ముహూర్త బలం గొప్పది: లోకేష్
''ఒకప్పుడు తెలుగు వారంటే.. ఎవరూపట్టించుకునే వారు. ఎవరూ గౌరవం కూడా ఇచ్చేవారు కాదు.
By: Tupaki Desk | 27 May 2025 10:05 AM1982లో తెలుగు దేశం పార్టీని స్థాపించిన ముహూర్త బలం గొప్పదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అనేక ఒడిదుడుకులు కూడా తట్టుకుని నిలబడిందంటే.. దీనికి కారణం.. ఖచ్చితంగా ముహూర్త బలమేనని వ్యాఖ్యానించారు. ఆది నుంచి కూడా పార్టీకి కార్యకర్తలే బలంగా ఉన్నారని తెలిపారు. వారు ఎత్తిన జెండా దింపకుండా చేసిన పోరాటం.. పార్టీని నిలబెట్టిందని తెలిపారు.
''ఒకప్పుడు తెలుగు వారంటే.. ఎవరూపట్టించుకునే వారు. ఎవరూ గౌరవం కూడా ఇచ్చేవారు కాదు. కానీ.. అన్న ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించిన తర్వాత.. తెలుగు జాతి ఆత్మగౌరవం ఢిల్లీలో వినిపించింది. తెలుగు వారు సగౌరవంగా తలెత్తుకుని నిలబడ్డారు. తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ`` అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. విజనరీ లీడర్ చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయిలో కూడా పార్టీ గుర్తింపు పొందిందని చెప్పారు.
తెలుగు దేశం పార్టీకి అధికారం, ప్రతి పక్షం రెండూ కొత్తవి కాదన్నారు. అధికారంలో ఉన్నామని పొంగి పోలేదని.. ప్రతిపక్షంలో ఉన్నామనికుంగిపోలేదన్నారు. ఎప్పుడూ.. పార్టీ ప్రజల కోసం.. ప్రజల హక్కుల కోసమే పోరాటం చేసిందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలోనూ మార్పులు తీసుకురావా ల్సిన అవసరం ఉందన్నారు. అందుకే.. పార్టీలో సమూల మార్పుల దిశగా పార్టీ అధినేత చంద్రబాబు అడుగులు వేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.
ఇప్పటికి పార్టీ పెట్టి 43 సంవత్సరాలు అయిందన్న నారా లోకేష్.. మరో 40 ఏళ్లపాటు పార్టీని ముందుకు నడిపించాలంటే.. ఖచ్చితమైన దిశానిర్దేశం ఉండి తీరాలన్నారు. ఈ క్రమంలోనే ఆరు శాసనాలనుతాను ప్రతిపాదించినట్టు చెప్పారు. ఎప్పుడూ తెలుగు దేశం పార్టీ ప్రజా పక్షమేనని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం.. ప్రజలతో అనే నినాదంతోనే పార్టీ పనిచేస్తుందన్నారు.