Begin typing your search above and press return to search.

నితీష్ కి ఉప ప్రధాని...మోడీ ఆలోచన అదేనా ?

బీహార్ కి రెండు దశాబ్దాలుగా నిరాటంకంగా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు నితీష్ కుమార్.

By:  Tupaki Desk   |   11 April 2025 3:14 AM
నితీష్ కి ఉప ప్రధాని...మోడీ ఆలోచన అదేనా ?
X

బీహార్ కి రెండు దశాబ్దాలుగా నిరాటంకంగా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు నితీష్ కుమార్. ఆయనను ఉప ప్రధాని చేయాలని బీజేపీ నుంచే ఒక కీలకమైన డిమాండ్ వస్తోంది. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న నితీష్ కుమార్ ని ఉప ప్రధానిగా చూడాలని అనుకుంటున్నమని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి అశ్విని కుమార్చౌబే సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఈ మాటలు అనాల్సింది జేడీయూ. కానీ బీజేపీ నేతలు చేస్తున్నారు. ఇక చూస్తే కనుక బీహార్ లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ జేడీయూ కలసి పోటీ చేస్తున్నాయి. ఈసారి ఎన్డీయే గెలిస్తే కనుక బీహార్ కి తొలిసారి సీఎం కావాలని బీజేపీ ఆశపడుతోది.

అయితే దానికి ఆటంకంగా నితీష్ కుమార్ ఉన్నారు. ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే కనుక బీహార్ కి ముఖ్యమంత్రి పదవి అన్నది సాధ్యం కాదు. 2020 ఎన్నికల్లో కూడా బీజేపీకి దాదాపుగా 80 అసెంబ్లీ సీట్లు దాకా వచ్చినా జేడీయూకి 40 దాకా వచ్చినా చివరికి నితీష్ నే సీఎం గా చేయాల్సి వచ్చింది. లేకపోతే ఆయన ఇండియా కూటమి వైపు వెళ్తారు అన్న భయం కూడా ఉంది.

కానీ అదే జరిగింది మధ్యలో నితీష్ ఇండియా కూటమి వైపు వెల్ళారు. కానీ కొన్నాళ్ళ తరువాత తిరిగి వచ్చారు. ఇపుడు ఆయన ఎండీయే వైపే ఉంటున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో గెలిచి బీహార్ లో కమల వికాసం చేయాలని ఆ పార్టీ తాపత్రయపడుతోంది. యూపీ సహా ఉత్తరాది రాష్ట్రాలు అన్నింటా సీఎం సీటు ఎక్కిన బీజేపీకి బీహార్ ముచ్చట మాత్రం తీరడం లేదు.

దాంతో ఈసారి చాన్స్ ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరాదు అన్నదే ఆ పార్టీ ఆలోచన అని చెబుతున్నారు. అయితే ముందుగానే జేడీయూ నేతలలో ఈ ఆలోచన ఇంజెక్ట్ చేయడానికి అన్నట్లుగా నితీష్ కుమార్ ని ఉప ప్రధాని స్థాయిలో చూడాలని ఉందని బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి అశ్విని కుమార్చౌబే తో ఈ తరహా వ్యాఖ్యలు చేయించారా అన్న చర్చ వస్తోంది.

ఇక బీహార్ సీఎం పోస్టు కనుక నితీష్ వదిలేస్తే ఆయనను కేంద్ర స్థాయిలో తీసుకుంటారు అన్నది అయితే ప్రచారంలో ఉంది అయితే ఆయనకు కేంద్ర మంత్రి వరకూ ఓకే కానీ ఉప ప్రధాని పదవి ఇస్తారా అన్నది కూడా మరో చర్చ. ఎందుకంటే ఉప ప్రధాని పదవికి ఏ రకమైన ప్రత్యేక అధికారాలు రాజ్యాంగబద్ధంగా లేకపోయినా రాజకీయంగా మాత్రం మోడీ తరువాత ఆయనే అన్న సంకేతాలు వస్తాయి.

పైగా బీజేపీ ఇప్పటిదాకా ఈ పదవిని క్రియేట్ చేయలేదు. ఇప్పటికి 21 ఏళ్ళ క్రితం 2004 మే 23 దాకా అప్పటి సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ వాజ్ పేయ్ వద్ద ఉప ప్రధానిగా పనిచేశారు. ఆయనే ఆఖరుగా ఈ పదవి చేపట్టిన వారు గా ఉన్నారు

ఇక దేశ చరిత్రలో తీసుకుంటే నెహ్రూ తొలి ప్రధానిగా ఉంటే తొలి ఉప ప్రధానిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పనిచేశారు. అలాగే సీనియర్ నేతగా మొరార్జీ దేశాయ్, చౌదరి చరణ్ సింగ్ వంటి వారు చేశారు. ఇక బాబూ జగ్జీవన్ రాం ఉప ప్రధానిగా వ్యవహరించారు అలాగే, యశ్వంతరావు చవాన్ ఉప ప్రధానిగా పనిచేశారు. వీపీ సింగ్ నాయకత్వంలో 1989లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు అయితే ఉప ప్రధానిగా దేవి లాల్ ఉన్నారు. మొత్తంగా చూస్తే ఈ దేశంలో ఉప ప్రధానుల సంఖ్య ఏడుకు మించి లేదు.

మరో చిత్రమేంటి అంటే ఉప ప్రధానిగా ఉంటూ అధికార పగ్గాలకు దగ్గరగా కనిపించిన వారు అంతా ఆ తరువాత ప్రధానులు కాలేకపోయారు. ఆ పదవే వారికి చివరిది అయింది. రాజకీయ చరమాంకంలో ఉన్న నితీష్ కుమార్ కి ఇది గౌరవంతో కూడిన హోదాగానే చూడాలి. కానీ ప్రధాని మోడీ ఆలోచనలు ఎలా ఉంటాయో అన్నది కూడా చూడాలి. 16 ఎంపీ సీట్లతో ఉన్న టీడీపీకి ఏ రకమైన ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వకుండా 12 సీట్లు ఉన్న జేడీయూకి కీలక హోదాను ఇవ్వడం కూడా ఆలోచించాల్సిందే అని అంటున్నారు. రాజకీయాల్లో అన్నింటికీ లెక్కలు ఉంటాయని చెబుతున్నారు.