Begin typing your search above and press return to search.

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్యే బంధువులు ఐదుగురి దుర్మరణం

విదేశంలో ఉన్న కుమార్తె కుటుంబాన్ని చూసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే బంధువు ఇంట తీవ్ర విషాదం నెలకొంది

By:  Tupaki Desk   |   27 Dec 2023 7:41 AM GMT
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్యే బంధువులు ఐదుగురి దుర్మరణం
X

విదేశంలో ఉన్న కుమార్తె కుటుంబాన్ని చూసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే బంధువు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. క్రిస్మస్ సెలవుల్లో మనవడు, మనవరాలితో ఆనందంగా గడిపిన మరుసటి రోజే అనూహ్యం ఘటన జరిగింది. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇందులో ఏపీకి చెందిన ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. వీరందరూ ముమ్మడివారం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ కు దగ్గరి బంధువులు. టెక్సాస్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో సతీశ్ చిన్నాన్న పొన్నాడ నాగేశ్వరరావు, భార్య సీతా మహాలక్ష్మి, కుమార్తె నవీన్ గంగ, మనవడు, మనవరాలు ప్రాణాలు కోల్పోయారు. అల్లుడు లోకేశ్ కు తీవ్ర గాయాలయ్యాయి.

టెక్సాస్‌ లోని జాన్సన్ కౌంటీలో మంగళవారం హైవే 67పై ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ ఆరుగురిలోనే తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ బాబాయి నాగేశ్వరరావు కుటుంబంగా గుర్తించారు. క్రిస్మస్ సందర్భంగా టెక్సాస్ నుంచి అట్లాంటా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులను, క్షతగాత్రులను ఫోర్ట్‌వర్త్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తెలుగు అసోసియేషన్ ఆప్ నార్త్ అట్లాంటా (తానా) ట్రెజరర్ కొల్లా అశోక్‌బాబు, ఫౌండేషన్ ట్రెజరర్ పోలవరపు శ్రీకాంత్ సంస్థ తరఫున సహాయ చర్యలు చేపడుతున్నారు.

కుమార్తె వద్దకు వెళ్లి..

ఎమ్మెల్యే చిన్నాన్న కుటుంబం ప్రయాణిస్తున్న కారును మరో వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టినట్లు తెలుస్తోంది. టెక్సాస్‌ నుంచి వీరంతా డల్లాస్‌ వెళ్తున్నట్లు చెబుతున్నారు. పొన్నాడ నాగేశ్వరరావు భార్యతో కలిసి ఇటీవల కుమార్తె కుటుంబం వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. కుమార్తె, మనవడు, మనమరాలు, మరో బంధువుతో కలిసి ప్రయాణం చేస్తున్నదానిని బట్టి చూస్తే ఈ విషయం తెలుస్తున్నది. నాగేశ్వరరావు అల్లుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.