Begin typing your search above and press return to search.

దాగుడు మూతల దండాకోర్... లోకేష్ ట్వీట్ వైరల్!

చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన కొన్ని రోజుల తర్వాత టీడీపీ పెద్దలు వారంతపు నిరసనలకు పిలుపునిస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   29 Oct 2023 4:04 AM GMT
దాగుడు మూతల దండాకోర్... లోకేష్ ట్వీట్ వైరల్!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... రాజమండ్రి సెంట్రల్ జైల్లోని స్నేహ బ్లాకులో ప్రత్యేక సదుపాయాల మద్య జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 10న అరెస్టైన చంద్రబాబు జైలు జీవితం నేటితో 50 రోజులు పూర్తయ్యింది! ఈ సందర్భంగా వారాంతం కూడా కలిసి రావడంతో లోకేష్ సరికొత్త నిరసనకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కళ్లకు గంతలు కట్టుకోమంటున్నారు.

అవును.. చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన కొన్ని రోజుల తర్వాత టీడీపీ పెద్దలు వారంతపు నిరసనలకు పిలుపునిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొదట్లో రెండు శనివారాలు రాత్రి 7 గంటల నుంచి ఐదు నిమిషాలు చేపట్టిన కార్యక్రమాలను.. తర్వాత ఆదివారానికి మార్చారు. దీంతో... ప్రతీ ఆదివారం రాత్రి 7 గంటల నుంచి 5 నిమిషాలపాటు చినబాబు ట్విట్టర్ లో సూచించిన నిరసన చేయాలి.

అనంతరం ఆ నిరసన కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయాలి. మళ్లీ నెక్స్ట్ ఆదివారం కూడా నారా లోకేష్ ఆన్ లైన్ సూచనల మేరకు మరో కార్యక్రమం చేయాలి! ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు రాజమండ్రి జైలుకి వెళ్లి 50 రోజులు అయినందుకో ఏమో తెలియదు కానీ... ప్రతీ ఆదివారం చేసే కార్యక్రమాల్లో భాగంగా... ఈసారి కళ్లకు గంతలు కట్టుకోవాలని పిలుపునిచ్చారు నారా లోకేష్!

ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. ఇందులో భాగంగా... "ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తోన్న జగనాసురుడికి కళ్లు తెరిపిద్దాం. ఆదివారం రాత్రి 7:00 నుంచి 7:05 నిమిషాలు మధ్యలో కళ్లకు గంతలు కట్టుకొని ఇళ్ల వద్దే బాల్కనీ, వీధులు, వాకిళ్లలోకి వచ్చి చంద్రబాబు గారికి మద్దతుగా "నిజం గెలవాలి" అని గట్టిగా నినదించండి. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయండి‌" అని సూచించారు.

అయితే ఈ వారాంతపు ఐదునిమిషాల నిరసనలవల్ల కలిగే ప్రయోజనం ఏమిటనే చర్చ జరుగుతుండటంతోపాటు.. విభిన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా... కంచాలపై గరిటెలతో కొట్టడం వంటి కార్యక్రమం చేసినప్పుడు... బౌన్స్ బ్యాక్ అంటే ఇదే అని ముద్రగడ పద్మనాభం నిరసనల టైం లో చంద్రబాబు, టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకున్నారు నెటిజన్లు. దీంతో... నిరసన ఏమో కానీ ఆసుపాలయ్యామనే కామెంట్లు వినిపించాయి.

ఇదే క్రమంలో... ఇటీవల దసరా స్పెషల్ గా "సైకో పోవాలి" అనే నినాదాన్ని రాసిన పేపర్లను దహనం చేయాలని పిలుపునిచ్చారు. దీంతో... శీతాకలం వచ్చిందని మంటలేసుకుని సింబాలిగ్ గా చెబుతున్నారనే కామెంట్లూ వినిపించగా... జగన్ దెబ్బకు వణికిపోతూ వేడి కాచుకుంటున్నారని మరికొందరు కామెంట్లు చేశారు. ఇక చేతులకు సంకెళ్లు వేసుకుని చేపట్టిన నిరసనపై కూడా ఇలాంటి కామెంట్లు వచ్చాయి!

చేతులకు సంకెళ్లు నిరసనలో భాగంగా... కొంతమంది సెల్ ఫోన్ చార్జింగ్ వైర్లు, ఇంకొకరు కుక్కలకు వేసే గొలుసులు చేతులకు చుట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. దీంతో కుక్కల గొలుసులను కోడ్ చేస్తూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు! ఈ సమయంలో మరో అడుగు ముందుకేసిన చినబాబు... కళ్లకు గంతలు కట్టుకోని బాల్కనీళ్లోకీ, వీదుల్లోకీ రావాలని కోరుతున్నారు.

ఆ సంగతి అలా ఉంటే... దసరాకు అలా స్పెషల్ గా కాగితాలతో మంట వేయమని చెప్పిన చినబాబు... దీపావళికి ఎలాంటి ఐడియాతో ముందుకు వస్తారనేది ఆసక్తిగా మారింది! ఏది ఏమైనా... ఈ రోజు రాత్రి 7 గంటలకు ఐదునిమిషాల పాటు కళ్లకు గంతలు కట్టుకుని బాల్కనీ, వీదుల్లోకి రావాలని.. వచ్చి నినదించాలని లోకేష్ పిలుపునిచ్చారు!

దీంతో.. ఈ నిరసన కార్యక్రమం సక్సెస్ కావాలని.. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోవాలని అభిమానులు కొరుకుంటున్నారు. ఇదే సమయంలో రాత్రిపూట కళ్లకు గంతలు కట్టుకుని బాల్కనీలలోకి, వీదుల్లోకి వచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు!