ‌న స్థాపించారు. తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ నినాదంతో చైత‌న్య ర‌థ‌యాత్ర‌లు చేసి కేవ‌లం 9 మాసాల్లోనే అధికారంలోకి వ‌చ్చారు.

పేద‌లే పెన్నిధి నినాదంతో పాల‌న సాగించిన అన్న‌గారు.. స‌మాజంలోని బీసీ సామాజిక వ‌ర్గంలో మేలు మ‌లుపులు తీసుకు వచ్చేందుకు ప్ర‌య‌త్నించారు. రెండు రూపాయ‌ల‌కే కిలో బియ్యం, మ‌హిళ‌ల‌కు ఆస్తిలో హ‌క్కు, బీసీల‌కు ప‌ద‌వులు ఇలా.. అనే కీల‌క నిర్ణ‌యాలు తీసుకుని పేద‌ల పెన్నిధిగా, తెలుగింటి అన్న‌గారిగా కీర్తి గ‌డించారు. ఆయ‌న సంస్మ‌ర‌ణార్థం.. రాష్ట్ర ప్ర‌భుత్వం తొలిసారి ఆయ‌న జ‌యంతి రోజైన మే 28న రాష్ట్ర పండుగ‌గా పేర్కొంది. ఈ మేర‌కు జీవో విడుద‌ల చేశారు. మే 28న అన్న‌గారి జ‌యంతిని పుర‌స్క‌రించుకుని అన్ని జిల్లాల్లోనూ.. ఆయ‌న చిత్ర‌ప‌టాల‌కు క‌లెక్ట‌ర్లు, అధికారులు నివాళుల‌ర్పిస్తారు. ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రించుకుంటారు.