Begin typing your search above and press return to search.

కార్యకర్తలకు లోకేష్ అత్యంత ముఖ్యమైన సూచనలు!

అవును... ఏపీలో 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. కట్ చేస్తే 2024 ఎన్నికల్లో కూటమి చారిత్రక విజయం సాధించింది.

By:  Tupaki Desk   |   17 May 2025 7:04 AM
కార్యకర్తలకు లోకేష్  అత్యంత ముఖ్యమైన సూచనలు!
X

ఏ పార్టీకి అయినా కార్యకర్తలే వెన్నెముక! ఏ పార్టీలో అయినా నాయకులు వస్తుంటారు పోతుంటారు.. కానీ, ఒకసారి జెండా పట్టిన కార్యకర్తలు మాత్రం గరిష్టంగా ఎన్నటికీ పార్టీని వీడరని.. కార్యకర్తకు అవకాశవాదం అంటే తెలియదని చెబుతారు! అందుకే.. పలు రాజకీయ పార్టీలు ఎన్నికలప్పుడు మాత్రమే కాకుండా.. మిగిలిన సమయాల్లోనూ వారి మంచి చెడ్డల గురించి ఆలోచిస్తుంది.


అలా ఆలోచించని పార్టీలు తదనంతరం చావు దెబ్బలు తిన్న సంఘటనలు తెలిసినవే! ఈ విషయం తెలుసుకున్న తర్వాత.. ఆయా పార్టీల నాయకులు ఆత్మపరిశీలన చేసుకుంటారు.. అయితే, అప్పటికే చేతులు కాలిపోతాయి.. మాడు పగిలిపోతుంటుంది! ఈ సమయంలో కార్యకర్తలను ఒక తాటిపైకి తీసుకొచ్చి ముందుకు సాగించడంలో కీలక భూమిక పోషిస్తున్నారు అనే పేరు అతి తక్కువకాలంలోనే సంపాదించుకున్న నారా లోకేష్.. వారికి కీలక సూచనలు చేశారు.

అవును... ఏపీలో 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. కట్ చేస్తే 2024 ఎన్నికల్లో కూటమి చారిత్రక విజయం సాధించింది. ఈ విషయంలో టీడీపీ కార్యకర్తల పోరాట పటిమ అత్యంత కీలకంగా చెబుతుంటారు. ఈ నేపథ్యంలో.. టీడీపీ కార్యకర్తలకు నారా లోకేష్ అత్యంత ముఖ్యమైన పలు సూచనలు చేశారు. ఎవరినీ నిరుత్సాహ పడవద్దని కోరారు.

ఇందులో భాగంగా... ముందుగా కార్యకర్తలంతా దయచేసి గ్రామంలో ఐకమత్యంగా ఉండాలని సూచించిన లోకేష్... గ్రామస్థాయిలో ఏదైనా పని జరగకపోతే మండలస్థాయి నాయకుల ద్వారా పనులు చేసుకోవాలని.. అప్పటికీ అవ్వకపోతే ఎమ్మెల్యే దగ్గరకి వెళ్లాలని సూచించారు. అప్పటికీ కాని పక్షంలో ఇంఛార్జ్ మినిస్టర్ దగ్గరకు వెళ్లాలని తెలిపారు.

అప్పటికీ అనుకున్న పని అవ్వకపోతే.. మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీసుకు వచ్చి ఒక అర్జీ ఇవ్వాలని కోరారు. ఇంట్లో కూర్చుంటే పనులు అవ్వవని.. దయచేసి ముందుగా మీ సొంత పనులు అడగాలని.. మీకు సమస్యలు లేకపోతే, అప్పుడు మిగిలినవారి పనులు తీసుకురావాలని.. ఈ క్రమంలో ఎప్పుడూ ఎవరూ నిరుత్సాహపడోద్దని లోకేష్ సూచించారు.

ఇక.. అమ్మ మీద నాన్న మీద అలిగినట్లుగా పార్టీ మీద అలగొద్దని కోరిన లోకేష్.. అమ్మలాంటి పార్టీని మరిచిపోవద్దని కోరారు. ఈ సమయంలో.. మూడో వ్యక్తి చెప్పింది దయచేసి నమ్మవద్దని.. ఏదైనా లైవ్ లో విన్నవి మాత్రమే నమ్మాలని కోరారు. ఈ సందర్భంగా... పుకార్లకు సంబంధించిన పలు విషయాలను ప్రస్థావించారు.

ఇందులో భాగంగా... “మన ఎమ్మెల్యే వైసీపీ వాళ్లకి పనులు చేస్తున్నాడంట.. లోకేష్ మనవాళ్లకు టైమ్ ఇవ్వడం లేదంట.. చంద్రబాబు అయితే అసలు కలవడం లేదంట” వంటి పుకార్లు నమ్మవద్దని.. మేము మనుషులం కదా! కొన్ని తప్పులు చేయవచ్చని నారా లోకేష్ కార్యకర్తలకు తెలిపారు.