Begin typing your search above and press return to search.

బీఆర్ ఎస్ పోయి కాంగ్రెస్ వ‌చ్చినా లాభం లేదు: తెలంగాణ‌పై మోడీ కామెంట్స్‌

తెలంగాణ పాల‌న‌, అభివృద్ధిపై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో బీఆర్ ఎస్ పాల‌న పోయి కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చినా ఎలాంటి లాభం లేకుండా పోయింద‌ని అన్నారు.

By:  Tupaki Desk   |   4 March 2024 1:40 PM GMT
బీఆర్ ఎస్ పోయి కాంగ్రెస్ వ‌చ్చినా లాభం లేదు:  తెలంగాణ‌పై మోడీ కామెంట్స్‌
X

తెలంగాణ పాల‌న‌, అభివృద్ధిపై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో బీఆర్ ఎస్ పాల‌న పోయి కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చినా ఎలాంటి లాభం లేకుండా పోయింద‌ని అన్నారు. బీఆర్ ఎస్ - కాంగ్రెస్ రెండు పార్టీలూ ఒక్క‌టేన‌ని విమ‌ర్శించా రు. టీఆర్ ఎస్‌(తెలంగాణ రాష్ట్ర‌స‌మితి).. బీఆర్ ఎస్‌(భార‌త రాష్ట్ర స‌మితి)గా మారినా ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని, అదేవిధంగా బీఆర్ ఎస్ పోయి కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చినా కూడా ఎలాంటి ప్రయోజ‌నం లేకుండా పోయింద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో(మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దు) వివిధ ప్రాజెక్టుల‌కు ఆయ‌న శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేశారు.

అనంత‌రం మోడీ మాట్లాడుతూ.. "కుటుంబ కేంద్రీకృత పార్టీల జెండాలు వేరుగా ఉండొచ్చు. కానీ, వాటి స్వరూపం ఒకటేనని తెలంగాణ ప్రజలు గ్రహించారు" అని అన్నారు. అంతేకాదు, 'జూట్(అబ‌ద్దాలు) అండ్ లూట్' వారి సాధారణ లక్షణాలని ప‌రోక్షంగా బీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పార్టీల‌ను దుయ్య‌బ‌ట్టారు. బీఆర్‌ఎస్ తన హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు వంటి స్కామ్‌లు చేసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై చర్యలు తీసుకోకుండా ఫైళ్లపై కుస్తీ ప‌డుతోంద‌ని ప్రధాని మోడీ ఆరోపించారు.

అవినీతి, వంశ రాజకీయాలు, బుజ్జగింపులలో కూరుకుపోయినా ఇండియా కూటమి నేతలు భయాందోళనలకు గురవుతున్నా రని ప్రధాని అన్నారు. "నేను వారి వంశ రాజకీయాలను ప్రశ్నిస్తున్నప్పటి నుండి, వారు మోడీకి కుటుంబం లేదని చెప్పడం ప్రారంభించారు. రేపు, 'మీరు ఎప్పుడూ దోషిగా నిర్ధారించబడలేదని, అందువల్ల మీరు రాజకీయాల్లో ఉండలే'రని వారు చెప్పవచ్చు, నా జీవితం తెరిచిన పుస్తకం లాంటి"దని మోడీ వ్యాఖ్యానించారు.

దేశ ప్రజల కోసం జీవించాలనే కలతో తాను చిన్నతనంలోనే ఇంటిని వదిలి వెళ్లిపోయానని మోడీ పేర్కొన్నారు. "నాకు వ్యక్తిగత కలలు ఉండవు. మీ కలల కోసం నేను పని చేస్తా. ఇలాగే నేను నిర్ణయించుకున్నాను" అని అన్నారు. ప్రజలు తనను తమ సొంత‌ వ్యక్తిగా చూస్తారని, వారి కుటుంబ సభ్యుడిలా ప్రేమిస్తారని పేర్కొన్నారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు తమ కుటుంబమని పేర్కొన్న మోడీ, వారి కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. "అందుకే ఈ రోజు దేశం మొత్తం నేను మోడీ కుటుంబాన్ని అంటోంది" అని హర్షధ్వానాల మధ్య ఆయన అన్నారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధి పండుగను జరుపుకునేందుకు తెలంగాణకు వచ్చానన్నారు.

కొందరు తమ అలవాట్లతో బలవంతంగా దీన్ని వచ్చే ఎన్నికలతో ముడిపెడుతున్నారని మోడీ వ్యాఖ్యానించారు. గత 15 రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో తాను ప్రారంభించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయ‌న ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు. "గత 15 రోజుల్లో రెండు IITలు, మూడు IIMలు, ఒక IIS ప్రారంభించాం. అదేవిధంగా, ఐదు ఎయిమ్స్ ప్రారంభించాం. రైతుల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద నిల్వ పథకాన్ని(గోడౌన్లు) ప్రారంభించాం"అని ఆయన చెప్పారు.

విక‌సిత‌ భారత్‌పై 15 లక్షల మంది తమ సూచనలు ఇచ్చారని, 3.75 లక్షల మంది వాటాదారులు కనెక్ట్ అయ్యారని, విక‌సిత భారత్ విజన్‌పై సుమారు 3,000 సమావేశాలు జరిగాయని మోడీ వివ‌రించారు. దేశాభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, అందుకే తెలంగాణ ప్రజలు కూడా 'అబ్కీ బార్, 400 పార్' అంటున్నారని ప్రధాని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ప్ర‌ధాని మోడీ పాల్గొన్న తొలి స‌భ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.