Begin typing your search above and press return to search.

మొరాకో భూకంపం.. షాకింగ్ గా మృతుల సంఖ్య!

ఉత్తరాఫ్రికా దేశం మొరాకోలో శుక్రవారం భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 Sep 2023 6:42 AM GMT
మొరాకో భూకంపం.. షాకింగ్ గా మృతుల సంఖ్య!
X

ఉత్తరాఫ్రికా దేశం మొరాకోలో శుక్రవారం భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రాత్రి 11 గంటల సమయంలో 6.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. అనంతరం 19 నిమిషాల తర్వాత మరోసారి 4.9 తీవ్రతతో భూమి కంపించింది. భూకంపం ధాటికి నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో అనేక భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. భూకంపం తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సృష్టించింది.

అవును... ఊత్తర ఆఫ్రికాలోని మొరాకోలో సంభవించిన భారీ భూకంపం కనీవినీ ఎరుగని నష్టాన్ని మిగిల్చింది. భూకంపం కారణంగా చనిపోయిన వారి సంఖ్య రెండు వేలు దాటగా.. మరో రెండు వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇలా గాయపడిన రెండువేల మందిలో సుమారు వెయ్యిమంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది.

ఇదే సమయంలో పర్వత ప్రాంతాల్లోని గ్రామాల్లో శిథిలాల కింద చాలామంది ప్రజలు చిక్కుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఫలితంగా... మృతుల సంఖ్య భారీగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ భూకంపం వల్ల ఊళ్లకు ఊళ్లే కూలిపోయిన పరిస్థితి నెలకొంది. భూకంపం తీవ్రతకు రోడ్లు ధ్వంసమయ్యాయి. దీంతో మారుమూల ప్రాంతాలకు వెళ్లేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఇదే సమయంలో యునెస్కో ప్రపంచ వారసత్వంగా గుర్తించిన మరాకేష్‌ చుట్టూ ఉన్న ప్రహరీ గోడకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదేవిధంగా 12వ శతాబ్దంలో నిర్మించిన మసీదు కటూబియా సైతం భూకంపం ధాటికి దెబ్బతింది. ఈ నేపథ్యంలో మొరాకో పునర్నిర్మాణానికి చాలా సంవత్సరాలు పట్టొచ్చని రెడ్‌ క్రాస్‌ సంస్థ అంచనా వేసింది.

ఈ దారుణ పరిస్థితిలో మొరాకోకు సాయం అందించేందుకు అనేక దేశాలు ముందుకు వచ్చాయి. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ.. మొరాకోకు అవసరమైన సాయం అందిస్తామని తెలిపారు. ఇదే క్రమంలో... అమెరికా, టర్కీ, ఫ్రాన్స్‌, ఇజ్రాయిల్‌, జర్మనీ, జోర్డాన్‌, ఖతార్‌ దేశాలు సైతం సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి.