మోడీ ఏడాది పాలన.. బీజేపీ ప్రచారం షురూ!
ప్రధానిగా నరేంద్ర మోడీ దేశంలో 3.0 పాలన ప్రారంభించి .. ఏడాది పూర్తయింది. 2024లో జరిగిన ఎన్నిక ల్లో వరుసగా బీజేపీ విజయం దక్కించుకుంది.
By: Tupaki Desk | 10 Jun 2025 12:30 PMప్రధానిగా నరేంద్ర మోడీ దేశంలో 3.0 పాలన ప్రారంభించి .. ఏడాది పూర్తయింది. 2024లో జరిగిన ఎన్నిక ల్లో వరుసగా బీజేపీ విజయం దక్కించుకుంది. అయితే.. ఇలా బీజేపీ వరుసగా మూడో సారి విజయం దక్కించుకుని పాలనా పగ్గాలు చేపట్టడం.. అనేది ఓ చరిత్ర. ఇప్పటి వరకు కమల నాథులు ఇలా వరుస విజయాలు దక్కించుకున్న చరిత్ర లేదు. ఈ నేపథ్యంలో బీజేపీని వరుసగా అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత మాత్రం పూర్తిగా మోడీకే దక్కింది.
అయితే.. మూడో సారి విజయానికి కొంత ప్రత్యేకత ఉంది. గత రెండు విజయాలు.. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే అధికారం లోకి వచ్చింది. వాస్తవానికి ఆయా ఎన్నికల్లో కూడా.. ఎన్డీయే కూటమిగానే రాజకీయాల్లో పోటీ చేసినా.. ఒంటరిగా అధికారంలోకి వచ్చేంత బలాన్ని దక్కించుకుని.. పాలన సాగించింది. కానీ.. 2024 కు వచ్చేసరికి మాత్రం ఒంటరి బలం పోయి.. ప్రధానంగా.. ఏపీలోని చంద్రబాబు నేతృత్వంలో కూటమిపైనా.. అటు బిహార్ సీఎం నితీష్ కుమార్పైనా ఆధారపడాల్సి వచ్చింది.
ఇదిలావుంటే.. ఈ ఏడాది కాలంలో అటు కూటమిని నొప్పించకుండా.. ఇటు పాలనలో మెరుపులు చూపిస్తూ.. మోడీ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కూటమి విషయంలో బిహార్ సీఎం నితీష్ కుమార్.. కప్పల తక్కెడ టైపులో వ్యవహరిస్తారన్న పేరుంది. ఆయన మాటకు, చేతలకు కూడా నిలకడ ఉండదు అయినా.. మోడీ ఆయనతో పొత్తు పెట్టుకుని సమర్థవంతంగా ముందుకు సాగుతున్నారు. కొన్ని చోట్ల తగ్గుతున్నా.. మరికొన్ని చోట్ల పైచేయి సాధిస్తున్నారు.
ఇక, విదేశాంగ విధానాల పరంగా పాకిస్థాన్పై.. భారత్ పైచేయి సాధించేలా మోడీ వ్యూహాత్మక కార్యాచరణ అద్భుతమేనని చెప్పాలి. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదన్న ప్రచారాన్ని నిజం చేసి చూపించారు. అదేవిధంగా పాకిస్థాన్ను ఎండగట్టే విషయంలోనూ.. దూకుడుగా ఉన్నారు. ఇతర దేశాలతో మైత్రిగా.. మనల్ని విమర్శించే దేశాలకు దూరంగా ఉంటూ వచ్చారనడంలో సందేహం లేదు. ఆయా విషయాలనే బీజేపీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తోంది.