Begin typing your search above and press return to search.

నాగబాబు అలిగాడు అంట...!?

అసలు ఎందుకు నాగబాబు అలిగారు అంటే ఆయనకు టికెట్ ఇవ్వలేదు అనా అంటే అది కూడా కారణం కావచ్చు అంటున్నారు.

By:  Tupaki Desk   |   12 March 2024 5:36 AM GMT
నాగబాబు అలిగాడు అంట...!?
X

మెగా బ్రదర్ నాగబాబు అలిగారా..ఆరడుగుల నాగబాబుకు కోపం ఎందుకు వచ్చింది. ఆయన ఎందుకు సడెన్ గా జనసేన పొలిటికల్ సీన్ నుంచి సైడ్ అయిపోయారు. అసలు నాగబాబు పొలిటికల్ ఫ్యూచర్ ఏమిటి. ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తారా చేయరా ఇదే జనసేనతో పాటు రాజకీయ వర్గాలలో ప్రస్తుతం చర్చ సాగుతోంది.

నాగబాబు అన్న చాటు తమ్ముడు, తమ్ముడి మాటున అన్న. ఆయన గురించి ఎక్కువగా ఇలాగే చెబుతారు. అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు అందులో కీలకంగా అల్లు అరవింద్ వ్యవహరించేవారు. మరో వైపు నాగబాబు ఫ్యాన్స్ అందరినీ పార్టీకి చేరువ చేస్తూ వారికి బాసటగా ఉంటూ వచ్చారు.

అయితే ప్రజారాజ్యం ఫెయిల్యూర్ తో నాగబాబు పాలిటిక్స్ కి దూరం అయ్యారు. నిజానికి ప్రజారాజ్యంలో ఆయన తెర ముందుకు వచ్చి చేసింది ఏమీ లేదు. ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. కానీ ఆయన పార్టీ కోసం పనిచేసారు. ఇక 2014 లో జనసేన పెట్టినప్పుడు కూడా నాగబాబు కనిపించలేదు. అయిదేళ్ల పాటు పవన్ మాత్రమే దానిని మోస్తూ కదిలారు.

ఇక 2019 ఎన్నికల ముందు మాత్రం నాగబాబు జనసేనలో హఠాత్తుగా కనిపించారు. ఆయన ఏకంగా నర్సాపురం నుంచి ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు రెండున్నర లక్షలకు పైగా ఓట్లు సాధించారు. అలా నాగబాబు పొలిటికల్ ఎంట్రీ జనసేన ద్వారా మరోసారి జరిగిపోయింది. జనసేన 2019లో ఓటమి పాలు కావడంతో నాగబాబు కూడా చాన్నాళ్ళు తెర వెనక ఉన్నారు.

ఇటీవల కాలంలో ఆయన మళ్లీ చురుకుదనం తెచ్చుకున్నారు. ఈసారి టీడీపీతో పొత్తులు ఉంటాయి కాబట్టి నాగబాబు జనసేన నుంచి ఎంపీగా పోటీ చేస్తే డ్యాం ష్యూర్ గా గెలుస్తారు అని భావించారు. ఆయనకు మొదట నర్సాపురం ఎంపీ సీటు అన్నారు. ఆ తరువాత ఆయన్ని అనకాపల్లికి వెళ్ళమన్నారు. నాగబాబు అనకాపల్లి నుంచి పోటీ అని అంతా ప్రచారం పెద్ద ఎత్తున సాగింది.

తీరా చూస్తే ఆ సీటు జనసేనకు లేకుండా పోయింది. దాంతో అనకాపల్లి ఎంపీ పోటీ అని అచ్యుతాపురంలో మకాం పెట్టిన నాగబాబు అక్కడ నుంచి అంతా సర్దేసి హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇది జరిగి పది రోజులు పై దాటుతోంది. నాగబాబు నుంచి రాజకీయ అలికిడి అయితే లేదు. ఆయన సైలెంట్ అయ్యారు అని వార్తలు వస్తున్నాయి.

ఇపుడు చూస్తే ఆయన అలిగారు అని మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. అసలు ఎందుకు నాగబాబు అలిగారు అంటే ఆయనకు టికెట్ ఇవ్వలేదు అనా అంటే అది కూడా కారణం కావచ్చు అంటున్నారు. అంతే కాదు ముందు టికెట్ ఇస్తామని చెప్పి ఆ తరువాత లేదు అంటే ఆరున్నర పదుల వయసు దాటిన నాగబాబు వంటి వారికి సహజంగానే కోపం వస్తుంది. ఆయన పెద్ద మనిషిగా ఉన్నారు.

పైగా మెగా ఫ్యామిలీకి చెందిన వారు. రాజకీయంగా ఆయన ఎవైనా కామెంట్స్ చేస్తూ ఉన్నా ఆయన అన్న చిరంజీవికి తమ్ముడు పవన్ కి మాత్రం విధేయుడు. అన్నను ఒక్క మాట అన్నా సహించేది లేదు అంటారు. అలాగే పవన్ మీద ఎవరు నోరు పారేసుకున్నా నాగబాబు వారిని చీల్చి చెండాడుతారు.

ఒక విధంగా నాగబాబుకు పాలిటిక్స్ పెద్దగా తెలియదు అని అంటారు. ఆయన వట్టి భోళా మనిషి గానే చూస్తారు. ఏ అంశం మీద అయినా మనసులో ఉన్నది ఉన్నట్లుగా అనేస్తారు. దాని ప్రభావం ఆయనకు తెలియదు. ఆ తరువాత సారీ చెప్పినా వివాదం మాత్రం అలాగే ఉంటుంది. అది నాగబాబ్ వ్యవహార శైలి.

ఆయన తమ్ముడికి చేదోడు వాదోడుగా ఉండాలనే అనుకున్నారు. పోటీ చేయను అన్నారు. కానీ చేయమంటే సరేనన్నారు. తీరా రంగంలోకి దిగాక నో అంటే అది బాధే కదా. ఇక బీజేపీ కూడా టీడీపీ కూటమిలో చేరడంతోనే నాగబాబు సీటు పోయింది అని అంటున్నారు. ఏది ఏమైనా నాగబాబుకు ఎన్నికల తరువాత కూటమి తెలిస్తే ఎక్కడో ఒక చోట సర్దుతారని, లేకపోతే కీలకమైన నామినేటెడ్ పదవి ఇస్తారు అని అంటున్నారు.

కానీ నాగబాబుకు ఎంపీ టికెట్ ఇవ్వకపోవడం మాత్రం మెగా ఫ్యాన్స్ కి కొంత బాధించేలా ఉంది అని అంటున్నారు. తన సొంత అన్నకు టికెట్ ఇప్పించుకోలేకపోయారు పవన్ అని అంటున్నారు. పొత్తులలో ఎక్కడా టీడీపీలో చంద్రబాబు బంధువుల సీట్లు పోలేదు అని గుర్తు చేస్తున్నారు.

మరి పవన్ కళ్యాణ్ ఉదారంగా వ్యవహరించడం వల్లనే ఇలా జరుగుతోందా జవాబు ఎవరికి వారే చెప్పుకోవాలి. ఏది ఏమైనా నాగబాబు మాత్రం రాజకీయంగా షాక్ కి గురి అయ్యారనే అంటున్నారు. ఇది నెటిజన్ల భావనగా ఉంది. ఆయన అలిగారు అని కూడా నెటిజన్లు అంటున్నారు.