Begin typing your search above and press return to search.

పుంగనూరులో ఫాదర్... భీమవరంలో సన్... సేం సీన్ రిపీట్!

సాధారణంగా ప్రేమతో గెలవలేనప్పుడు.. తన ప్రేమను అంగీకరించనప్పుడు కొంతమంది ప్రేమికులు ఉన్మాదులుగా మారుతుంటారు.

By:  Tupaki Desk   |   6 Sep 2023 8:50 AM GMT
పుంగనూరులో ఫాదర్... భీమవరంలో సన్... సేం సీన్  రిపీట్!
X

సాధారణంగా ప్రేమతో గెలవలేనప్పుడు.. తన ప్రేమను అంగీకరించనప్పుడు కొంతమంది ప్రేమికులు ఉన్మాదులుగా మారుతుంటారు. ఫలితంగా ప్రేమించానని చెప్పుకున్న ప్రియురాలిపైనే దాడులకు దిగుతుంటారు. వారిని ప్రేమోన్మాదులు అంటారు. ఇదే సమయంలో గత కొన్ని రోజులుగా ఓటు ఉన్మాదులు కూడా పెరిగిపోతున్నారనే చర్చ తెరపైకి వచ్చింది.

అవును... ప్రేమతో గెలవలేనపుడు భయపెట్టి తమవైపు లాక్కోవాలి.. సొంతంగా పాస్ కాలేనపుడు మాస్ కాపీయింగ్ చేయాలి.. దమ్ముతో గట్టెక్కలేనప్పుడు డ్రగ్స్ తో కొట్టాలి.. సొంత సత్తాతో కాని పని కిరాయి మనుషులతో చేయించాలి.. ఇదీ చంద్రబాబు కాన్సెప్ట్ అనే చర్చ పుంగనూరు ఘటన అనంతరం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.

నలభయ్యేళ్ళ రాజకీయ జీవితంలో అయన పాటించే సూత్రం ఇదే అనే విమర్శలు బలంగా వినిపించాయి. ఇన్నాళ్లుగా అయన ఇదే తరహాలో రాజకీయం చేస్తూ వస్తున్నారనే విమర్శలు వైరల్ అవుతున్నాయి. అయితే ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా అన్నట్లు... ఆశ్చర్యంగా లోకేష్ కూడా ఇదే మార్గంలో నడుస్తున్నారనే చర్చ ఏపీలో బలంగా మొదలైంది.

దానికి కారణం... మొన్న పుంగనూరులో జరిగినట్లే నిన్న భీమవరంలో కూడా అల్లర్లకు ప్లాన్ చేశారని చెబుతుండటం. పుంగనూరు టౌన్లోకి వెళ్లేందుకు అనుమతులు తీసుకోకున్నప్పటికీ... పోలీసులను ఎదిరించి బెదిరించి చివరకు దాడి చేసి అయినా నగరంలోకి ప్రవేశించాలన్న చంద్రబాబు ప్రయత్నించారు. కుట్రతో కూడిన అభియోగాలు ఎదుర్కొన్న ఈ ప్లాన్ వల్ల పలువురు పోలీసులు గాయపడ్డారు.

అయినా సరే తన అనుచరులు, కార్యకర్తల దృష్టిలో తాను హీరో అవ్వాలనే కోరికతో "తన్నండి.. పోలీసులకు కొట్టండి" అని కార్యకర్తలను రెచ్చగొట్టి హింసకు ఆజ్యం పోశారు చంద్రబాబు. దీంతో ముందూ వెనుకా చూడకుండా దాడులకు దిగిన కార్యకర్తలు, కిరాయి వ్యక్తులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. చంద్రబాబు హైదరాబాద్ వెళ్లిపోయారు.

అది తన తండ్రి సాధించిన ఘన విజయం అనుకున్నారో.. లేక, అలాంటి చర్యలకు పాల్పడటం వల్ల తనకు మాస్ ఇమే జ్ వచ్చిపడుతుందని భ్రమించారో తెలియదు కానీ... తాజాగా భీమవరంలో చినబాబు లోకేష్ అలాంటి ఆలోచనతోనే ముందుకెళ్లినట్లు తెలుస్తుంది.

ఇందులో భాగంగా... పుంగనూరులో టీడీపీ ఇంచార్జ్ చల్లా బాబు సారధ్యంలో హింసకు ప్లాన్ చేసినట్లే.. ఇప్పుడు తాజాగా పచ్చని గోదావరి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సారధ్యంలో టిడిపి కార్యకర్తలు రెచ్చిపోయారని తెలుస్తుంది. లోకేష్ పాదయాత్ర సాగుతుండగానే కర్రలు, రాళ్లు, బీర్ సీసాలతో వైసిపి కార్యకర్తల మీద తమ్ముళ్లు విరుచుకుపడ్డారు.

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు చించేస్తూ, వాటిని రాళ్లతో కొడుతూ.. కేకలు, అరుపులతో ఆ ప్రాంతాన్ని భయానకంగా మార్చేశారు. ఈ హటాత్పరిణామానికి స్థానికులు బెంబేలెత్తిపోయారు. వైసీపీ కార్యకర్తలు సైతం భయంతో ఇళ్లలోకి వెళ్లి దాక్కున్నారు. ఈ దాదాగిరీని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి.

ఈ సమయంలో తనకంటూ ఒక రాజకీయ భాషను, లిపిని, వ్యాకరణాన్ని ఎంచుకున్న లోకేష్ ఇక్కడ కూడా అవే పదప్రయోగాలతో చెలరేగిపోయారు! "ఒక్కోడ్ని ఉచ్చ పోయిస్తాను.. ఎర్ర బుక్కులో పేర్లు రాస్తున్నాను" అంటూ.. కనీసం డజన్ కేసులైనా పెట్టించుకోకపోతే ఎందుకూ దండగ? అంటూ కార్యకర్తలను రెచ్చగొట్టే పనికి పూనుకున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నయి.

దీంతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు! వైసీపీ కార్యకర్తలపైనా, పోలీసులపైనా రాళ్లు రువ్వారు. వీటికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. విచక్షణా రహితంగా విసురుతున్న రాళ్లు... వైసీపీ కార్యకర్తలతోపాటు పోలీసులనూ గాయపరిచాయి. దీంతో తండ్రి చూపిన బాటలోనే బాబుగారి పుత్రరత్నం కూడా బ్లైండ్ గా దూసుకుపోతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి!