పుదుచ్చేరి ఫైటింగ్: శపథం చేసి మరీ గెలుస్తున్న పెద్దాయన!
కేవలం 30 అసెంబ్లీ స్థానాలు. అదొక కేంద్ర పాలిత ప్రాంతం కూడా. ఏం చేయాలన్నా.. కేంద్రం నుంచి అనుమతి తప్పని సరి.పైగా.. పుదుచ్చేరి వాసులు కొన్ని దశాబ్దాలుగా పెట్టుకున్న ఆకాంక్షలు కూడా పెద్దగా నెరవేరడం లేదు.
By: Garuda Media | 29 April 2026 8:13 PM ISTకేవలం 30 అసెంబ్లీ స్థానాలు. అదొక కేంద్ర పాలిత ప్రాంతం కూడా. ఏం చేయాలన్నా.. కేంద్రం నుంచి అనుమతి తప్పని సరి.పైగా.. పుదుచ్చేరి వాసులు కొన్ని దశాబ్దాలుగా పెట్టుకున్న ఆకాంక్షలు కూడా పెద్దగా నెరవేరడం లేదు. దీంతో ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ ఎన్నార్ కాంగ్రెస్ పై భారీ అసంతృప్తితో ఉన్నారు. దీంతో సహజంగానే ఎన్నికల సమయంలో తమ సత్తా చూపించి.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఓటేస్తారు. కానీ.. ఇప్పుడు అలా జరగడం లేదు!. ఇటీవల ఈ నెల 23న ఇక్కడ ఎన్నికల పోలింగ్ జరిగింది. 30 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్ ఫలితాలు మే 4న విడుదల కానున్నాయి.
కానీ.. తాజాగా మంగళవారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. దీనిలో మెజారిటీ సర్వేలన్నీ.. ఎన్నార్ కాంగ్రెస్(అదికార పార్టీ) వైపే మొగ్గు చూపాయి. మరోసారి ఈ పార్టీ విజయం దక్కించుకుంటుందని పేర్కొన్నాయి. ఇంతకీ ఎన్నార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఎన్. రంగ స్వామి. గతంలో కాంగ్రెస్లో ఉన్న ఆయన ఆ పార్టీతో విభేదించి.. బయటకు వచ్చి.. తన పేరుతోనే పార్టీ పెట్టుకున్నారు. ఈ క్రమంలో బీజేపీతో చేతులు కలిపి పొత్తు పెట్టుకుని..వరుస విజయాలు కూడా దక్కించుకున్నారు. తాజా ఎన్నికల్లోనూ కమలంతో కలిసే పోటీ చేశారు.
75 ఏళ్లకు పైగా వయసున్న రంగస్వామి.. సాధారణ నాయకుడిగా ఉంటారు. సీఎం అయినప్పటికీ.. ఆయన బుల్లెట్ బండిపై రాక పోకలు సాగిస్తారు.ఇ టీవల ఓటు వేసేందుకు కూడా ఆయన బుల్లెట్పైనే వచ్చారు. ప్రజలను కలుసుకునేందుకు బయటకు వచ్చినా.. ఆయన కార్లను పెద్దగా ఇష్టపడరు. ఇదే.. పుదుచ్చేరి ప్రజలకు నచ్చింది. అయినా.. కీలకమైన `రాష్ట్ర హోదా` సాధించే విషయంలో రంగస్వామి వెనుకబడుతున్నారు. ఈ ఒక్కటే ఆయనపై ఉన్న అసంతృప్తి. అయితే.. ఆయన ప్రధానిని గత ఐదేళ్ల కాలంలో 35 సార్లు కలిసి.. విజ్ఞప్తి చేయడం.. ఇది సానుకూలతను కల్పించింది.
దీంతో తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటమి(డీఎంకే భాగస్వామి).. తాము అధికారంలోకి వస్తే.. ప్రత్యేక రాష్ట్ర హోదా ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ, రంగ స్వామి ప్రజల మధ్యకు వెళ్లి.. `నాపై నమ్మకం ఉంటే.. ఈ సారికి మీఓటు నాకే వేయాలి. ఈ దఫా హోదా తీసుకువస్తా`` అని శపథం చేశారు. ఇది బాగా ఫలించింది. తాజాగా వచ్చిన ఎగ్జిట్పోల్ సర్వేలో 75 ఏళ్లకుపైగా వయసున్న సీఎం రంగస్వామి నేతృత్వంలోని కూటమి విజయం దక్కించుకుంటోందని అనే సర్వేలు తేల్చి చెప్పాయి. అయితే.. వాస్తవ ఫలితం మాత్రం మే 4నే రానుంది. అధికారంలోకి వచ్చేందుకు 16 స్థానాలు గెలిస్తే చాలు.
ఇదీ ఎగ్జిట్ ఫలితం..
ప్రజా పోల్: ఎన్ ఆర్ కాంగ్రెస్(రంగస్వామి): 19-25, కాంగ్రెస్+డీఎంకే: 06-10
పల్స్ టుడే: ఎన్ ఆర్ కాంగ్రెస్(రంగస్వామి): 17-20, కాంగ్రెస్+డీఎంకే: 10-13
ఎస్ ఏ ఎస్ గ్రూప్: ఎన్ ఆర్ కాంగ్రెస్(రంగస్వామి): 17-19, కాంగ్రెస్+డీఎంకే: 11-12
చాణక్య స్ట్రాటజీస్: ఎన్ ఆర్ కాంగ్రెస్(రంగస్వామి): 17-20, కాంగ్రెస్+డీఎంకే: 9-13
పీపుల్స్ పల్స్: ఎన్ ఆర్ కాంగ్రెస్(రంగస్వామి): 16-19, కాంగ్రెస్+డీఎంకే:10-12
యాక్సిస్ మై ఇండియా: ఎన్ ఆర్ కాంగ్రెస్(రంగస్వామి): 16-19, కాంగ్రెస్+డీఎంకే: 11-14
పోల్ ల్యాబ్: ఎన్ ఆర్ కాంగ్రెస్(రంగస్వామి): 18-22, కాంగ్రెస్+డీఎంకే: 04-06
