మోడీ గాలి తుస్సుమని తీసిన పెద్దాయన!
ఖర్గే వ్యాఖ్యలు భారత విదేశాంగ విధానంపై, ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాలపై విస్తృత చర్చకు దారితీశాయి.
By: Tupaki Desk | 21 May 2025 4:29 AMభారత ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు లభించే అద్భుతమైన సాదర స్వాగతం, అంతర్జాతీయ వేదికలపై ఆయనకు పెరుగుతున్న ప్రతిష్ట గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. అమెరికాలో 'హౌడీ మోడీ' వంటి భారీ సభలు, సౌదీ అరేబియాలో ఫైటర్ జెట్ ఎస్కార్ట్, రష్యాలో పుతిన్ ఆదరణ వంటి సంఘటనలు మోడీ విదేశీ సంబంధాలను బలోపేతం చేశాయని కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే, ఈ ప్రతిష్ట నిజంగా ఎంతవరకు ప్రయోజనకరం అనే దానిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల చేసిన తీవ్ర విమర్శలు నిజంగానే చర్చనీయాంశమైంది. మోడీ ప్రతిష్ట కేవలం డంబాచారమేనా? భారత్ కు ఆపద వస్తే ఏ దేశం ఎందుకు మద్దతు ఇవ్వలేదన్న ప్రశ్న ఉదయిస్తోంది..
పాకిస్తాన్ ఉగ్రదాడి విషయంలో ఏ దేశమూ భారత్కు మద్దతు ఇవ్వలేదని, మోడీ ప్రతిష్ట మసకబారిందని ఖర్గే ఆరోపించారు. భారత్ దాడులు చేస్తే అమెరికా సపోర్టు చేయకుండా "భారత్-పాక్" రెండూ తమకు సమానమే అని, యుద్ధం ఆపించేయడంలో చొరవ చూపడం మోడీకి స్నేహితుడైన ట్రంప్ వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ట్రంప్ ఏకంగా భారత్ తో సమానంగా పాకిస్తాన్కు వత్తాసు పలకడంతో మోడీ ప్రతిష్ట మసకబారిందన్న విమర్శలు ఉన్నాయి.
ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ "మోడీ గాలి తీసేశాడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఇంతటి పరపతి ఉన్న మోడీకి పాకిస్తాన్ యుద్ధం వేళ ఏ దేశం నుంచి మద్దతు దొరకలేదని, భారత్ ఏకాకిగా మారడానికి ఎన్డీఏ ప్రభుత్వం కారణమని ఆయన తీవ్రంగా విమర్శించారు. మోడీ పర్యటనలు కేవలం ఫొటోలకు మాత్రమే పరిమితమయ్యాయని ఖర్గే 'X' వేదికగా ఆరోపించారు.
"ఎన్డీఏ ప్రభుత్వ విదేశీ విధానంలో భారత్ ఏకాకిగా మిగిలింది" అని ఖర్గే అన్నారు. "ప్రధాని మోదీ గత 11 ఏళ్లలో 151 విదేశీ పర్యటనలకు వెళ్లారు. అందులో యూఎస్నే పదిసార్లు సందర్శించారు. ఇంత చేసినప్పటికీ పాకిస్థాన్ ఉగ్రదాడి విషయంలో ఏ దేశమూ భారత్కు మద్దతు ఇవ్వలేదు. మోదీ పర్యటనలు కేవలం ఫొటోలకు మాత్రమే పరిమితమయ్యాయి" అని ఖర్గే చేసిన విమర్శలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
ఖర్గే వ్యాఖ్యలు భారత విదేశాంగ విధానంపై, ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాలపై విస్తృత చర్చకు దారితీశాయి. మోడీ విదేశీ పర్యటనలు నిజంగా దేశానికి ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తున్నాయనేది ఆలోచించాల్సిన విషయంగా మారింది. అంతర్జాతీయ వేదికలపై ప్రధాని వ్యక్తిగత సంబంధాలు, లభించే స్వాగతాలు దేశ ప్రయోజనాలను ఎంతవరకు కాపాడగలుగుతున్నాయి అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ వంటి ఉగ్రవాద దేశం నుంచి ఎదురవుతున్న సమస్యల విషయంలో అంతర్జాతీయ మద్దతు కూడగట్టడంలో భారత్ ఎందుకు వెనుకబడిందనే ప్రశ్నలకు ప్రస్తుత విమర్శలు సమాధానం కోరుతున్నాయి.