Begin typing your search above and press return to search.

ఇలా కూడా ఉంటారా... కొడుకును ఆకలితో చంపేసిన తల్లి!

తన పదేళ్ల కొడుకును ఆకలితో చంపింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది! ఘోరమైన ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకోగా.. ఈ ఘాతుకానికి పాల్పడింది ఓ భారతీయ మహిళ కావడం గమనార్హం.

By:  Tupaki Desk   |   30 Dec 2023 4:15 AM GMT
ఇలా కూడా ఉంటారా... కొడుకును  ఆకలితో చంపేసిన తల్లి!
X

"కంటేనే అమ్మ అనీ అంటే ఎలా.. కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా రాతి బొమ్మే కదా" అని ఒక గేయ రచయిత అన్నట్లుగా... కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కాదు ఇప్పుడు ఒక రాక్షసిగా మారిన వైనం వెలుగులోకి వచ్చింది! భర్తపై ఉన్న ఆగ్రాహాన్ని 10ఏళ్ల కుమారుడిపై చూపించింది! అమ్మ ఎప్పుడూ బిడ్డ కడుపు చూస్తుంది కానీ... ఈ అమ్మ మాత్రం ఆ కడుపునే మాడ్చింది!

అవును... బిడ్డ ఆకలి అమ్మకంటే బాగా ఎవరికీ తెలియదని అంటారు. కానీ, ఓ మహిళ.. అమ్మ అనే పదానికి మచ్చ తెచ్చింది. తన పదేళ్ల కొడుకును ఆకలితో చంపింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది! ఘోరమైన ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకోగా.. ఈ ఘాతుకానికి పాల్పడింది ఓ భారతీయ మహిళ కావడం గమనార్హం.

వివరాళ్లోకి వెళ్తే... అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలోని మోరిస్‌ విల్లేలో భారత్ కు చెందిన ప్రియాంక అనే మహిళ, తన భర్త కుమారుడితో నివాసముంటోంది. ఇటీవల కాలంలో ఇంట్లో గొడవ జరగడంతో ఆమె భర్త బయటకు వెళ్లిపోయాడు. ఈ సమయంలో ప్రియాంకకు ఎవరు ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యేది కాదంట.

అయితే తాజాగా సాయంత్రం 5:35 గంటల తర్వాత 911 కి ఫోన్ చేసిన ప్రియాంక... తన కొడుకు స్పందించడం లేదని చెప్పింది. దీంతో అక్కడకు చేరుకున్న అధికారులు.. బాలుడి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటాన్ని గమనించారు. రెండో రోజుల కిందటే ఆ బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు.

దీంతో ఆ బాలుడి మరణానికి నిర్లక్ష్యమే కారణమని.. శవపరీక్ష అనంతరం ఆ బాలుడు ఎలా చనిపోయాడో చెబుతామని మోరిస్‌ విల్లే పోలీస్ చీఫ్ పీట్ అకోస్టా తెలిపారు. నిందితురాలు ప్రియాంకపై హత్య, నిర్లక్ష్యం, గాయపరచడం తదితర అభియోగాలు మోపుతూ కేసు నమోదు చేశారని తెలుస్తుంది.

అయితే భార్య భర్తలు గొడవపడటంతో.. ప్రియాంక భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడని తెలిసిన అనంతరం బాలుడి గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ భారత్‌ లోని బంధువులు కొన్ని నెలలుగా తరచూ ఫోన్లు చేస్తున్నట్లు అకోస్టా స్థానిక మీడియాకు తెలియజేశారు. అయితే ఈమె కావాలనే ఫోన్ కాల్స్ కి రెస్పాండ్ అవ్వలేదని.. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే చేసిందని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక ప్రస్తుతం కస్టడీలో ఉన్న ప్రియాంక తివారీ.. జనవరి 11న కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.