Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే రాజాసింగ్ కొత్త డిమాండ్... పోలీసులకు థ్యాంక్స్ కూడా!

ఇందులో భాగంగా... 500 రూపాయల నోటుపై రాముడి బొమ్మను ముద్రించాలని డిమాండ్ చేశారు.

By:  Tupaki Desk   |   20 Jan 2024 1:20 PM GMT
ఎమ్మెల్యే రాజాసింగ్  కొత్త డిమాండ్... పోలీసులకు థ్యాంక్స్  కూడా!
X

తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా... 500 రూపాయల నోటుపై రాముడి బొమ్మను ముద్రించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో తనదైన శైలిలో వాదనను వినిపించిన రాజాసింగ్... విదేశాల్లోని కరెన్సీపై దేవుడి బొమ్మలు ఉన్న విషయాన్ని తెరపైకి తెచ్చారు.

అవును... దేశంలో కోట్లాది మంది హిందువులు రాముడిని ఎంతో భక్తితో కొలుస్తారని, అలాంటప్పుడు ఆయన ఫొటోను 500 రూపాయల నోటుపై ముద్రించాల్సిన అవసరం ఉందని రాజాసింగ్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా... థాయిలాండ్, అమెరికా, ఇండొనేషియాలతో పాటు యూరోప్ లోని కొన్ని దేశాలు తమ నోట్లపై హిందూ దేవతల ఫొటోలను ముద్రించాయని తెలిపారు.

ఇదే క్రమంలో... 80 శాతం ముస్లిం జనాభా ఉన్న ఇండొనేషియా కరెన్సీపై హిందూ దేవతలను ముద్రించడాన్ని గమనించాలని ఈ సందర్భంగా రాజాసింగ్ కోరుతున్నారు. పైగా ఇది తనొక్కడి డిమాండే కాదని.. దేశంలోని 100 కోట్ల మంది హిందువుల డిమాండ్ అని చెప్పుకొచ్చారు రాజాసింగ్!

ఇదే సమయంలో... వక్ఫ్ బోర్డు పేరుతో దేశ వ్యాప్తంగా ఉన్న భూములను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసిన రాజాసింగ్... ఒక్క మహారాష్ట్రలోనే సుమారు 10 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు కింద ఉందని తెలిపారు. 2009 వరకు ఇది 4 లక్షల ఎకరాల వరకూ మాత్రమే ఉండేదని.. అది నేడు 10 లక్షల ఎకరాలకు చేరుకుందని అన్నారు.

పోలీసులు చేసిన పనికి థ్యాంక్స్!:

గత కొన్ని రోజులుగా తనను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదుల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌ గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు.. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఆ బెదిరింపు కాల్స్ చేస్తున్న నిందితుల్ని గుర్తించారు. దీంతో... పోలీసులకు రాజాసింగ్ కృతజ్ఞతలు తెలిపారు.