Begin typing your search above and press return to search.

ఏపీ ప్రభుత్వానికి నిర్మల హెచ్చరిక!

లోక్‌ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్‌ సమాధానమిచ్చారు.

By:  Tupaki Desk   |   6 Feb 2024 6:58 AM GMT
ఏపీ ప్రభుత్వానికి నిర్మల హెచ్చరిక!
X

ఆంధ్రప్రదేశ్‌ లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని తీవ్రంగా అప్పులపాలు చేసిందని ప్రతిపక్షాలు, ఆర్థిక నిపుణులు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అప్పులకు అడ్డుకట్ట వేయకపోతే ఏపీ కూడా మరో శ్రీలంక, పాకిస్థాన్‌ లా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం తాము కేంద్రం, ఆర్బీఐ నిబంధనలకు లోబడే అప్పులు చేస్తున్నామని... టీడీపీ ప్రభుత్వమే తమకంటే ఎక్కువ అప్పులు చేసిందని వాదిస్తోంది.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఝలక్‌ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితులపై ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు, హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నామని నిర్మలా సీతారామన్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు.

ఈ మేరకు తాజా పార్లమెంటు సమావేశాల్లో భాగంగా లోక్‌ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్‌ సమాధానమిచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఏపీ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నామని చెప్పారు. ఇందుకు కేంద్రానికి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293 అవకాశం కల్పిస్తోందన్నారు.

ఈ క్రమంలో ఎంపీ రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక దుర్వినియోగంతో నాలుగేళ్లుగా రాష్ట్రం తీవ్ర ఇబ్బందులు పడుతోందన్నారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా చెల్లించడం లేదని కేంద్రం దృష్టికి తెచ్చారు. రహదారుల నిర్మాణం లాంటి మౌలిక వసతుల కల్పన కోసం పైసా కూడా ఖర్చుచేయలేదన్నారు. ఇవి చాలవన్నట్టు ప్రభుత్వరంగ కార్పొరేషన్లను అడ్డం పెట్టుకొని ఏపీ ప్రభుత్వం అప్పులు తెచ్చుకుంటోందని వెల్లడించారు. ఇలా ఒకవైపు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తూ మరోవైపు ద్రవ్యబాధ్యత, నిర్వహణ చట్టం (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితుల నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

మద్య నిషేధం చేస్తామని చెప్పి.. మరోవైపు అదే మద్యం కార్పొరేషన్‌ ఆదాయాన్ని తాకట్టుపెట్టి రాష్ట్ర ప్రభుత్వం రుణం తీసుకుందని రామ్మోహన్‌ నాయుడు ఆరోపించారు. ఒకవేళ రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఏమిటి? రాష్ట్రాన్ని ఆర్థిక క్రమశిక్షణలో పెట్టడానికి ఏం చర్యలు తీసుకుంటారని కేంద్రాన్ని ప్రశ్నించారు.

దీనిని నిర్మలా సీతారామన్‌ స్పందిస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికీ ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఎఫ్‌ఆర్‌బీఎం యాక్ట్‌ గురించి అసెంబ్లీ చూసుకుంటుందని స్పష్టం చేశారు. ఆ చట్టానికి అనుగుణంగా అక్కడ చర్చలు చేపడతారన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగం కల్పించిన అధికారం మేరకు రాష్ట్రాలకు తాము ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు, హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నామని నిర్మల వెల్లడించారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

కాగా జీఎస్టీ వృద్ధిరేటు ఇటీవల కాలంలో కాస్త పడిపోయిన నేపథ్యంలో దానిపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్‌ లాంటి రాష్ట్రాల ఆర్థిక స్థిరత్వానికి కేంద్ర ప్రభుత్వం ఏదైనా అదనపు చర్యలు తీసుకుంటోందా అని వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బదులిస్తూ జీఎస్టీ ద్వారా ఆదాయం క్రమంగా పెరుగుతోందే తప్ప తగ్గడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల్లోనే 11.6% వృద్ధిరేటు నమోదైందన్నారు. ఏపీ ప్రభుత్వానికి 2017 జులై నుంచి 2022 జూన్‌ వరకు జీఎస్టీ పరిహారం కింద రూ.19,021 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.