Begin typing your search above and press return to search.

రోల్ మోడల్ చంద్రబాబు.. ప్రధాని మోదీ చెప్పిన మాటలివి..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోదీ మధ్య బంధం రోజురోజుకు తీవ్రమవుతోంది.

By:  Tupaki Desk   |   24 May 2025 12:03 PM
రోల్ మోడల్ చంద్రబాబు.. ప్రధాని మోదీ చెప్పిన మాటలివి..
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోదీ మధ్య బంధం రోజురోజుకు తీవ్రమవుతోంది. తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రభుత్వం కొనసాగేందుకు వెన్నుదన్నుగా నిలుస్తున్న చంద్రబాబును ఆకాశానికెత్తేశాలా ప్రధాని మోదీ వ్యాఖ్యలు ఉండటంపై ఆసక్తి వ్యక్తమవుతోంది. దేశంలో మిగతా రాష్ట్రాల సీఎంలు అందరికీ చంద్రబాబు రోల్ మోడల్ అంటూ మోదీ కితాబిచ్చారు. అందరూ చంద్రబాబును ఫాలో కావాలంటూ సూచించారు. ప్రధాని మోదీ సీఎం చంద్రబాబుపై ఈ స్థాయిలో ప్రశంసించడం వెనుక చాలా పెద్ద కారణం ఉంది.

ప్రధానిగా 3.O ప్రభుత్వాన్ని మోదీ నడుపుతుండగా, చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఇద్దరు ప్రస్తుత టర్మ్ ముగిసిన తర్వాత రాజకీయాల్లో కొనసాగడం కష్టమేనన్న టాక్ వినిపిస్తోంది. ఆరోగ్యంగా ఇద్దరూ ఫిట్ గా ఉన్నప్పటికీ ఇద్దరు నేతలకు 75 ఏళ్ల పైబడిన వారే.. దీంతో వారి వయసు రీత్యా మరోసారి పదవుల్లో కొనసాగడం సాధ్యం కాదంటున్నారు. అయితే ఇద్దరూ ఈ టర్మ్ లో తమ నాయకత్వం చిరస్థాయిగా గుర్తుండిపోయే నిర్ణయాలు తీసుకుంటున్నారు. వికసిత్ భారత్ 2047 అంటూ ప్రధాని మోదీ దేశం కోసం ప్రణాళిక రచిస్తుండగా, స్వర్ణాంధ్ర విజన్ - 2047 పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు.

స్వర్ణ భారత్ కోసం ఒకరు, స్వర్ణాంధ్ర కోసం మరొకరు కలలు కంటున్న ఈ పరిస్థితుల్లో ఒకరికొకరు సహకరించుకుంటూ పాలన సాగిస్తున్నారు. ప్రధానిగా మోదీ తొలిసారి బాధ్యతలు చేపట్టినప్పుడు మోదీ-చంద్రబాబు మధ్య పొత్తు పొడిచింది. అయితే 2018లో ఆ పొత్తు పెటాకులు అవగా, గత ఎన్నికల ముందు మళ్లీ చిగురించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన నుంచి అన్నివిధాలుగా కేంద్రం సహకరిస్తోందని అంటున్నారు. ఇక తరచూ ఢిల్లీ పర్యటనలకు వెళుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు సాధిస్తున్నారు.

ఇక తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నీతి అయోగ్ సమావేశంలో పాల్గొన్నారు. కీలక ఉపన్యాసం చేశారు. వచ్చే రెండు దశాబ్దాలలో సాధించాల్సిన ప్రగతి, అందుకు రూపొందించాల్సిన కార్యాచరణపై చంద్రబాబు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఏపీలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్ బుక్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నామని చంద్రబాబు ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ విజయంపై సైన్యాన్ని అభినందిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత తన ప్రజెంటేషన్ ప్రారంభించిన చంద్రబాబు.. ఏపీలో 2.4 ట్రిలియన్ డాలర్ల ప్రగతి లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించామని వెల్లడించారు.

వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర-2047 ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పిన చంద్రబాబు రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం, వనరులను సద్వినియోగం చేసుకోవడంపై ఫోకస్ పెట్టినట్లు వివరించారు. విశాఖకు అంతర్జాతీయ హంగులు అద్దడంతోపాటుగా రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విభజించాలన్న యోచనలో ఉన్నామని చెప్పారు. అమరావతి, కర్నూలు, తిరుపతి, విశాఖ నగరాలను మోడల్ హబ్ గా తయారు చేయనున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రజెంటేషన్ పై ఆసక్తి కనబరిచిన ప్రధాని మోదీ ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఆయన ప్రజెంటేషన్ తన వికసిత్ భారత్ కల సాకారమయ్యేలా ఉందని కితాబిచ్చారు. మిగిలిన రాష్ట్రాలు చంద్రబాబు ప్రతిపాదనలను పరిశీలించాలని సూచించారు.