Begin typing your search above and press return to search.

నిజామాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆత్మహత్య.. తెరపైకి ఫోన్ హ్యాక్!

తెలంగాణలో ఎన్నికల ప్రచారాలతో పార్టీలన్నీ బిజీగా ఉన్నాయి. అభ్యర్థులంతా అలుపెరుగకుండా ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు

By:  Tupaki Desk   |   19 Nov 2023 8:26 AM GMT
నిజామాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆత్మహత్య.. తెరపైకి ఫోన్ హ్యాక్!
X

తెలంగాణలో ఎన్నికల ప్రచారాలతో పార్టీలన్నీ బిజీగా ఉన్నాయి. అభ్యర్థులంతా అలుపెరుగకుండా ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ప్రత్యర్థులపై విమర్శలతో, ప్రజలకూ హామీలతో హోరెత్తించేస్తున్నారు. ఈ సమయంలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఇప్పుడు ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. దీనికి ఫోన్ హ్యాకింగ్ కూడా ఒక కారణం అని తెలుస్తుంది!

అవును... త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి సూసైడ్ చేసుకున్నారు. దీంతో ఈ విషయం తీవ్ర కలకలం లేపింది. నిజామాబాద్ అర్బన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కన్నయ్య గౌడ్ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ ఆత్మహత్య వెనుక కారణాలు ఏమై ఉంటాయి అనే విషయంపై విసృతంగా చర్చ నడుస్తుంది.

గాయత్రి నగర్‌ లో ఉండే కన్నయ్య గౌడ్.. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇండిపెండెంట్‌ గా రంగంలోకి దిగుతున్నారు. ప్రచారాలు చేసుకుంటున్నారు. అయితే శనివారం రాత్రి తన ఇంట్లో ఫ్యాన్‌ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే... అప్పటికే అతడు మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు.

అయితే... కన్నయ్య ఆత్మహత్య వెనుక రాజకీయ కోణం ఉందా.. లేక, వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉన్నాయా.. పైగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఎన్నికలకు మరో 10 రోజులు ఉందనగా సూసైడ్ చేసుకోవడం చర్చనీయాంశమైంది. అయితే... కన్నయ్య ఆత్మహత్యకు ఫోన్ హ్యాకింగ్ కారణం అని తెలుస్తుంది. కొన్ని రోజుల క్రితం కన్నయ్య గౌడ్ ఫోన్‌ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు!

దీంతో సైబర్ నేరగాళ్ల వేధింపులు తట్టుకోలేకనే కన్నయ్య ఆత్మహత్య చేసుకున్నారని అంటున్నారు. పైగా మరో రెండు రోజుల్లో గృహప్రవేశం పెట్టుకుని, 10రోజుల్లో ఎలక్షన్ పెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడడంతో సైబర్ నేరగాళ్ల టార్చర్ ఏ విధంగా ఉండి ఉంటుందో అని అంటున్నారు. ఈ సమయంలో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సందర్భంగా కన్నయ్య ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాలపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు పోలీసులను కోరుతున్నారు!

విషయం తెలుసుకున అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం జరిగిన అనంతరం డెడ్ బాడీని ఫ్యామిలీ మెంబర్స్ కి అప్పగిస్తామని వెల్లడించారు! ఇదె సమయంలో... మృతుడి ఫోన్ స్వాధీనం చేసుకున్నామని, విచారణ తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు!