Begin typing your search above and press return to search.

పార్లమెంట్ కొత్త భవనం విశేషాలివే... ఏమిటీ పౌకాల్డ్ పెండ్యులం?

పార్లమెంట్‌ కొత్త భవనాన్ని నోటిఫై చేస్తూ కేంద్రం గెజిట్‌ విడుదల చేసింది. ఇందులో కొత్తగా నిర్మించిన భవనమే ఇక నుంచి పార్లమెంట్‌ అని పేర్కొంది

By:  Tupaki Desk   |   19 Sep 2023 8:49 AM GMT
పార్లమెంట్ కొత్త భవనం విశేషాలివే... ఏమిటీ పౌకాల్డ్ పెండ్యులం?
X

పార్లమెంట్‌ కొత్త భవనాన్ని నోటిఫై చేస్తూ కేంద్రం గెజిట్‌ విడుదల చేసింది. ఇందులో కొత్తగా నిర్మించిన భవనమే ఇక నుంచి పార్లమెంట్‌ అని పేర్కొంది. దీంతో... నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు కొత్త భవనంలోనే జరగనున్నాయి. ప్రత్యేక సమావేశాల సందర్బంగా ప్రధాని మోడీ.. పాత పార్లమెంట్‌ కు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. ఈ సమయంలో కొత్త పార్లమెంట్ భవనం ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందా!

పార్లమెంట్ కొత్త భవనాన్ని ఈ ఏడాది మే 28న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. సెంట్రల్ విస్ట్రా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఈ కొత్త భవనానికి 2020 డిశెంబర్ 10న శంకుస్థాపన చేశారు. ఈ భవనాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్మించారు. ఇదే సమయంలో భారతీయ సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా ఈ నిర్మాణం సాగింది.

త్రిభుజాకారంలో నాలుగు అంతస్థుల్లో నిర్మించిన ఈ భవనాన్ని సుమారు 150 ఏళ్లపాటు మనగలిగేలా తీర్చి దిద్దారు. ఇదే సమయంలో పర్యావరణ హితంగానూ దీన్ని చేపట్టారు. 1,272 మంది ఒకేసారి కూర్చునేలా ఈ సమావేశ మందిరం ఉంటుంది. సెంట్రల్ విస్తాలో పార్లమెంట్ ఉభయ సభలు (లోక్ సభ, రాజ్యసభ) తోపాటు ప్రధాని కార్యాలయం, నివాసం, ఉపరాష్ట్రపతి నివాసం, కేంద్ర సచివాలయం ఉంటాయి.

ఇలా ఎన్నో హంగులతో సుమారు 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ నూతన భవనానికి 970 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని కేంద్రం తెలిపింది. ఇక ఈ నిర్మాణంలో లోక్ సభ ప్రాంగణము జాతీయ పక్షి నెమలి ఆకారంలో కనిపిస్తుండగా.. రాజ్యసభ ప్రాంగణము జాతీయ పుష్పం తామార పువ్వు ఆకారంలో ఉంతుంది.

ఇక ఈ నూతన పార్లమెంట్ భవనానికి మూడు ప్రధాన ద్వారాలు ఉంటాయి. దీనికి జ్ఞాన, శక్తి, కర్మ ద్వారాలుగా నామకరణం చేశారు. ఇదే సమయంలో యూపీలోని మీర్జాపూర్ నుంచి తెప్పించిన ప్రత్యేక తివాచీలు, త్రిపుర వెదురుతో చేసిన గచ్చు, రాజస్థాన్ లో రూపుదిద్దుకున్న శిలాకృతులు, మహారాష్ట్ర నుంచి తెచ్చిన టేకు, రాజస్థాన్ లోని సర్ మధుర నుంచి తెచ్చిన ఎర్ర చలువ రాయిని ఇందులో పొందుపరచబడ్డాయి.

ఇదే సమయంలో ఈ నిర్మాణం కోసం రాజస్థాన్ నుంచి తెచ్చిన తెల్ల చలువ రాయి, ఇక ఉదయ పూర్ నుంచి కేసరియా ఆకుపచ్చ రాయి, అజ్ మేర్ సమీపంలోని లఖా నుంచి ఎర్ర గ్రానైట్ ను, ముంబై నుంచి ఫర్నిచర్ ను రప్పించారు.

సెంగోల్ అనే బంగారు రాజదండం:

ఏక్ భారత్ - శ్రేష్ట్ భారత్ స్పూర్తి పరిడవిల్లేలా యావద్దేశానికి ఏదో ఒక రూపంలో స్థానం కల్పించేలా నిర్మించిన ఈ నూతన పార్లమెంట్ భవనంలో ప్రత్యేకతలన్నింటిలోనూ మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది సెంగోల్ రాజదండం. నూతన పార్లమెంట్ భవనంలో లోక్ సభలోని స్పీకర్ కుర్చీపక్కన ఏర్పాటుచేసిన సెంగోల్ అనే ఈ బంగారు రాజదండానికి చాలా ప్రత్యేకత ఉంది.

స్వాతంత్రం అనంతరం బ్రిటిష్ వారి నుంచి భారతీయులకు జరిగిన అధికార మార్పిడికి ఇది నిదర్శనం. బ్రిటీష్ ఇండియా చివరి వైశ్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్.. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు దీనిని అప్పగించారు. ఆంగ్లేయుల పాలన ముగిసి దేశానికి స్వాతంత్రం ప్రకటించే ముందు అధికార బదిలీకి గుర్తుగా ఏమి ఇవ్వాలి నెహ్రూను మౌంట్ బాటెన్ అడగగా... ఈ నిర్ణయం ప్రకటించారు నెహ్రూ.

ఈ సమయంలో దీన్ని మద్రాసులోని స్వర్ణకారుడి చేత ప్రత్యేకంగా తయారు చేయించారు. దాని పొడవు 5 అడుగులు కాగా, పై భాగంలో నంది విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమయంలో తమిళనాడులోని మఠానికి చెందిన పీఠాధిపతి ఒకరు ఈ రాజదండాన్ని మౌంట్ బాటెన్ కు అందించగా.. అనంతరం తిరిగి తీసుకుని, గంగాజలంతో శుద్ధిచేసి నెహ్రూ దగ్గరకు ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు.

ఈ సమయంలో అర్ధరాత్రి స్వతంత్ర ప్రకటనకు 15 నిమిషాల ముందు ఈ రాజదండాన్ని నెహ్రూకు అందజేశారు. నాటి నుంచి ఈ రాజదండం అలహాబాద్ మ్యూజియంలో ఉండేది. ఈ క్రమంలో తాజాగా నూతన పార్లమెంట్ నిర్మాణం అనంతరం ఈ రాజదండాన్ని లోక్ సభ సభపతి కుర్చీ పక్కన అమర్చారు.

ఏమిటీ పౌకాల్డ్ పెండ్యులం?:

ఈ నూతన పార్లమెంట్ భవనంలోని గ్యాలరీలో ఏర్పాటు చేసిన పౌకాల్డ్ పెండ్యులం అనే వస్తువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్సెస్ మ్యూజియం ద్వారా దీన్ని ఏర్పాటు చేశారు. భూబ్రమణాన్ని సూచించే ఈ పౌకాల్డ్ పెండ్యులంకి ఫ్రెంచ్ శాస్త్రవేత్త లియెన్ పౌకాల్డ్ పేరు మీద 19వ శతాబ్దంలో ఈ పేరు నిర్ణయించారు.

లియోన్ 1851లో నిర్వహించిన ఈ ప్రయోగాన్ని... భుభ్రమణం ఎలా ఉంటుంది అని చెప్పేటందుకు చేసిన తొలి ప్రయోగంగా చెబుతారు. దీంతో... విజ్ఞానానికి ప్రతీకగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే దీన్ని పార్లమెంట్ గ్యాలరీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.