Begin typing your search above and press return to search.

బీహార్ నితీష్ మళ్లీ బీజేపీ వైపు...!

బీహార్ సీఎం నితీష్ కుమార్ మరోసారి కమలంతో కరచాలనం చేస్తారా అంటే జరుగుతున్న పరిణామాలు అలాగే ఉన్నాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   26 Jan 2024 3:47 AM GMT
బీహార్ నితీష్ మళ్లీ బీజేపీ వైపు...!
X

బీహార్ సీఎం నితీష్ కుమార్ మరోసారి కమలంతో కరచాలనం చేస్తారా అంటే జరుగుతున్న పరిణామాలు అలాగే ఉన్నాయని అంటున్నారు. నితీష్ సుదీర్ఘ కాలంగా బీహార్ కి సీఎం గా ఉంటున్నారు. ఆయన ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్న మహా కూటమి నుంచి బయటకు రానున్నారు అని అంటున్నారు. గత పదేళ్లలో నితీష్ కుమార్ ఒక వైపు మహా కూటమి అని లాలూతో మరో వైపు బీజేపీతో ఇలా తన సీఎం పదవిని కాపాడుకుంటూ ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు. ఆయన 2015లో మహా కూటమితో పొత్తులో ఉన్నారు. ఆ తరువాత బీజేపీ వైపు వచ్చి 2020లో బీజేపీ సహకారంతో గెలిచారు.

రెండేళ్ళు తిరగకుండానే నితీష్ కుమార్ మహా కూటమి వైపు మళ్లారు. ఇపుడు రెండేళ్ళు తిరగకుండానే అటు నుంచి ఈ వైపు వస్తున్నారు. ఇక 2024లో బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి. కానీ ఏడాది ముందే అసెంబ్లీని రద్దు చేసి లోక్ సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీకి ఎన్నికలు జరిపించాలని అలా మరోసారి సీఎం కావాలని నితీష్ ఆలోచనలు సాగుతున్నాయని అంటున్నారు.

తాజాగా ఆయన మీద లాలూ కుమార్తె రోహిణి చేసిన కామెంట్స్ దాని కంటే ముందు ఆయన బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాగూర్ శత జయంతి సందర్భంగా చేసిన కామెంట్స్ మహా కూటమితో ఆయనకు ఉన్న విభేదాలు బయటపెడుతున్నాయి. వంశ పారంపర్య రాజకీయాలకు కర్పూరీ ఠాగూర్ దూరం అని నితీష్ అనడం ఆర్జేడీని ఉద్దేశించే అని అంటున్నారు. కొన్ని పార్టీలు కేవలం తన రాజకీయ వారసుల కోసమే పోరాటం చేస్తాయని చురకలు వేశారు.

దానికి లాలూ కుమార్తె రోహిణి రిటార్ట్ ఇచ్చేశారు. కొంత మంది నాయకులు తమ స్వార్ధం చూసుకుంటారు. తమలోని లోపాలను సవరించుకోలేరు ఇతరుల మీద బురద జల్లుడే వారి పని అని ఇండైరెక్ట్ గా నితీష్ ని విమర్శించారు. దీంతో మహాకూటమితో నితీష్ కి విభేదాలు బాహాటం అని తెలిసిపోయింది.

అంతే కాదు ఆయన అసెంబ్లీని రద్దు చేయాలని చూస్తున్నారు. ఇక నితీష్ ఈ విధంగా చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. నితీష్ నిజానికి ఈ దఫా సీఎం పోస్టుకు స్వస్తి పలికి జాతీయ రాజకీయాల వైపు చూడాలని అనుకున్నారు. కానీ ఆయనకు లాలూ అడ్డు చక్రం వేశారు అని అంటున్నారు. ఇండియా కూటమిలో నితీష్ కన్వీనర్ కాకుండా లాలూ బ్రేక్ వేశారని అంటున్నారు.

అదే విధంగా ఆయన చేతుల నుంచి సీఎం పోస్టుని తీసుకోవాలని కూడా మరో వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలు సైతం లాలూకే సపోర్ట్ గా ఉండడంతో నితీష్ తీవ్ర ఆగ్రహానికి గురి అయ్యారని అంటున్నారు.అందుకే ఈ నెల 30న తన రాష్ట్రానికి వచ్చే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు హాజరు కాకూడదని నితీష్ నిర్ణయించుకున్నారు అని అంటున్నారు.

ఒక విధంగా నితీష్ బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీకి కూడా కావాల్సింది అదే. బీహార్ లో నితీష్ జేడీయూ కలిస్తే మెజారిటీ ఎంపీలను ఆ పార్టీ గెలుచుకుంటుంది. అంతే కాదు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తే జేడీయూ, బీజేపీ సర్కార్ ఏర్పాటు అవుతుంది. దాంతో కమలనాధులు కూడా నితీష్ లాలూల మధ్య యుద్ధాన్ని ఆస్వాదిస్తున్నారు మొత్తానికి బీహారీ బాబు నితీష్ అక్కడ రాజకీయాన్ని ప్లేట్ ఫిరాయించి మార్చేయబోతున్నారు అని అంటున్నారు.